సంక్షిప్త వార్తలు (4)

తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఈ నెల 7వ తేదీన ‘మన డాక్టర్‌ మస్తాన్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌’ను ప్రారంభిస్తున్నట్లు డాక్టర్‌ మస్తాన్‌ యాదవ్‌ తెలిపారు.

Updated : 04 Dec 2022 06:08 IST

7న ‘మన డాక్టర్‌ మస్తాన్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌’ ప్రారంభం

వెంకటగిరి, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఈ నెల 7వ తేదీన ‘మన డాక్టర్‌ మస్తాన్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌’ను ప్రారంభిస్తున్నట్లు డాక్టర్‌ మస్తాన్‌ యాదవ్‌ తెలిపారు. పాలకేంద్రం వద్ద ఉన్న శ్రీకృష్ణ ఆలయ సమీపంలో కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ సహ వ్యవస్థాపకురాలు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్ల హాజరవుతారని చెప్పారు.


బ్రహ్మకమలం.. విశ్వరూపం

బ్రహ్మకమలం పూలు ఏడాదిలో ఒక్కసారి మాత్రమే పూస్తాయి. అనకాపల్లి జిల్లా చౌడువాడకు చెందిన కొరుబిల్లి లక్ష్మి ఇంటి వద్ద నాటిన మొక్క పౌర్ణమికి ముందు రోజుల్లో పూస్తోంది. ఈసారి మాత్రం ఏకంగా 60 పూలు వికసించాయని లక్ష్మి తెలిపారు.

న్యూస్‌టుడే, కె.కోటపాడు


పడిపోయినా.. ఓడిపోలేదు!

అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం వంగలి గ్రామంలో హుద్‌హుద్‌ తుపాను సమయంలో ఓ వృక్షం వేర్లతో సహా నేలకొరిగింది. దానిని కొట్టేయకుండా అలాగే ఉంచడంతో.. ఉన్న వేర్ల ఆధారంతోనే ఇన్నాళ్లు పెరిగింది. ఆ బాటలో వెళ్లే వారు నీడ కోసం చెట్టు వద్దకు వచ్చి ఆగుతుంటారు. దగ్గరికి వెళ్తేకానీ అది పడిపోయి ఉందనే విషయం తెలియదు.

ఈనాడు, విశాఖపట్నం


దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

ఈనాడు డిజిటల్‌, అమరావతి : ఏపీ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టి, వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఆత్మవిశ్వాసంతో ఎవరికీ తీసిపోమంటూ దివ్యాంగులు ముందుకు సాగుతున్నారు. తెదేపా హయాంలో దివ్యాంగుల కోసం మూడు చక్రాల మోటరు వాహనాలను ఇచ్చాం. స్వయం ఉపాధి పొందేందుకు రూ.లక్ష రాయితీతో రుణాలు అందించాం. దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే రూ.లక్ష కానుకగా ఇచ్చాం...’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని