Andhra News: ఐ లవ్‌ యూ డార్లింగ్‌!

‘లవ్‌ యూ బంగారం.... ఐ లవ్‌ యూ డార్లింగ్‌.... నీతో మాట్లాడి   ఎన్నాళ్లైందో.. ముందు నీ ఫొటో పంపు.. నాలుగో తేదీన దిల్లీలో కలుద్దామా’ అంటూ ఓ మహిళతో ఓ వ్యక్తి జరిపిన సంభాషణలు ఆదివారం సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి.

Updated : 14 Nov 2022 06:50 IST

మళ్లీ మాజీ మంత్రి ముత్తంశెట్టి స్వరం పేరిట కలకలం
ఓ మహిళతో సంభాషణలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌
సైబర్‌ క్రైం స్టేషన్‌లో ఫిర్యాదు

ఈనాడు, విశాఖపట్నం: ‘లవ్‌ యూ బంగారం.... ఐ లవ్‌ యూ డార్లింగ్‌.... నీతో మాట్లాడి   ఎన్నాళ్లైందో.. ముందు నీ ఫొటో పంపు.. నాలుగో తేదీన దిల్లీలో కలుద్దామా’ అంటూ ఓ మహిళతో ఓ వ్యక్తి జరిపిన సంభాషణలు ఆదివారం సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఆ స్వరం మాజీ మంత్రి, వైకాపా విశాఖ జిల్లా అధ్యక్షుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావుదేనంటూ కొన్ని ఛానళ్లు ఆయన ఫొటోతో సహా కథనాలు ప్రసారం చేయడంతో కలకలం రేగింది. ఫోన్లో మాట్లాడిన మహిళ తాను హైదరాబాద్‌లోని ‘ప్రియాంక రెసిడెన్సీ’లోకే ఇల్లు మారుతున్నానని చెప్పగా... తన కుమార్తె చాలా షార్ప్‌ అని, పసిగట్టేస్తుందని... అక్కడికి ఎందుకని’ ఇవతలి వ్యక్తి ప్రశ్నించారు. గతంలో ముత్తంశెట్టి మంత్రిగా ఉన్న సమయంలో ఆయన విశాఖ నగరానికి చెందిన ఓ వివాహితతో ప్రేమపూర్వక సంభాషణలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొట్టాయి. తన గొంతును అనుకరించి ఫేక్‌ సంభాషణలు రికార్డు చేశారని ఆయన సైబర్‌ క్రైం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ కేసు దర్యాప్తును అధికారులు ఇంకా పూర్తి చేయనే లేదు. వాస్తవాలు ఏమిటన్నవి బయటపడలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన స్వరంతో పోలిన మరో ‘వాయిస్‌ క్లిప్పింగ్‌’ వెలుగు చూడటం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తన పీఏ ద్వారా ఫిర్యాదు చేయగా.. మళ్లీ సైబర్‌ క్రైం పోలీసులు రంగంలోకి దిగారు.


సైబర్‌ క్రైం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయించా

నా కీర్తి ప్రతిష్ఠలను, రాజకీయ భవిష్యత్తును నాశనం చేసేందుకే కొందరు ఉద్దేశపూర్వకంగా నా స్వరాన్ని పోలిన సంభాషణలు విడుదల చేశారు. నేను గత 15 రోజులుగా అయ్యప్పస్వామి మాలలో ఉన్నా. పది రోజుల కిందటే ఈ విషయం నా దృష్టికి వచ్చింది. దీనిపై సైబర్‌ క్రైం పోలీసు స్టేషన్లో ఈనెల 11న ఫిర్యాదు చేయించా. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

- ముత్తంశెట్టి శ్రీనివాసరావు


న్యాయ సలహా తీసుకుని కేసు నమోదు చేస్తాం

మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఫిర్యాదుపై న్యాయ సలహా తీసుకుంటున్నాం. సంబంధిత సెక్షన్లతో కేసు నమోదు చేస్తాం. ఈ సంభాషణలు వేల మందికి చేరాయి. మొట్టమొదట ఎవరు దీనిని సామాజిక మాధ్యమాల్లోకి విడుదల చేశారన్నది తెలుసుకోవడానికి సమయం పడుతుంది.

- కె.భవానీ ప్రసాద్‌, సీఐ, సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని