సమష్టి కృషితోనే ‘యాంటీబయోటిక్స్‌’ నియంత్రణ

సమష్టి కృషి, పక్కా కార్యాచరణతోనే యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌ (ఏఎంఆర్‌) సాధ్యమవుతుందని ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌ అకాడమీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డాక్టర్‌ బి.రంగారెడ్డి పేర్కొన్నారు.

Published : 26 Nov 2022 05:22 IST

విజయవాడలో ఏఎంఆర్‌పై సదస్సులో వక్తలు

ఈనాడు-అమరావతి: సమష్టి కృషి, పక్కా కార్యాచరణతోనే యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌ (ఏఎంఆర్‌) సాధ్యమవుతుందని ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌ అకాడమీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డాక్టర్‌ బి.రంగారెడ్డి పేర్కొన్నారు. వైద్యుల సూచనలు పాటించకుండా యాంటీబయోటిక్‌ మందులను వాడటం ప్రపంచ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఎంఆర్‌ కార్యాచరణ ప్రణాళికను రాష్ట్రంలో ఎలా అమలు చేయాలన్న అంశంపై విజయవాడలో శుక్రవారం ప్రారంభమైన సదస్సులో ఆయనతోపాటు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఏషియన్‌ బయోటెక్నాలజీ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ అధ్యక్షుడు డాక్టర్‌ పి.రెడ్డెన్న, శ్రీవేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ ఆనందకుమార్‌ తదితరులు మాట్లాడారు. వర్చువల్‌ విధానంలో దిల్లీ నుంచి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు మాట్లాడారు.

వైద్యులు రాసిచ్చిన మేరకే మందుల దుకాణాలనుంచి యాంటీబయోటిక్స్‌ విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నేషనల్‌ సెంటర్‌ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ) ఆధ్వర్యంలో ఇండోడచ్‌ ప్రాజెక్టును రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు కింద చేపట్టేందుకు అధ్యయనం చేస్తున్నామన్నారు. వైద్య విద్య డైరెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌, డ్రగ్‌ కంట్రోల్‌ డీజీ రవిశంకర్‌ నారాయణ్‌, హైదరాబాద్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నియాజ్‌అహ్మద్‌, ఎన్‌సీడీసీ అదనపు డైరెక్టర్‌ డాక్టర్‌ లతాకపూర్‌, తిరుపతి స్విమ్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వెంగమ్మ తదితరులు మాట్లాడారు. దేశంలో తొలిసారి ఏఎంఆర్‌ అమలుచేస్తున్న కేరళలో తీసుకుంటున్న చర్యలను ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వర్చువల్‌ విధానంలో వివరించారు. నెదర్లాండ్స్‌, జర్మనీ, డెన్మార్క్‌, బంగ్లాదేశ్‌ ప్రతినిధులూ తమ అభిప్రాయాలను తెలిపారు. ఏఎంఆర్‌ కార్యాచరణ ప్రణాళిక బలోపేతానికి సంబంధించిన ‘విజయవాడ డిక్లరేషన్‌’ను శనివారం జరిగే సదస్సులో విడుదల చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని