ఇళ్ల నిర్మాణ నాణ్యతలో రాజీపడొద్దు

నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ల పథకం కింద చేపడుతున్న గృహ నిర్మాణాల నాణ్యతలో రాజీపడొద్దని అధికారులకు ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. నిర్మాణం జరిగే ప్రతి దశలోనూ నాణ్యత పరీక్షలు జరగాలని నిర్దేశించారు.

Updated : 25 Nov 2022 06:34 IST

ప్రతి దశలోనూ పరీక్షలు చేయాలి
విధిగా లేఅవుట్లను సందర్శించాలి
గృహనిర్మాణంపై సమీక్షలో సీఎం ఆదేశం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ల పథకం కింద చేపడుతున్న గృహ నిర్మాణాల నాణ్యతలో రాజీపడొద్దని అధికారులకు ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. నిర్మాణం జరిగే ప్రతి దశలోనూ నాణ్యత పరీక్షలు జరగాలని నిర్దేశించారు. నాణ్యత ప్రమాణాలు పాటించే విషయంలో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లను భాగస్వాముల్ని చేయాలని ఆదేశించారు. తాడేపల్లిలో ఆయన గురువారం గృహ నిర్మాణశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ఇళ్ల నిర్మాణాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. లేఅవుట్లలో పర్యటించి నిర్మాణ ప్రగతిపై సమీక్షించి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలి. అధికారులు లేఅవుట్లను సందర్శించినట్లుగా ఫొటోలను అప్‌లోడ్‌ చేయాలి’ అని పేర్కొన్నారు.

అనుకున్న సమయానికి పూర్తి కావాలి

‘ఇళ్లు లేని పేదలందరికీ లబ్ధి చేకూర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. గృహాల నిర్మాణానికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.5,655 కోట్లు ఖర్చు చేశాం. అనుకున్న సమయానికి నిర్మాణాలు పూర్తి కావాలి. ఇళ్లు పూర్తయ్యేసరికి విద్యుత్తు, తాగునీరు, డ్రైనేజీ సదుపాయం తప్పనిసరిగా కల్పించాలి. ఇతర మౌలిక సదుపాయాలను వృద్ధి చేసుకుంటూ ముందుకెళ్లాలి. ప్రభుత్వమే ఇళ్లు కట్టించి అందించే విధానమైన ఆప్షన్‌-3ని ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల గృహాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి’ అని సూచించారు. ప్రతి శనివారాన్ని ‘హౌసింగ్‌ డే’గా నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఆ రోజు తప్పనిసరిగా అధికారులు లేఅవుట్లను సందర్శిస్తున్నారని తెలిపారు. మౌలిక సదుపాయాలకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌లు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. ప్రాధాన్య క్రమంలో పనులు చేసుకుంటూ వెళుతున్నామని సీఎంకు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని