దాతల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం

గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో చదివి ఉత్తర అమెరికాలో స్థిరపడిన వైద్యులు (జింకానా) జీజీహెచ్‌ అభివృద్ధికి ఎంతో ఉదారంగా ఆర్థికసాయం చేస్తున్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని స్పష్టంచేశారు.

Published : 08 Oct 2022 03:40 IST

గుంటూరులో ఏడాదిలోనే మాతా-శిశు సంరక్షణ కేంద్రం నిర్మిస్తాం

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని

ఈనాడు, అమరావతి: గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో చదివి ఉత్తర అమెరికాలో స్థిరపడిన వైద్యులు (జింకానా) జీజీహెచ్‌ అభివృద్ధికి ఎంతో ఉదారంగా ఆర్థికసాయం చేస్తున్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని స్పష్టంచేశారు. శుక్రవారం ఆస్పత్రిలో రూ.86.80 కోట్లతో డాక్టర్‌ కానూరి రామచంద్రరావు-జింకానా-మాతా, శిశు సంరక్షణ కేంద్రం పునఃప్రారంభ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘ఆస్పత్రిలో 600 పడకలతో కూడిన మాతా-శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్‌ బ్లాక్‌) నిర్మాణానికి గతంలో రెండుసార్లు శంకుస్థాపనలు జరిగాయి. పునాది దశల్లోనే పనులు ఆగిపోయాయి. పునఃప్రారంభానికి గుత్తేదారుకు రూ.6 కోట్ల బకాయిలు చెల్లించాం. సొంత నిధులతో నిర్మించి ప్రభుత్వానికి అప్పగిస్తామని జింకానా ప్రతినిధులు ప్రభుత్వాన్ని సంప్రదించగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తోడ్పాటు అందించారు. ఈ పనులను ఏడాదిలో పూర్తిచేసి గుంటూరు ప్రజల చిరకాల కలను నెరవేరుస్తాం. ఈనెల 15 నుంచి ఆరోగ్యశ్రీలో కొత్తగా 808 వ్యాధులను చేర్చబోతున్నాం. వీటితో కలిపి మొత్తంగా 3254 జబ్బులకు చికిత్స అందుతుంది’ అని వివరించారు. జింకానా ప్రతినిధులు డాక్టర్‌ వి.బాలభాస్కరరావు, డాక్టర్‌ వేణుగోపాల్‌నాయుడు మాట్లాడుతూ... ఆస్పత్రి అభివృద్ధికి నిధుల సమీకరణకు సెప్టెంబరులో సమావేశం నిర్వహించగా గంట వ్యవధిలోనే రూ.50 కోట్లు సమకూరాయన్నారు. రూ.22 కోట్ల చొప్పున విరాళం ప్రకటించిన గవిని ఉమాదేవి, మువ్వా వెంకటేశ్వరరావుల సేవా నిరతిని మంత్రి రజిని, ఎమ్మెల్యే ముస్తఫా ప్రశంసించారు. ఉమాదేవితోపాటు అత్యధిక విరాళాలు ఇచ్చిన వ్యక్తుల చిత్రపటాలను ఆస్పత్రిలో అమర్చాలని ఎమ్మెల్యే ముస్తాఫా కోరారు. మంత్రి నిర్దేశిత సమయం కన్నా గంట ఆలస్యంగా రావడంతో ప్రజాప్రతినిధులు, వైద్యులు నొచ్చుకున్నారు. జింకానా ప్రతినిధులతో సభ ముగిసేవరకు మాట్లాడించలేదు. ఎమ్మెల్యే ముస్తాఫా జోక్యం చేసుకుని సమావేశం చివర్లో మాట్లాడించారు. సభలో ప్రజాప్రతినిధులు సజీల, గిరిధర్‌, అప్పిరెడ్డి, శ్రీదేవి, కృష్ణమూర్తి, లక్ష్మణరావు, శేషగిరిరావు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఆచార్య ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని