15శాతంలోపు ప్రవేశాలున్న డిగ్రీ కోర్సుల రద్దు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 254 కోర్సులను మూసివేసేందుకు కళాశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఈ ఏడాది ప్రవేశాలు తగ్గాయనే కారణంతో ఈ మేరకు చర్యలు చేపడుతోంది.

Updated : 02 Dec 2022 05:40 IST

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 254 కోర్సులను మూసివేసేందుకు కళాశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఈ ఏడాది ప్రవేశాలు తగ్గాయనే కారణంతో ఈ మేరకు చర్యలు చేపడుతోంది. ఒక పక్క నియోజకవర్గానికో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని గొప్పగా చెబుతున్న ప్రభుత్వం మరోపక్క పిల్లలు చేరడం లేదని కోర్సులను మూసివేయడం విమర్శలకు తావిస్తోంది. 15శాతంలోపు విద్యార్థులు చేరిన కోర్సులను రద్దు చేయాలని ఇప్పటికే కళాశాలలకు ఆదేశాలు జారీ చేసింది. వీటిల్లో చేరిన వారిని సమీపంలోని కళాశాలల్లో సర్దుబాటు చేయాలని సూచించింది. ఈ ఏడాది ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత తగ్గింది. ఉత్తీర్ణులైన వారిలోనూ ఎక్కువ మంది ఇంజినీరింగ్‌కు వెళ్లిపోయారు. దీంతో డిగ్రీలో ప్రవేశాలు గణనీయంగా తగ్గాయి. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ కలిపి 1.06లక్షల ప్రవేశాలు తగ్గగా.. ప్రభుత్వ కళాశాలల్లో 46శాతం మాత్రమే సీట్లు నిండాయి. సీట్లు భర్తీ కాలేదనే నెపంతో కోర్సులను మూసేస్తున్నారు. రెండు, మూడేళ్లు పరిశీలించిన తర్వాత మూసివేసేందుకు చర్యలు తీసుకోవాలని అధ్యాపకులు కోరుతున్నా కళాశాల విద్యాశాఖ దీన్ని పట్టించుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 101 కోర్సుల్లో ఒక్కరూ చేరలేదు. మరో 153 కోర్సుల్లో 15శాతంలోపు పిల్లలు మాత్రమే చేరారు. 300-325 కోర్సుల్లో 20శాతంలోపు సీట్లు నిండాయి. వీటిల్లో బీఏ, బీఎస్సీ(ఎంపీసీ) కోర్సులు అధికంగా ఉన్నాయి. 101 కోర్సులను మూసివేయడం వల్ల ప్రభుత్వ కళాశాలల్లో 3,582 సీట్లు రద్దు కానున్నాయి. భవిష్యత్తులో ఈ కోర్సులు విద్యార్థులకు అందుబాటులో లేకుండాపోతాయి. 153కోర్సుల్లో 6,166 సీట్లు తగ్గిపోతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని