Supreme Court: రాజధానిని మార్చే శాసనాధికారం అసెంబ్లీకి లేదన్న.. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వం

‘ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని మార్చడానికి, రాజధాని నగరాన్ని రెండు, మూడుగా విభజిస్తూ తీర్మానం కానీ, చట్టం కానీ చేసే శాసనాధికారం ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు లేదు’ అని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

Updated : 29 Nov 2022 07:29 IST

సుప్రీంకోర్టు స్పష్టీకరణ
అమరావతిలో పనుల పూర్తికి హైకోర్టు విధించిన గడువులపై మాత్రమే స్టే
రైతుల భవితవ్యంపై గుచ్చిగుచ్చి ప్రశ్నలు
హైకోర్టు ఎక్కడ ఉంటుందని పదే పదే ఆరా
డిసెంబరు నెలాఖరులోపు అఫిడవిట్లు దాఖలు చేయండి
ప్రతివాదులకు నోటీసులు
తదుపరి విచారణ జనవరి 31కి వాయిదా
ఈనాడు - దిల్లీ

‘ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని మార్చడానికి, రాజధాని నగరాన్ని రెండు, మూడుగా విభజిస్తూ తీర్మానం కానీ, చట్టం కానీ చేసే శాసనాధికారం ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు లేదు’ అని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అలా చేస్తే కేసు వినకుండానే హైకోర్టు తీర్పును కొట్టేసినట్లవుతుందని పేర్కొంది. అయితే రాజధాని ప్రాంతంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడానికి నిర్దిష్ట గడువు విధిస్తూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి జారీ చేసిన ఏడు అంశాల్లో అయిదింటిపై తదుపరి ఉత్తర్వుల వరకు స్టే ఇస్తున్నట్లు తెలిపింది. ఈ కేసులో ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. డిసెంబరు చివరి వారంలోపు అందరూ అందుకు సమాధానం ఇవ్వాలంటూ విచారణను వచ్చే ఏడాది జనవరి 31కి వాయిదా వేసింది. రాజధానిపై చట్టం చేసే అధికారం శాసనసభకు లేదంటూ ఈ ఏడాది మార్చి 3న హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీలపై జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ బీవీ నాగరత్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాజీ అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌, రాజ్యసభ ఎంపీ నిరంజన్‌రెడ్డి, అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరాం, సీనియర్‌ అడ్వకేట్‌ నఫ్డే వాదనలు వినిపించారు. రైతుల తరఫున సీనియర్‌ అడ్వకేట్లు ఫాలీ ఎస్‌.నారిమన్‌, శ్యాం దివాన్‌, ఆదినారాయణరావులు వాదనలు వినిపించారు. సుమారు గంటన్నరపాటు గంభీరంగా జరిగిన వాదోపవాదాల్లో న్యాయమూర్తులు కూడా పలు అంశాలపై ప్రశ్నలు వేశారు. అన్ని పక్షాల వాదోపవాదనలు విన్న తర్వాత హైకోర్టు ఉత్తర్వుల్లోని కొన్ని అంశాలపై స్టే ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వ వాదనలు ఇవీ

తొలుత రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేకే వేణుగోపాల్‌ వాదనలు వినిపించారు. ‘ప్రస్తుతం సవాల్‌ చేసిన ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నవంబరు 15న ఉపసంహరించుకొంది. అమరావతి, విశాఖపట్నం, కర్నూలును మూడు రాజధానులుగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పిన ఆ చట్టాన్ని ఉపసంహరించుకున్నందున ఇప్పుడు ఏమీ మిగలలేదు’ అన్నారు. జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ జోక్యం చేసుకుంటూ ఏమీ మిగలలేదా ఇంకా ఏదైనా మిగిలి ఉందా అని ప్రశ్నించారు. కేకే వేణుగోపాల్‌ స్పందిస్తూ తనకు తెలిసినంతవరకూ ఏమీ లేదన్నారు. ‘చేసిన చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్నప్పటికీ మూడు రాజధానుల అంశాన్ని పునరుద్ధరించే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఉత్తర్వులు జారీ చేస్తే కోర్టులు ప్రభుత్వ శాసనాధికారాల్లో జోక్యం చేసుకున్నట్లే అవుతుంది. ఫలానా విధానంలో బిల్లును ఆమోదించాలనే అధికారం కానీ, ఫలానా రకమైన చట్టాన్ని చేయొద్దని చెప్పే అధికారం కానీ హైకోర్టుకు లేదు. ఇది మొత్తం వ్యవస్థల మధ్య అధికార విభజనలోకి వస్తుంది. రాష్ట్ర రాజధానిపై చట్టం చేసే అధికారం శాసనసభకు లేదు, పార్లమెంటుకు మాత్రమే ఉందని చెప్పడమూ తప్పే. ఒకసారి చట్టాన్ని ఉపసంహరించుకున్నాక దాని స్థానంలో శాసనసభ మరో చట్టం తెచ్చే వరకూ హైకోర్టు వేచిచూడాలి. కానీ ఇప్పుడు చట్టం అమల్లో లేకపోయినా ఒక్కో విషయాన్ని పరిగణనలోకి తీసుకొని కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం వింతగా కనిపిస్తోంది’ అని అన్నారు.

హైకోర్టును ఎలా తరలిస్తారు: జస్టిస్‌ జోసెఫ్‌

జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ జోక్యం చేసుకుంటూ ‘రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు సమకూరుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు రూ.15 వేల కోట్లు అమరావతి కోసం ఖర్చు పెట్టారు. రెండెకరాల్లోపు భూములున్న 29 వేల మంది చిన్న, సన్నకారు రైతులు భూములిచ్చారు. అందుకు సంబంధించి చట్టబద్ధమైన ఒప్పందం ఉంది. దాని ప్రకారం ఏటా 10% పెంపుదలతో కౌలుతోపాటు అభివృద్ధి చేసిన స్థలాలను ఇస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఇప్పటికే ప్రభుత్వం భారీ పెట్టుబడి పెట్టింది. హైకోర్టు అమరావతి పరిధిలోకి వస్తోంది. అమరావతి విభజన చట్టానికి లోబడి హైకోర్టు అమరావతి నుంచి పనిచేస్తుందని రాష్ట్రపతి 2018లో నోటిఫికేషన్‌ ఇచ్చారు. దాని ప్రకారం హైకోర్టు ప్రధాన ధర్మాసనం ఎక్కడి నుంచి పనిచేయాలో పార్లమెంటు మాత్రమే నిర్దేశించగలుగుతుంది. ఇప్పుడు దానికి విరుద్ధంగా మీరు హైకోర్టు ప్రధాన ధర్మాసనం కర్నూలులో పెడతామని ప్రతిపాదించారు’ అని అన్నారు. ఇప్పుడు ఆ ప్రతిపాదన లేదు.. ఆ చట్టం రద్దయిపోయిందని కేకే వేణుగోపాల్‌ బదులిచ్చారు. జస్టిస్‌ జోసెఫ్‌ స్పందిస్తూ ‘ప్రస్తుతం రైతుల ప్రాథమిక హక్కులకు ముప్పు పొంచి ఉందన్న అనుమానం ఉంది. బహుశా దాని ప్రాతిపదికనే హైకోర్టు జోక్యం చేసుకొని ఉండొచ్చు. అందువల్ల మీరు వాస్తవంగా ఏం చేయాలనుకుంటున్నారన్నది స్పష్టంగా చెప్పాలి’ అని పేర్కొన్నారు.

అమరావతిలోనే హైకోర్టు: ఏపీ న్యాయవాది

రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వేణుగోపాల్‌ స్పందిస్తూ హైకోర్టు అమరావతిలోనే ఉంటుందన్నారు. అందుకు సంబంధించి 2018లో రాష్ట్రపతి నోటిఫికేషన్‌ ఇచ్చారని పేర్కొన్నారు. జస్టిస్‌ నాగరత్న జోక్యం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని ఎక్కడికి మార్చాలనుకుంటోందని ప్రశ్నించారు. అది శాసనసభ నిర్ణయిస్తుందని వేణుగోపాల్‌ జవాబిచ్చారు. ఇక్కడ హైకోర్టు ‘ఎ’ కేపిటల్‌ కాదు.. ‘ది’ కేపిటల్‌ అని చెప్పింది కదా అని జస్టిస్‌ జోసెఫ్‌ గుర్తుచేశారు. జస్టిస్‌ నాగరత్న జోక్యం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్‌లో అధికారాల విభజన లేదా? హైకోర్టు కార్యనిర్వాహక వ్యవస్థగా వ్యవహరించడం ప్రారంభించింది అని వ్యాఖ్యానించారు. ఈ అంశాలను తాము పరిశీలించాలని, అందుకే కేసును విచారణకు స్వీకరించి కక్షిదారులందరికీ నోటీసులు జారీచేయాలనుకుంటున్నామని జస్టిస్‌ జోసెఫ్‌ చెప్పారు. చట్టబద్ధమైన ఒప్పందం ప్రకారం భూములిచ్చిన రైతుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. వేణుగోపాల్‌ స్పందిస్తూ పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్నందున ఇప్పుడు 2014 చట్టం అమల్లో ఉంటుందన్నారు.  దాని ప్రకారం ఈ రోజు అమరావతే రాజధాని అని చెప్పగా ‘దట్స్‌ రైట్‌’ అని జస్టిస్‌ జోసెఫ్‌ వ్యాఖ్యానించారు.

హైకోర్టు హద్దులు దాటినట్లు కనిపిస్తోంది

జస్టిస్‌ నాగరత్న జోక్యం చేసుకుంటూ ‘మీరు ఎన్ని నగరాలైనా అభివృద్ధి చేసుకోవచ్చు. అన్నింటినీ ఒకే ప్రాంతంలో పెట్టడానికి బదులు ఎక్కువ పట్టణ కేంద్రాలు రావడం మేలు. వాటిని ఎక్కడ పెట్టాలన్నది ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. ఈ విషయంలో హైకోర్టు తన హద్దులను దాటినట్లు మాకు అనిపిస్తోంది. హైకోర్టు కార్యనిర్వాహక వ్యవస్థలా మారకూడదు’ అన్నారు. మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నామని, కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకొని ఉండాల్సింది కాదని వేణుగోపాల్‌ చెప్పారు.

అమరావతిని రాజధానిగా తొలగించలేదు

29 వేల మంది రైతుల హక్కుల సంగతేంటి అని ఈ సందర్భంగా జస్టిస్‌ జోసెఫ్‌ ప్రశ్నించారు. వైకాపా రాజ్యసభ సభ్యుడు, సీనియర్‌ అడ్వకేట్‌ నిరంజన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ ‘2020 పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని రద్దు చేసినా ఆ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ప్రభుత్వం చెప్పింది. అమరావతిని రాజధానిగా తొలగించలేదు. మూడు పాలనా కేంద్రాల్లో అదీ ఒకటి. అక్కడ లే అవుట్ల అభివృద్ధి జరుగుతుంది. భూసేకరణ చట్టం మనుగడలోనే ఉంటుంది’ అని వివరించారు. రాజధానికి భూములిచ్చిన రైతుల ప్రయోజనాలు మీరు ఎలా కాపాడతారన్నదే మాకు సమస్యగా కనిపిస్తోందని జస్టిస్‌ జోసెఫ్‌ వ్యాఖ్యానించారు. నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ ‘భూములు ఇచ్చిన రైతుల కోసం మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం అభివృద్ధి చేస్తాం. వికేంద్రీకరణ చట్టం కూడా అదే చెప్పింది. వారికి ఏటా చేసే చెల్లింపులకు రక్షణ కల్పించడంతోపాటు, పెంచుతామని కూడా ఆ చట్టంలో చెప్పారు. చెప్పిన కాలంలో ఆ ప్రాంతం అభివృద్ధి సాధ్యం కాదు కాబట్టి వార్షిక చెల్లింపుల కాలాన్ని కూడా పెంచుతామన్నారు. ఇప్పటి వరకు అక్కడ రూ.5 వేల కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు. అందులో రూ.2 వేల కోట్లు కేంద్రం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అయిదేళ్లలో వెచ్చించింది కేవలం రూ.3 వేల కోట్లే.  ఈ మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం అభివృద్ధి కోసం రూ.1.09 లక్షల కోట్లు ఖర్చవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అది రూ.2 లక్షల కోట్ల వరకు పోవచ్చు. ప్రస్తుత బడ్జెట్‌ కేటాయింపుల ప్రకారం చూస్తే ఆ స్థాయి అభివృద్ధి పూర్తవడానికి 40-50 ఏళ్లు పట్టొచ్చు’ అన్నారు.

కోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేయడం కాదా?

ఒక నెలలో పూర్తి చేయాల్సిన పనులకు అయిదేళ్లు కావాలని అడగడం కోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేయడం కాదా అని జస్టిస్‌ జోసెఫ్‌ ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డిని ప్రశ్నించారు. ఆరు నెలల్లోపు రాజధాని నగరాన్ని అభివృద్ధి చేయాలన్న హైకోర్టు ఉత్తర్వులపై ఏమంటారని ప్రశ్నించారు. నిరంజన్‌రెడ్డి బదులిస్తూ అయిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.2 వేల కోట్లతో కలిపి మొత్తం రూ.5 వేల కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. రూ.15 వేల కోట్లు ఖర్చు చేసినట్లు హైకోర్టు ఎలా చెప్పిందని జస్టిస్‌ జోసెఫ్‌ ప్రశ్నించారు. కనీసం హైకోర్టు భవన నిర్మాణమే పూర్తికానప్పుడు ఆరు నెలల్లో రాజధాని నిర్మాణం ఎలా సాధ్యమవుతుందని జస్టిస్‌ నాగరత్న ప్రశ్నించారు. జస్టిస్‌ జోసెఫ్‌ హైకోర్టు చెప్పిన 6వ మార్గదర్శకం అమలు గురించి ప్రశ్నించగా అందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని నిరంజన్‌రెడ్డి బదులిచ్చారు. 7వ అంశంలో మూడు నెలల గడువే ఇచ్చినందున సాధ్యం కాదన్నారు. ఈ కేసును విచారించడానికి తాము సుముఖంగా ఉన్నామని, ఆలోపు మీరు మధ్యంతర ఉత్తర్వులుగా ఏం కోరుకుంటున్నారని జస్టిస్‌ జోసెఫ్‌ ప్రశ్నించారు. రాజధానిని నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందన్న హైకోర్టు తీర్పులోని అంశంపై స్టే ఇవ్వాలని, దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వదిలిపెట్టాలని వేణుగోపాల్‌ కోరారు. అలా స్టే ఇస్తే మీకు కొత్తగా చట్టం చేయడానికి స్వేచ్ఛనిస్తుంది కదా అని జస్టిస్‌ జోసెఫ్‌ ప్రశ్నించారు. అలా చేస్తే ఈ కేసు విచారణే నిరర్థకంగా మారుతుందన్నారు. అది తుది విచారణ సమయంలో పరిశీలించాల్సిన అంశమని వ్యాఖ్యానించారు.

పార్లమెంటు ఒక రాజధాని అనే చెప్పింది

రైతుల తరఫున నారిమన్‌ వాదనలు వినిపిస్తూ ‘రాష్ట్రాల సరిహద్దులను మార్చడం, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకే వస్తుందని సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం స్పష్టంగా చెప్పింది. ఆర్టికల్‌ 3, 4 కింద ఉన్న అధికారాలు ఆర్టికల్‌ 246, లిస్ట్‌ 2, 3 పరిధిలోకి రావు. అందువల్ల ఇక్కడ మనం తప్పకుండా పార్లమెంటు చట్టాన్నే అనుసరించాలి. పార్లమెంటు ఒక కేపిటల్‌ అని చెబితే అదే అనుసరించాలి. అందువల్ల రాజధానులను ఎంచుకోవడానికి వీల్లేదు’ అన్నారు. జస్టిస్‌ జోసెఫ్‌ జోక్యం చేసుకుంటూ రాజధాని ఫలానా చోటే ఉండాలని పార్లమెంటు చట్టంలో ఎక్కడా లేదు కదా? అని ప్రశ్నించారు. నారిమన్‌ స్పందిస్తూ అది రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలోని అంశం కాదని, ఆర్టికల్‌ 3, 4 ప్రకారం ఒకే రాజధాని ఉండాలని పార్లమెంటు చెప్పిందని, అందువల్ల మూడు రాజధానులు ఉండటానికి వీల్లేదని గుర్తుచేశారు.

ఇది దేశానికి మేలు చేసే ప్రాజెక్టు

రాజధాని రైతు పరిరక్షణ సమితి తరఫున సీనియర్‌ అడ్వకేట్‌ శ్యాం దివాన్‌ వాదనలు వినిపిస్తూ ‘ప్రస్తుతం భూసేకరణలో ఉన్న సమస్యలు, ధరలను బట్టిచూస్తే కొత్త నగరం నిర్మించడం అసాధ్యం. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంతాల్లోకి వెళ్లి రాజధాని నిర్మాణం అన్నది మీకు అద్భుతమైన అవకాశం, అందుకోసం మీ భూములు ఇవ్వండి అని అడిగింది. దానివల్ల మీకు చాలా ప్రయోజనాలు వస్తాయని చెప్పింది. ఆ మాటలు విని వారు శతాబ్దాలుగా సాగు చేస్తున్న 33 వేల ఎకరాల భూములను రాజధానికి ఇచ్చారు. అది కేవలం రాష్ట్రానికే కాకుండా మొత్తం దేశానికే దక్కిన గొప్ప లాభం. నిర్దిష్ట వ్యవధిలో రాజధాని నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పడంతో అక్కడ ఏదో ఒక దుకాణం పెట్టుకొని బతకొచ్చు, పిల్లలు బాగుపడతారని రైతులు నమ్మారు’ అన్నారు. రాజధానికి భూములిచ్చిన తర్వాత వారి దగ్గర ఏమైనా మిగిలి ఉందా అని న్యాయమూర్తి అడగ్గా ఏమీ మిగలలేదని, అంతా ఇచ్చేశారని శ్యాం దివాన్‌ బదులిచ్చారు. అక్కడ రాజధాని రావడం నేషనల్‌ కమిట్‌మెంట్‌ అన్నారు. హైకోర్టు భవనం శంకుస్థాపన తర్వాత వదిలేశారు, వివిధ గృహనిర్మాణాలు పూర్తిగా పక్కనపెట్టేశారని అన్నారు. రోడ్లు కూడా వేయలేదన్నారు. జస్టిస్‌ జోసెఫ్‌ స్పందిస్తూ హైకోర్టు నెల రోజుల్లోపు పనులు పూర్తి చేయాలని ఎలా చెబుతుందని ప్రశ్నించారు. శ్యాందివాన్‌ స్పందిస్తూ అది కంటిన్యుయస్‌ మేండమస్‌కు సంబంధించిన అంశమని, రైతులకు కేటాయించిన భూముల్లో ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదని, అందుకే కోర్టు నిర్దిష్ట గడువు విధించిందన్నారు. ఈ పనులన్నీ చట్టబద్ధంగా 2020లోపే పూర్తిచేయాల్సి ఉన్నందున హైకోర్టు చాలా కఠినమైన గడువు విధించిందని పేర్కొన్నారు.

ఇలాగే చేయాలని చెప్పే అధికారం  కోర్టుకెక్కడిది: జస్టిస్‌ నాగరత్న

జస్టిస్‌ నాగరత్న జోక్యం చేసుకుంటూ ఆ ప్రాంతాన్ని రాజధానిని చేయడం, లేదంటే నగరంగా మార్చడం అన్నది వేరే విషయం.. కానీ ఇలాగే చేయాలని చెప్పడానికి హైకోర్టు ఏమైనా టౌన్‌ప్లానింగ్‌ చీఫ్‌ ఇంజనీరా? ఇవేం ఉత్తర్వులు? కోర్టులకు ఇందులో నైపుణ్యం ఉండదు కాబట్టి అందులో మేం జోక్యం చేసుకోం అని వ్యాఖ్యానించారు. రెండు నెలల్లో కనీసం డ్రాయింగ్‌లు కూడా తయారుచేయలేరు కదా? అలాంటప్పుడు మొత్తం నగరాన్నే నిర్మించాలని కోర్టు ఎలా చెబుతుంది?  కార్యనిర్వాహక అధికారాలను హైకోర్టు తన చేతుల్లోకి తీసుకొని ఇలా ఉత్తర్వులు జారీచే యొచ్చా? అన్నదానికి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కోర్టులు ప్రభుత్వాలు కాదన్నారు. శ్యాందివాన్‌ బదులిస్తూ ఇప్పటికే డ్రాయింగ్‌లన్నీ సిద్ధంగా ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. రైతులతో కుదుర్చుకున్న చట్టబద్ధమైన ఒప్పందానికి లోబడే కోర్టు ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. కంటిన్యుయస్‌ మేండమస్‌ జారీ చేయడం కరెక్టేనని, వారికి ఒక నెల చాలదనుకుంటే హైకోర్టుకు వెళ్లి వాస్తవ సమయం కోరవచ్చని పేర్కొన్నారు. జస్టిస్‌ జోసెఫ్‌ జోక్యం చేసుకుంటూ రాజధాని అంటే ఏంటి? శాసనసభ, సెక్రటరీలు కూర్చొనే స్థలాన్ని రాజధాని అంటారా? ఈ వ్యవస్థలన్నీ తప్పనిసరిగా ఆ ప్రాంతంలో ఉండాలా? అది ఎక్కడైనా ఉందా? అని అడిగారు. ఇవన్నీ చట్టానికి సంబంధించిన విషయాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరో సీనియర్‌ న్యాయవాది నఫ్డే వాదిస్తూ 2014లో 10 వేల మంది రైతులు భూములు అమ్మారని, ఆ భూములు కొన్నవారిలో కొందరి పేర్లు సున్నితమని, దాని గురించి అందరికీ తెలుసన్నారు. జస్టిస్‌ నాగరత్న జోక్యం చేసుకుంటూ మేం మీ వాదనలు పూర్తిగా వింటామని, అందుకు సమయం కావాలని మాత్రమే చెబుతున్నామన్నారు. అందుకే నోటీసులు జారీచేసి జనవరి 31న వింటామని జస్టిస్‌ జోసెఫ్‌ చెప్పారు. వేణుగోపాల్‌ జోక్యం చేసుకుంటూ రాజధాని ఏర్పాటుపై శాసనసభకు అధికారాలు లేవంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరగా జస్టిస్‌ జోసెఫ్‌ నిరాకరించారు. అలా చేస్తే ఏమవుతుందని ప్రశ్నించగా.. వాదనలు వినకుండానే హైకోర్టు తీర్పును తిరస్కరించినట్లవుతుందని శ్యాం దివాన్‌ అన్నారు. అవునంటూ జస్టిస్‌ జోసెఫ్‌ సంకేతం ఇచ్చారు.

లేని చట్టంపై ముందస్తు ఉత్తర్వులా?

తర్వాత జస్టిస్‌ నాగరత్న స్పందిస్తూ లేని చట్టంపై ముందస్తుగా ఉత్తర్వులు జారీచేయొచ్చా? ఇది ముందస్తు ఉత్తర్వుల జారీ కిందికి వస్తుంది అన్నారు. జస్టిస్‌ జోసెఫ్‌ స్పందిస్తూ అందుకే మనం ఈ కేసు వినడానికి కారణంగా చెబుతున్నామని పేర్కొన్నారు. తాము ఈ కేసు వింటామని, అయితే హైకోర్టు నిర్దేశించిన గడువులపై స్టే విధించడానికి సుముఖంగా ఉన్నామని చెప్పారు. హైకోర్టు ఆదేశాల్లోని 1, 2 అంశాల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పినందున దానిపై స్టే ఇవ్వబోమన్నారు. డిసెంబర్‌ చివరి వారానికల్లా అందరూ అఫిడవిట్లు దాఖలు చేయాలని పేర్కొన్నారు. జనవరి 31న ఈ కేసులను టాప్‌ ఆఫ్‌ ది బోర్డులో ఉంచాలని ఆదేశించారు. అప్పటి వరకు ఈ కేసులో హైకోర్టు జారీచేసిన ఉత్తర్వుల్లోని 3 నుంచి 7 వరకు ఉన్న అంశాలపై స్టే ఇస్తున్నట్లు చెప్పారు. స్టే ఇవ్వడానికి బదులు.. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎలాగూ చెప్పినందున అక్కడ మౌలిక వసతుల పనులు జరిపేందుకు అవకాశం ఇవ్వాలని రైతుల తరఫు న్యాయవాది శ్యాందివాన్‌ కోరారు. తాము హైకోర్టు ఉపయోగించిన అధికారాలను చూస్తున్నాం తప్పితే... ఇటుకానీ... అటు కానీ చూడటంలేదని జస్టిస్‌ నాగరత్న అన్నారు. జస్టిస్‌ జోసెఫ్‌ స్పందిస్తూ 6నెలల్లోపు రాజధానిని అభివృద్ధి చేయాలని చెప్పడంలో చాలా వేగ్‌నెస్‌ ఉందన్నారు.


స్టే ఇవ్వని అంశాలు

1. భూసేకరణ నిబంధనలు- 2015లోని షెడ్యూల్‌ 2, 3ల్లో పొందుపరిచిన బాధ్యతలను ఏపీసీఆర్‌డీఏ నిర్వర్తించాలి.
2. రైతుల నుంచి సమీకరించిన భూములను రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఏపీసీఆర్‌డీఏ కానీ రాజధాని నిర్మాణం, రాజధాని ప్రాంత
అభివృద్ధి కోసం మినహా ఇతరులకు ధారాదత్తం చేయకూడదు. తనఖా పెట్టకూడదు. మూడో పార్టీకి ప్రయోజనాలు కల్పించరాదు.


వీటిపై స్టే

1. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీసీఆర్‌డీఏలు కోర్టు ఉత్తర్వులు వెలువడిన నెల రోజుల్లో అమరావతి రాజధాని నగరం, ప్రాంతంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్తు లాంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలి.
2. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీసీఆర్‌డీఏలు టౌన్‌ప్లానింగ్‌ స్కీమ్‌లు పూర్తి చేయాలి.
3. వాపసు తీసుకోవడానికి వీల్లేని జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ, 2015 భూసమీకరణ నిబంధనల కింద చేసుకున్న ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల్లోపు అమరావతి నగరం, రాజధాని ప్రాంతాన్ని నిర్మించి, అభివృద్ధి చేయాలి.
4. అమరావతి రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్లలో ప్రతిదానికీ అప్రోచ్‌ రోడ్లు, తాగునీరు, విద్యుత్తు కనెక్షన్‌, డ్రైనేజీ సౌకర్యాలను కల్పించి అమరావతి రాజధాని నగరంలో నివసించడానికి యోగ్యమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏ అభివృద్ధి చేయాలి.
5. రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం చేసినట్లుగా అభివృద్ధి చేసిన ప్లాట్లను రాష్ట్ర ప్రభుత్వం, ఏపీసీఆర్‌డీఏలు మూడు నెలల్లోపు రైతులకు అందించాలి.


హైకోర్టు ఎక్కడికి వెళుతుంది?

జస్టిస్‌ జోసెఫ్‌ స్పందిస్తూ ఇప్పుడు కొత్తగా హైకోర్టు ఎక్కడ వస్తుందని ప్రశ్నించారు. వికేంద్రీకరణ చట్టం ప్రకారం శాసనరాజధాని అమరావతిలో, కార్యనిర్వాహక రాజధాని విశాఖ, న్యాయరాజధాని కర్నూలులో ఉంటుందని నిరంజన్‌రెడ్డి బదులిచ్చారు. ఏ చట్టం ప్రకారం అవి వస్తాయని న్యాయమూర్తి అడగ్గా.. ఆ (వికేంద్రీకరణ) చట్టాన్ని రద్దు చేసినట్లు నిరంజన్‌రెడ్డి బదులిచ్చారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిస్థితేంటి, మీరేం చేయాలని ప్రతిపాదించారని న్యాయమూర్తి ప్రశ్నించారు. వికేంద్రీకరణ చట్టాన్ని రద్దు చేసినందున అసలు చట్టం అమల్లోకి వచ్చిందని, అందువల్ల రాజధాని అమరావతిలోనే ఉందని నిరంజన్‌రెడ్డి చెప్పారు. అవసరమైతే ఆ అంశాన్ని శాసనసభ పునఃపరిశీలించి, కొత్త చట్టం తీసుకొస్తుందన్నారు. భవిష్యత్తులో శాసనసభ ఏం చేస్తుందన్నది చెప్పడం తమకు కష్టమన్నారు. ఆ వాదన సరికాదంటూ రాజధాని రైతుల తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్‌ అడ్వకేట్‌ ఫాలీ నారిమన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టును ఏం చేయాలనుకుంటున్నారని మిమ్మల్ని పదేపదే అడుగుతున్నాం, అది అమరావతిలోనే ఉంటుందా అని జస్టిస్‌ జోసెఫ్‌ మరోమారు ప్రశ్నించారు. ప్రస్తుతం హైకోర్టు అమరావతి నుంచే పనిచేస్తోందని నిరంజన్‌రెడ్డి బదులిచ్చారు.  ఇక ముందు కూడా పని చేయడానికి అనుమతిస్తారా అని ప్రశ్నించగా ఈ రోజు వరకు అదే పరిస్థితి ఉందని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.


రాజధానిని మారుస్తామనడం వల్లే హైకోర్టు మాండమస్‌ జారీ

ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చట్టం ఉపసంహరించుకున్న తర్వాత కూడా హైకోర్టు ఎందుకు ముందుకెళ్లిందని జస్టిస్‌ జోసెఫ్‌ ప్రశ్నించారు. శ్యాందివాన్‌ స్పందిస్తూ మా కార్యనిర్వాహణాధికారాలు శాసనాధికారాలతో ముడిపడి ఉన్నాయని, అందువల్ల చట్టం లేకపోయినా రాజధాని మార్పునకు పరిపాలనాధికారాలు జారీ చేస్తామని ప్రభుత్వం చెప్పడం వల్లే హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందన్నారు. శాసనాధికారాలు లేకపోయినా కార్యనిర్వాహక అధికారాల కింద కార్యాలయాలను తరలించే అధికారం తమకుందని చెప్పి కొన్ని కార్యాలయాలను తరలించారని గుర్తుచేశారు. హైకోర్టు వాటిని అడ్డుకుంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చిందన్నారు. హైకోర్టు విషయంలో రాష్ట్రపతి నోటిఫికేషన్‌ ఉంది కాబట్టి ఆ పని చేయలేకపోయారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని