నిధుల మళ్లింపుపై గర్జించిన సర్పంచులు

పార్టీలకు అతీతంగా సర్పంచులు కదం తొక్కారు. పోలీసుల ఆంక్షలను తప్పించుకొని రోడ్లపైకి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిన 15వ ఆర్థిక సంఘం నిధులు వెంటనే పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో

Updated : 08 Oct 2022 08:39 IST

కమిషనర్‌ కార్యాలయం ముట్టడికి యత్నం

32 మంది అరెస్టు, విడుదల

ప్రజలకు మేలు చేయని పదవులు రద్దు చేయాలని వాగ్వాదం

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-తాడేపల్లి: పార్టీలకు అతీతంగా సర్పంచులు కదం తొక్కారు. పోలీసుల ఆంక్షలను తప్పించుకొని రోడ్లపైకి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిన 15వ ఆర్థిక సంఘం నిధులు వెంటనే పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని గర్జించారు. నిధులు ఇవ్వాలని, లేదంటే సర్పంచి పదవులను రద్దుచేయాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇన్నాళ్లూ ఓపిక పట్టామని, ఇక తాడోపేడో తేల్చుకుంటామని ఆగ్రహోదగ్రులయ్యారు. తాడేపల్లిలోని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కార్యాలయం ముందు శుక్రవారం కనిపించిన వాతావరణమిది. గ్రామ పంచాయతీలకు కేంద్రం కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.948 కోట్లను విడుదల చేయాలన్న డిమాండుతో పలు జిల్లాల సర్పంచులు కమిషనర్‌ కార్యాలయం ముట్టడికి శుక్రవారం యత్నించారు. ఒకరోజు ముందే సర్పంచుల సంఘం పిలుపునివ్వడంతో గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల సర్పంచులు కార్యక్రమానికి హాజరుకాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. కమిషనర్‌ కార్యాలయానికి ఇతరులెవరూ వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటుచేశారు. పలు జిల్లాల నుంచి తాడేపల్లి చేరుకున్న సర్పంచులు శుక్రవారం ఉదయం 11 గంటల తర్వాత కమిషనర్‌ కార్యాలయానికి చేరుకున్నారు. తమ డిమాండ్లతో కూడిన నినాదాల ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. వీరిని పోలీసులు చుట్టుముట్టడంతో కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. ఈలోగా పంచాయతీరాజ్‌శాఖ ఉప కమిషనర్లు డి.సత్యనారాయణ, నాగార్జునసాగర్‌, గణాంకాధికారి వీరాంజనేయులు వచ్చి సర్పంచులతో మాట్లాడారు. సర్పంచులు మూకుమ్మడిగా అధికారులతో వాగ్వాదానికి దిగారు. సమస్యలపై వినతిపత్రం ఇస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని అధికారులు చెప్పారు. బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేసేవరకూ కదిలేది లేదని సర్పంచులు పట్టుబట్టారు. పోలీసులు వారిని తరలించే ప్రయత్నం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. పలు వాహనాల్లో మంగళగిరి స్టేషన్‌కు తీసుకెళ్లి 32 మందిని అరెస్టుచేసి, తర్వాత విడుదల చేశారు. అనంతరం సర్పంచులంతా అక్కడే అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అరెస్టయిన సర్పంచులను సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు మంగళగిరిలో కలిసి పార్టీ తరఫున సంఘీభావం ప్రకటించారు.


నిధులు కేటాయించకపోతే త్వరలో సీఎం ఇల్లు ముట్టడిస్తాం
‘15వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు ఇప్పటికైనా కేటాయించకపోతే త్వరలో సీఎం ఇల్లు ముట్టడిస్తాం. న్యాయమైన డిమాండ్ల సాధనకు అవసరమైతే పదవులకు రాజీనామా చేయడానికైనా వెనకాడేది లేదు. శాంతియుత వాతావరణంలో సమస్యలు చెప్పుకోడానికి వచ్చిన సర్పంచులను అరెస్టు చేయడం అన్యాయం.’

- గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల సర్పంచుల సంఘం అధ్యక్షుడు సీహెచ్‌ పాపారావు


బోనులో నిలబెట్టాల్సింది ప్రభుత్వాన్నే

‘బోనులో నిలబెట్టాల్సింది.. కేంద్రం కేటాయించిన నిధులను తమ పంచాయతీలకు ఇవ్వాలని అడుగుతున్న సర్పంచులను కాదు, నిధులు దారి మళ్లించిన రాష్ట్ర ప్రభుత్వాన్నే. స్థానిక సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. పంచాయతీలకు సమాంతరంగా సచివాలయాలను తీసుకొచ్చి సర్పంచులకు అధికారాలు లేకుండా చేసింది. విద్యుత్తు ఛార్జీలు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను ప్రభుత్వమే చెల్లించాలి. సర్పంచుల సమస్యలు పరిష్కరించకుండా వారిని అరెస్టు చేయడం అన్యాయం.’

- సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు


సర్పంచుల అరెస్టు దుర్మార్గం

‘చట్టబద్ధంగా రావలసిన నిధులను పంచాయతీలకు కేటాయించాలని శాంతియుత వాతావరణంలో ఆందోళన చేస్తున్న సర్పంచులను అరెస్టు చేయడం దుర్మార్గం. కేంద్రం కేటాయించిన ఆర్థిక సంఘం నిధులు పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని ప్రభుత్వాన్ని చాలాసార్లు కోరాం. పంచాయతీల్లో నిధుల కొరతతో సర్పంచులు చిన్న చిన్న పనులూ చేయలేకపోతున్నారు. న్యాయంగా రావల్సిన నిధులను ఇప్పించాలని అడిగిన సర్పంచుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం’

- అఖిలభారత పంచాయతీ పరిషత్‌ జాతీయ కార్యదర్శి జె.వీరాంజనేయులు


మా పంచాయతీవి రూ.20 లక్షలు మళ్లించారు

ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీ విద్యుత్తు బకాయిల కింద చెల్లించామని చెప్పడంలో నిజం లేదు. మా పంచాయతీ విద్యుత్తు పంపిణీ సంస్థకు రూ.22.80 లక్షలు బకాయి ఉన్నట్లు చూపించి... ఆర్థిక సంఘం నిధులు రూ.20 లక్షలు మళ్లించారు. అలా చెల్లిస్తే ఇంకా రూ.2.80 లక్షలే బాకీ ఉండాలి. కానీ, రూ.34 లక్షలుగా చూపిస్తున్నారు. మరి ఆర్థిక సంఘం నిధులు ఎక్కడికి వెళ్లినట్లు?

- మనోహర్‌, వైకాపా సర్పంచి, బండారుపల్లి, గుంటూరు జిల్లా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని