ఏ అవకాశాన్నీ వదలరు!

‘ఆర్టీసీ డిపోలకు అందరికంటే ఒక రూపాయి తక్కువ ధరకే డీజిల్‌ సరఫరా చేస్తాం. మాకు అనుమతివ్వండి’ అంటూ అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని బంకుల యజమానులు ముందుకొస్తున్నారు. సరఫరా చేస్తున్నారు కూడా.

Updated : 27 Nov 2022 05:48 IST

కర్ణాటక నుంచి వైకాపా నేతల డీజిల్‌ అక్రమ రవాణా
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్టీసీ డిపోలకు రోజుకు లక్ష లీటర్ల విక్రయం
ప్రతి లీటరుపై రూ.8.70 లాభం
ప్రతిగా అధికారులకు ముడుపులు, కార్ల బహుమతి

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: ‘ఆర్టీసీ డిపోలకు అందరికంటే ఒక రూపాయి తక్కువ ధరకే డీజిల్‌ సరఫరా చేస్తాం. మాకు అనుమతివ్వండి’ అంటూ అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని బంకుల యజమానులు ముందుకొస్తున్నారు. సరఫరా చేస్తున్నారు కూడా. తక్కువ ధరకు డీజిల్‌ ఇస్తే మంచిదే కదా... కష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఎంతోకొంత కలిసొస్తుందని అనుకుంటే పొరపాటే. వారంతా కర్ణాటక నుంచి డీజిల్‌ తెప్పించి ఇక్కడ సరఫరా చేస్తున్నారు. ఏపీతో పోలిస్తే కర్ణాటకలో లీటరు డీజిల్‌ రూ.9.70 తక్కువ. రూపాయి తక్కువకే ఇస్తామని చెప్పి ప్రతి లీటరుపై రూ.8.70 లాభాన్ని జేబులో వేసుకుంటున్నారు. వైకాపా నేతల అండదండలతో ఈ దందా నిరాటంకంగా సాగుతోంది. వాణిజ్య పన్నులశాఖ అధికారులు ట్యాంకర్లను పట్టుకుంటే ఏపీలోనే కొన్నట్లు పత్రాలు సృష్టించి తప్పించుకుంటున్నారు.

ఖజానాకు రోజుకు రూ.కోటి గండి

ఏపీలో ప్రస్తుతం డీజిల్‌ ధర (అనంతపురంలో) లీటరు రూ.99.42. ఇందులో రాష్ట్రానికి వ్యాట్‌ రూపంలో 22.25%, ప్రతి లీటరుపై రూ.4 అదనపు వ్యాట్‌, 1% రోడ్డు సెస్సు చెల్లించాల్సి ఉంటుంది.

అంటే రాష్ట్ర ఖజానాకు ప్రతి లీటరుపై రూ.27 చేరుతుంది. డీజిల్‌ను కర్ణాటకలో కొంటుండటంతో మన రాష్ట్రానికి ప్రతి లీటరుపై రూ.27 నష్టం వాటిల్లుతోంది. ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే రోజుకు లక్ష లీటర్లు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ప్రతిరోజు రూ.27 లక్షలు కోల్పోతోంది. ఉమ్మడి కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లోని అత్యధిక ఆర్టీసీ డిపోలకు, జేసీబీ, లారీల యజమానులకు కర్ణాటక డీజిల్‌నే సరఫరా చేస్తున్నట్లు సమాచారం. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు రోజుకు రూ.కోటి నష్టం వాటిల్లుతోంది.

గుంతకల్లు కేంద్రంగా వ్యవహారం

కర్ణాటక డీజిల్‌ దందా వెనుక గుంతకల్లుకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. వీరికి అనంతపురంతోపాటు కర్ణాటకలోనూ పెట్రోలు బంకులున్నాయి. రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి తనయుడి అండతో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆలూరు, ఆదోని ప్రాంతాలకు డీజిల్‌ సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దందాలో సంబంధిత అధికారులకు ఒక్కో ట్యాంకరుకు రూ.20వేల చొప్పున ముడుపులు అందుతున్నట్లు సమాచారం. ఇటీవల ఆర్టీసీలో కీలక పదవిలో ఉన్న ఓ నేతకు ఖరీదైన కారు బహుమతిగా అందినట్లు తెలిసింది.

* అనంతపురం ఆర్టీసీ బస్టాండులో అక్టోబరు 17న ఒక డీజిల్‌ ట్యాంకర్‌ను అధికారులు పట్టుకున్నారు. హిందూపురంలోని ఓ పెట్రోల్‌ బంకు నుంచి వచ్చినట్లు పత్రాలు చూపించగా అవి నకిలీవని తేల్చారు. ట్యాంకరు కర్ణాటక నుంచి వచ్చినట్లు గుర్తించారు. వాహనాన్ని సీజ్‌ చేసి, రూ.6.4 లక్షలు జరిమానా విధించారు.
బీ సెప్టెంబరులో వాణిజ్య పన్నులశాఖ అధికారులు జరిపిన తనిఖీల్లో పెనుకొండలోని ఓ పెట్రోలు బంకులో భారీగా అవకతవకలు గుర్తించారు. రూ.5 కోట్ల వరకు పన్నులు ఎగ్గొట్టినట్లు తేల్చి రూ.10 కోట్లు జరిమానా విధించారు.


తనిఖీలు చేస్తున్నాం

ఉమ్మడి అనంతపురం జిల్లాలో కర్ణాటక డీజిల్‌ సరఫరా చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో రెండు నెలలుగా తనిఖీలను ముమ్మరం చేశాం. ఆర్టీసీకి సరఫరా చేస్తున్న పెట్రోలు బంకుల వివరాలను సేకరించాం. చమురు సంస్థల డిపోల నుంచి వాటికి ఎంత డీజిల్‌ వెళ్తోంది. అక్కడ్నుంచి ఆర్టీసీకి ఎంత సరఫరా చేస్తున్నారనే అంశాలపై ఆరా తీస్తున్నాం.

- నీరజ, అదనపు కమిషనర్‌, వాణిజ్య పన్నులశాఖ


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు