Vande bharat express: వందే భారత్‌ వచ్చేస్తోంది!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందేభారత్‌ (ట్రైన్‌-18) ఎక్స్‌ప్రెస్‌ రాష్ట్రానికి రావడం దాదాపుగా ఖరారైంది.

Updated : 09 Nov 2022 13:31 IST

సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి ప్రయాణం
దక్షిణ మధ్య రైల్వేకు సమాచారమిచ్చిన బోర్డు

ఈనాడు, హైదరాబాద్‌: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందేభారత్‌ (ట్రైన్‌-18) ఎక్స్‌ప్రెస్‌ రాష్ట్రానికి రావడం దాదాపుగా ఖరారైంది. దక్షిణ మధ్య (ద.మ.) రైల్వేకు తొలి రైలును రైల్వే బోర్డు కేటాయించినట్లు ఇక్కడి అధికారులకు సమాచారం అందింది. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్‌ నుంచి ఏ మార్గంలో నడిపించాలనే విషయంపై రైల్వేబోర్డు కసరత్తు చేస్తోంది. అత్యంత ఆధునిక, వేగవంతమైన రైలు అయినప్పటికీ ప్రస్తుతానికి ఇందులో బెర్తులు లేవు. శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ మాదిరిగా కూర్చుని ప్రయాణించాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువ దూరం..రాత్రంతా ప్రయాణం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గరిష్ఠంగా 10 గంటల్లోపే చేరే గమ్యస్థానాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఉదయమే బయల్దేరి సాయంత్రానికి, లేదా రాత్రి 9, 10 గంటల్లోపు గమ్యస్థానం చేరేలా కసరత్తు చేస్తున్నారు. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు, ముంబయి వంటి మార్గాల్ని పరిశీలిస్తున్నారు.

ప్రయాణికుల డిమాండ్‌ అటువైపే..

సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు నగరాలకు రైలు రిజర్వేషన్‌కు గిరాకీ ఉంటుంది. విశాఖ వైపు నిత్యం దాదాపు డజను రైళ్లున్నా అంత సులభంగా రిజర్వేషన్‌ దొరకదు. తిరుపతి వెళ్లే వారయితే నెల ముందే రిజర్వేషన్‌ చేయించుకుంటారు. బెంగళూరుకు రైలు కంటే బస్సుల్లోనే రెండు గంటల ముందే చేరుకుంటుండంతో బస్సు ప్రయాణానికి ఎక్కువమంది ప్రాధాన్యమిస్తున్నారు.

ఆరో వందే భారత్‌ రైలు మనకే..

చెన్నైలోని ఇంటిగ్రేటెడ్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌)లో తయారయ్యే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లకు గరిష్ఠంగా 180 కిమీ వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉంది. ఇవి ఇప్పటివరకు నాలుగు పట్టాలెక్కాయి. అయిదోది మైసూర్‌-బెంగళూరు-చెన్నై రైలు ఈ నెల 10న పట్టాలు ఎక్కనుంది. దక్షిణ భారతానికి ఇదే తొలి రైలు. ఆరో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ మాత్రం తెలంగాణకే. ప్రారంభ స్థానం సికింద్రాబాద్‌ నుంచే అని ఓ అధికారి తెలిపారు. రైల్వే బోర్డు అధికారులు సికింద్రాబాద్‌-బెంగళూరు మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. రాష్ట్రం నుంచి బయల్దేరేలా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కావాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇటీవల రైల్వే మంత్రి అశ్వినీకుమార్‌ వైష్ణవ్‌ను కలిసి కోరారు. సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా తిరుపతికి.. లేదంటే విశాఖపట్నానికి నడపాలని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయా రూట్లలో ప్రస్తుత ట్రాఫిక్‌, ప్రయాణికుల డిమాండ్‌ వంటి సాంకేతిక, ఆర్థిక అంశాల్ని రైల్వే బోర్డు అధ్యయనం చేస్తోంది.


సమాచారం అందింది

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ రైలు నిర్వహణ సికింద్రాబాద్‌లోనే ఉంటుంది. నిర్వహణకు అయిదారు గంటల సమయం పడుతుంది. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు నిర్వహణకు సిద్ధంగా ఉండాలని..ఏర్పాట్లు చేసుకోవాలని సమాచారం వచ్చింది. ప్రయాణం ఏ రూట్లో.. ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.

- అభయ్‌కుమార్‌ గుప్తా, డీఆర్‌ఎం - సికింద్రాబాద్‌


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని