నిషిద్ధ కేటగిరీల్లో భూముల తారుమారు?

నిషిద్ధ భూముల జాబితాల్లో చేర్చిన భూములను ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు అనుసరించి చేర్చారా.. లేదా అన్నదానిపై జిల్లాల్లో పరిశీలన జరుగుతోంది.

Published : 01 Dec 2022 04:29 IST

ఈనాడు, అమరావతి: నిషిద్ధ భూముల జాబితాల్లో చేర్చిన భూములను ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు అనుసరించి చేర్చారా.. లేదా అన్నదానిపై జిల్లాల్లో పరిశీలన జరుగుతోంది. నిషిద్ధ జాబితాలో చేర్చిన భూములను విడిపించడమే బాధితులకు సవాలుగా మారింది. బాధితుల దరఖాస్తులను జిల్లా అధికారులు తిరస్కరిస్తున్నారు. పలుకుబడి ఉన్నవారికి త్వరగానే పరిష్కారం లభిస్తోంది. అయితే.. ఇటీవల తమ భూములను నిర్దేశించిన కేటగిరీలో కాకుండా మరో కేటగిరీలో పెట్టారని బాధితులు ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తున్నారు. నిషిద్ధ జాబితా నుంచి భూములు విడిపించడమే సమస్యగా మారగా, కేటగిరీల వారీగా భూములు చేర్చడంలో తారుమారు జరిగినట్లు వస్తున్న ఫిర్యాదులు చర్చనీయాంశంగా మారాయి. నిషిద్ధ జాబితా కింద 22-1ఎ నుంచి 1ఈ మధ్య ఏయే భూములు చేర్చాలో ఇప్పటికే రకరకాల ఉత్తర్వులు ఉన్నాయి. 221ఎలో ఎసైన్డ్‌, బి-ప్రభుత్వ భూములు, ఇతర కేటగిరీల్లో ఎలాంటి భూములు చేర్చాలో స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అయినా రెవెన్యూ అధికారులు భూముల వివరాల నమోదులో ఇష్టమొచ్చినట్లు వ్యవహరించారన్న ఆరోపణలు మరోసారి రుజువైంది. పదెకరాల భూమిని నిషిద్ధ భూమిలో చేర్చాల్సి ఉండగా మొత్తం సర్వే నెంబరునూ చేర్చారు. ఇలాంటి ఫిర్యాదులు కోకొల్లలు. ఈ పరిస్థితుల్లో 22-1ఎ కింద ఎసైన్డ్‌ కాకుండా ఇతర కేటగిరీ భూములు, 1సిలో మరో కేటగిరీ భూములను చేర్చినట్లు బాధితుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. దీనివల్ల ఈ భూములను సంబంధిత కేటగిరీలో చేర్చేలా చేయడం కత్తిమీద సాములా మారింది. ఇది జరిగిన అనంతరం బాధితుల నుంచి అందిన దరఖాస్తులను అనుసరించి విచారణ జరిపి, వాటిని విడిపిస్తారు. దీనికి చాలా సమయం పడుతుంది. ఈ తరుణంలో తాజా ఫిర్యాదులు చర్చనీయాంశంగా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని