అనంత జిల్లాలో ఎస్సీల శ్మశానం ఆక్రమణ

ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలోనే ఎస్సీల శ్మశానానికి దిక్కులేకుండా పోయింది. వంద ఏళ్లుగా ఉన్న శ్మశానాన్ని వైకాపా నాయకులు రాత్రికి రాత్రే దున్నేశారు.

Published : 02 Dec 2022 02:53 IST

రాత్రికి రాత్రే దున్నేసిన  వైకాపా నాయకులు

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలోనే ఎస్సీల శ్మశానానికి దిక్కులేకుండా పోయింది. వంద ఏళ్లుగా ఉన్న శ్మశానాన్ని వైకాపా నాయకులు రాత్రికి రాత్రే దున్నేశారు. అక్కడ మృతదేహాలను పాతిపెట్టడానికి వీల్లేదంటూ ఎస్సీలపైనే దౌర్జన్యానికి దిగుతున్నారు. తమకు జరిగిన అన్యాయంపై జిల్లా కలెక్టర్‌కు మొరపెట్టుకుని నెలన్నర దాటినా ఫలితం లేదని అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం కోడుమూర్తి గ్రామ ఎస్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్రావతి నదికి ఆనుకుని శ్మశానం ఉండటంతో అక్కడి ఇసుకపై వైకాపా నాయకులు కన్నేశారని గ్రామస్థులు చెబుతున్నారు.

స్పందించని అధికారులు

యల్లనూరు మండలం కోడుమూర్తి గ్రామంలోని 69-బీ సర్వే నంబరులో 2.51 ఎకరాల్లో ఎస్సీల శ్మశానం ఉంది. ఇది వందేళ్ల నుంచి ఉన్నట్లు రెవెన్యూ అధికారులే చెబుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో మండలానికి చెందిన ఓ కీలక వైకాపా నాయకుడి అనుచరుడు దాన్ని చదును చేశారు. రాత్రికి రాత్రి జేసీబీలతో శ్మశానంలోని కంపచెట్లు తొలగించారు. శ్మశానం ఊరికి దూరంగా ఉండటంతో గ్రామస్థులు తొలుత గుర్తించలేదు. రెండురోజుల తర్వాత విషయం తెలిసి, కొందరు తహసీల్దారుకు ఫిర్యాదు చేశారు. నెలరోజులైనా తహసీల్దారు స్పందించకపోవడంతో అక్టోబరు 10న కలెక్టరుకు స్పందనలో విన్నవించుకున్నారు. ఫిర్యాదుదారులు 1092 హెల్ప్‌లైనుకు ఫోన్‌చేసి ఆరా తీయగా అసలు ఫిర్యాదు నమోదుకాలేదని సమాధానమిచ్చారు. దీంతో అక్టోబరు 17న మళ్లీ ఫిర్యాదుచేశారు.

ఖననాన్ని అడ్డుకున్న ఆక్రమణదారులు

దీంతో సమస్యను యల్లనూరు తహసీల్దారు రమాదేవికి పంపించారు. ఆమె వీఆర్వో ద్వారా విచారణ జరిపి 69-బీ, 96 సర్వే నంబర్లను ఎస్సీల శ్మశానానికి కేటాయించినట్లు రికార్డుల్లో ఉందని అక్టోబరు 20న ఓ నివేదిక ఇచ్చారు. తర్వాత కూడా ఆక్రమణదారులపై చర్యలేవీ తీసుకోలేదు.. భూమిని విడిపించే ప్రయత్నమూ చేయలేదు. నవంబరు 23న చనిపోయిన వ్యక్తిని ఖననం చేయడానికి తీసుకెళ్లగా వైకాపా నాయకులు అడ్డుకున్నారు. తమ భూమిలో శవాన్ని ఎలా పూడుస్తారని దౌర్జన్యం చేశారు. ఎస్సీలు తిరగబడటంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాజాగా ఓ పోలీసు అధికారి బాధితులతో మాట్లాడారు. శ్మశానానికి మరోచోట స్థలం కేటాయిస్తామని రాయబారం పంపినట్లు తెలుస్తోంది. తమకు వేరే స్థలం వద్దని.. పూర్వం నుంచి ఉన్న శ్మశానాన్ని వినియోగిస్తామని ఎస్సీలు తేల్చి చెబుతున్నారు. మరోవైపు ఇదే మండలంలో తిరుమలాపురం, బుక్కాపురం, మల్లేపల్లి గ్రామాల్లోనూ ఎస్సీల శ్మశానాలను వైకాపా నాయకులు కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు. దీనిపై అనంతపురం ఆర్డీవో మధుసూదన్‌ను అడగ్గా.. ‘రెవెన్యూ రికార్డుల్లో పట్టా భూమిగా ఉంది. అయితే దశాబ్దాలుగా ఎస్సీలు శ్మశానంగా వాడుకుంటున్నారు. పట్టాభూమి అయినా ఎస్సీలకు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటాం. రికార్డుల్లోనూ శ్మశానంగా మారుస్తాం’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని