ఏపీలో పక్కదారి పడుతున్న బియ్యం

పేదల కోసం కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం రాష్ట్రంలో పక్కదారి పడుతున్నాయని, దీనిపై సీబీఐ విచారణ చేయించాలని భాజపా పొలిటికల్‌ ఫీడ్‌బ్యాక్‌ ప్రముఖ్‌ లంకా దినకర్‌ డిమాండుచేశారు.

Published : 28 Nov 2022 04:50 IST

సీబీఐ విచారణకు భాజపా నేత లంకా దినకర్‌ డిమాండు

ఈనాడు, అమరావతి: పేదల కోసం కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం రాష్ట్రంలో పక్కదారి పడుతున్నాయని, దీనిపై సీబీఐ విచారణ చేయించాలని భాజపా పొలిటికల్‌ ఫీడ్‌బ్యాక్‌ ప్రముఖ్‌ లంకా దినకర్‌ డిమాండుచేశారు. 2019 ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు ఆహార రాయితీ కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.25,590 కోట్లు అందాయని వివరించారు. సమాచారహక్కు చట్టం, భారతీయ రిజర్వ్‌బ్యాంకు నివేదికల సమాచారం ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో బియ్యం పథకంలో భారీ కుంభకోణం జరిగిందన్నారు. ‘2019-20 నుంచి 2022-23లో ఇప్పటివరకు 62.05 లక్షల టన్నుల బియ్యాన్ని కేంద్రం ఇస్తే.. 56.39 లక్షల టన్నులనే రాష్ట్రప్రభుత్వం పంపిణీ చేసింది. మిగిలిన 5.66 లక్షల టన్నులు ఏమయ్యాయో తెలియడం లేదు. 14 రాష్ట్రాల్లో కేంద్రం నుంచి తీసుకున్న బియ్యం కంటే ఎక్కువగా పంపిణీ చేయగా.. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది’ అని ఒక ప్రకటనలో విమర్శించారు. ‘దేశంలోనే అత్యధికంగా కాకినాడ నుంచి బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయి. అవి ఎక్కడ నుంచి వస్తున్నాయి? విదేశాల్లో బియ్యం వ్యాపారమంతా ఎవరి కనుసన్నల్లో జరుగుతోందనే విషయాలను సీబీఐ నిగ్గు తేలుస్తుంది’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని