మూడేళ్లలో ఒక్క పోస్టూ నింపలే!

ఏపీకి ఆంధ్ర విశ్వవిద్యాలయం గర్వకారణం. ఇది దేశంలో 14వ స్థానంలో ఉండడం కాస్త అసంతృప్తి కలిగిస్తోంది. దీనికి కొన్నేళ్లుగా ప్రభుత్వ ప్రోత్సాహం లేదని గుర్తించాం.

Published : 08 Oct 2022 03:40 IST

విశ్వవిద్యాలయాల్లో వందల సంఖ్యలో అధ్యాపకుల ఖాళీలు

ప్రాభవం కోల్పోతున్న ప్రభుత్వ విద్యాసంస్థలు

విమర్శ
ఏపీకి ఆంధ్ర విశ్వవిద్యాలయం గర్వకారణం. ఇది దేశంలో 14వ స్థానంలో ఉండడం కాస్త అసంతృప్తి కలిగిస్తోంది. దీనికి కొన్నేళ్లుగా ప్రభుత్వ ప్రోత్సాహం లేదని గుర్తించాం. 459 ఆచార్యుల పోస్టులు ఖాళీగా ఉన్నందున ప్రభుత్వం తలదించుకోవాలి.

- 2019 డిసెంబరు 13న ఏయూలో జరిగిన సమావేశంలో సీఎం జగన్‌

వాస్తవం
మూడేళ్లుగా ఏ విశ్వవిద్యాలయంలోనూ ఒక్క పోస్టూ నింపలేదు. 2వేల సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ ఇస్తామని చెప్పినా, ఇప్పటికీ రాలేదు. ఏయూలో 920 పోస్టులు ఉండగా, రెగ్యులర్‌ అధ్యాపకులు 190 మంది మాత్రమే.

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో కలిపి 3,259 అధ్యాపక పోస్టులకు 60 శాతానికిపైగా ఖాళీగా ఉన్నాయి. ఒప్పంద అధ్యాపకులతోనే బోధన సాగిస్తున్నారు. ఇంజినీరింగ్‌ కోసమే ప్రత్యేకంగా నెలకొల్పిన అనంతపురం జేఎన్‌టీయూలో 146 పోస్టులకు 48 మందిని నియమించగా, 244మంది ఒప్పంద అధ్యాపకులున్నారు. కాకినాడ జేఎన్‌టీయూలో 102 పోస్టుల్లో 41ఖాళీలు ఉన్నాయి. 233మంది ఒప్పంద అధ్యాపకులే. పులివెందుల, కలికిరి, నరసరావుపేట కళాశాలలు, కొత్తగా ఉన్నతీకరించిన విజయనగరం గురజాడ జేఎన్‌టీయూలోనూ భారీగా ఖాళీలున్నాయి. విశ్వవిద్యాలయాలు స్థాపించినప్పుడు మంజూరైన పోస్టులు మినహా.. తర్వాత కోర్సులు, బ్రాంచీలు విస్తరించినప్పటికీ ఆ మేరకు పోస్టులు ఇవ్వలేదు. ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్‌ కోర్సులతో ప్రారంభించిన ఆర్జీయూకేటీకి 717 పోస్టులు మంజూరుకాగా, 52 మంది రెగ్యులర్‌ ఉద్యోగులున్నారు. రానున్న రెండేళ్లల్లో తిరుపతి ఎస్వీయూలో సుమారు 60మంది, విశాఖ ఏయూలో 50మంది రిటైర్‌ కానున్నారు. మిగతా వర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి.
సాంకేతిక విద్యలో వస్తున్న కొత్త కోర్సులకు అనుగుణంగా విద్యాసంస్థల్లో మార్పులు చేయాలంటే అధ్యాపకుల కొరత అడ్డంకిగా మారుతోంది. కొన్నింటిని సెల్ఫ్‌ ఫైనాన్స్‌లోకి మార్చి, ఒప్పంద అధ్యాపకులను నియమిస్తున్నారు. న్యాక్‌, ఎన్‌బీఏ గుర్తింపునకు అధ్యాపక పోస్టులే కీలకం. మౌలిక సదుపాయాలు కొరవడి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)లోనూ ఇంజినీరింగ్‌ కళాశాలలు ప్రభ మసకబారింది. గత నాలుగేళ్ల ర్యాంకులు చూస్తే కాకినాడ, అనంతపురంలోని జేఎన్‌టీయూల పరిస్థితి దిగజారింది. ఆంధ్ర వర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాభవాన్ని కోల్పోతోంది. ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీవేంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాలదీ అదే పరిస్థితి. ఇవి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కావడంతో ప్రవేశపరీక్షల్లో మంచి ర్యాంకులు వచ్చిన విద్యార్థులు ఇక్కడే చేరుతున్నారు. తీరా ఈ సమస్యలు చూసి ఆందోళన చెందుతున్నారు. వసతిగృహాలు, వాటిల్లో సదుపాయాలు, భోజనాలపైనా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయిలకు వసతిలోనూ ఇబ్బందులున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని