‘కొత్త అనుమతులు’ ఇచ్చేద్దాం!

ఉన్న డిగ్రీ కళాశాలల్లోనే సీట్లు మిగిలిపోతుండగా, మరోవైపు కొత్త ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు అనుమతులు ఇచ్చేందుకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

Updated : 29 Nov 2022 04:52 IST

200 ప్రైవేటు డిగ్రీ కళాశాలలను తెచ్చేందుకు కసరత్తు
సగం సీట్లు మిగిలిపోతున్నా కొత్తవాటిపైనే దృష్టి

ఈనాడు, అమరావతి: ఉన్న డిగ్రీ కళాశాలల్లోనే సీట్లు మిగిలిపోతుండగా, మరోవైపు కొత్త ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు అనుమతులు ఇచ్చేందుకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం నియోజకవర్గానికో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలల్లోనే ప్రవేశాలు 50 శాతానికి మించడం లేదు. ప్రభుత్వ కళాశాలల్లో 57,061 సీట్లు ఉండగా, ఈ ఏడాది వీటిల్లో 26,227 సీట్లు మాత్రమే నిండాయి. ఇప్పుడు కొత్తగా ప్రైవేటు కళాశాలలకు అనుమతులిస్తే ఏ కళాశాలలోనూ పూర్తిస్థాయిలో విద్యార్థులు చేరక నిర్వహణ గాడితప్పి నాణ్యమైన విద్య అందని పరిస్థితి ఏర్పడుతుంది. ఇవేవీ పట్టించుకోకుండా రాజకీయ ఒత్తిళ్లతో కొన్ని సంస్థలకు అనుమతులిచ్చేందుకే నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఉన్నత విద్యాశాఖ ప్రయత్నిస్తున్నట్లు విమర్శలున్నాయి.

యూజీసీ సవరించిన నిబంధనల ప్రకారం కళాశాలలకు అనుమతులు ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 200 కళాశాలల ఏర్పాటుకు అనుమతులివ్వాలని ఉన్నత విద్యా శాఖ భావిస్తోంది. ఈ మేరకు ఆ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక సమర్పించింది. కళాశాల ఏర్పాటుచేసి పదేళ్లైనా అద్దె భవనాల్లో కొనసాగుతున్న కొన్నింటికి అనుమతులు నిలిపేయడం, మూతపడిన ఇంజినీరింగ్‌ కళాశాలల భవనాల్లో డిగ్రీ కోర్సులు ప్రారంభించుకునేందుకు అనుమతులు ఇచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. కొత్తగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఏర్పాటుచేస్తున్న ప్రాంతంలో ప్రైవేటుకు అనుమతులు నిలిపివేయనున్నారు.


ఆ కమిటీ వద్దన్నా..

* విద్యా సంస్కరణలపై ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఏర్పాటుచేసిన బాలకృష్ణన్‌ కమిటీ రాష్ట్రంలో నాణ్యత ప్రమాణాలు పాటించని 500 డిగ్రీ కళాశాలలను మూసివేయొచ్చని సూచించింది. రాష్ట్రంలో కొత్త కళాశాలలకు అనుమతులు ఇవ్వొద్దని సర్వే కమిటీ- 2018-19 సూచించింది.

* మొత్తం కళాశాలలు 1,402 ఉండగా... ఇందులో 1,174 ప్రైవేటు డిగ్రీ కళాశాలలున్నాయి. ప్రైవేటులో ఉన్నవాటిల్లో సుమారు 60% కళాశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటిని సొంత భవనాల్లోకి మార్చడానికి కృషి చేయాలి. దీనిపై దృష్టి పెట్టకుండా కొత్తవాటిని ఇవ్వడమేంటని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. 

* 2024లోపు అన్ని కళాశాలలు న్యాక్‌ గుర్తింపు పొందాలని గతంలో ఆదేశించారు. ప్రస్తుతం చాలావాటికి ఈ గుర్తింపు లేదు. వీటిని బలోపేతం చేయాల్సి ఉంది. 

* సగం కళాశాలల్లో 50శాతంలోపే ప్రవేశాలు ఉంటున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని