పాపికొండల యాత్ర పునఃప్రారంభం

గోదావరి అలలపై బోటులో సాగిపోయే పాపికొండల యాత్రను తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ తిరిగి ప్రారంభించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన పాపికొండల విహారాన్ని పునరుద్ధరించినట్లు  సంస్థ తెలిపింది.

Updated : 28 Nov 2022 04:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: గోదావరి అలలపై బోటులో సాగిపోయే పాపికొండల యాత్రను తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ తిరిగి ప్రారంభించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన పాపికొండల విహారాన్ని పునరుద్ధరించినట్లు  సంస్థ తెలిపింది. ప్రతి శుక్రవారం రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్‌ పర్యాటక భవన్‌ నుంచి బయలుదేరే బస్సు మరుసటి రోజు (శనివారం) వేకువజామున 5 గంటలకు భద్రాచలం చేరుకుంటుంది. భక్తులు అక్కడ స్నానాలు ముగించుకుని ఉదయం 7 గంటలకు రాములవారిని దర్శించుకుంటారు. అనంతరం అక్కడే కొన్ని పర్యాటక ప్రాంతాలను చుట్టివచ్చి ఉదయం 8.30 గంటలకు పోచారం బోటింగ్‌ పాయింట్‌కు చేరుకుంటారు. పేరంటాలపల్లి మీదుగా కొల్లూరుకు బోటులో చేరుకుంటారు. బోటులోనే మధ్యాహ్న భోజనం చేసి రాత్రి కొల్లూరులోని బాంబూహట్స్‌లో బస చేస్తారు. మూడోరోజు (ఆదివారం) ఉదయం కొల్లూరులో అల్పాహారం ముగించుకుని అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్‌, నదీ స్నానం పూర్తి చేస్తారు. మధ్యాహ్న భోజనం చేసి పోచారం బయలుదేరుతారు. పర్ణశాల సందర్శించిన తరవాత తిరిగి భద్రాచలం చేరుకుంటారు. అక్కడ హరిత హోటల్‌లో రాత్రి భోజనం చేస్తారు. అదేరోజు రాత్రి 9 గంటలకు భద్రాచలం నుంచి బయలుదేరి నాలుగో రోజు (సోమవారం) ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటారు.

టిక్కెట్‌ ధరలివీ: పెద్దలకు రూ. 6499; చిన్నారులకు రూ. 5199. ఏసీ బస్సుల్లో ప్రయాణం, నాన్‌ ఏసీలో వసతి ఉంటుంది. పూర్తి వివరాలకు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ వెబ్‌సైట్‌లో కానీ, టోల్‌ఫ్రీ నంబరు 1800-425-46464లోగానీ సంప్రదించాలని ఆ సంస్థ సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని