పరీక్ష ఇలా.. చదవండి బాగా!

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది.

Updated : 05 Dec 2022 11:57 IST

పోలీసు ఉద్యోగాల ఎంపికకు 4 దశలు
తొలుత ప్రాథమిక రాత పరీక్ష
అర్హత మార్కులు సాధిస్తే పీఎంటీ, పీఈటీకి ఎంపిక
ఆ తర్వాత తుది రాత పరీక్ష

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది. నాలుగేళ్ల తర్వాత నియామక నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి మొత్తం 4 దశల్లో ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. 


దశ-1:  ప్రాథమిక రాత పరీక్ష
సివిల్‌, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు..

* సివిల్‌, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి తొలుత ప్రాథమిక రాత పరీక్ష (ప్రిలిమ్స్‌) నిర్వహిస్తారు.

* ప్రశ్నపత్రం: 200 మార్కులకు 200 బహుళైఛ్చిక (ఆబ్జెక్టివ్‌) ప్రశ్నలుంటాయి. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది.

సివిల్‌, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు..

* సివిల్‌, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి తొలుత ప్రాథమిక రాత పరీక్ష (ప్రిలిమ్స్‌) నిర్వహిస్తారు.

* ఒక్కోటి 100 మార్కుల చొప్పున మొత్తం 2 పేపర్లు 200 మార్కులకు ఉంటాయి. బహుళైచ్ఛిక (ఆబ్జెక్టివ్‌) ప్రశ్నలుంటాయి. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది.

అర్హత మార్కులు

* మహిళలు- 40 శాతం, బీసీలు, ఈడబ్ల్యూఎస్‌లు-35 శాతం, ఎస్సీ, ఎస్టీలు, మాజీ సైనికోద్యోగులు-30 శాతం మార్కులు సాధించాలి. పోటీ ఎక్కువైతే కటాఫ్‌ మార్కులు పెడతారు.

* కటాఫ్‌ మార్కులు సాధించిన అభ్యర్థులను తదుపరి దశలో శారీరక కొలతల పరీక్ష (పీఎంటీ), దేహ దారుఢ్య పరీక్షలకు (పీఈటీ) ఎంపిక చేస్తారు.


దశ-2: శారీరక కొలతలపరీక్ష (పీఎంటీ)

* ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు పోటీపడేవారు శారీరక కొలతల పరీక్షలో (పీఎంటీ) అర్హత కోసం పురుషులు 167.6 సెంటిమీటర్లు, మహిళలు 152.5 సెంటిమీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉండకూడదు.

* పురుషుల ఛాతీ చుట్టుకొలత 86.3 సెంటిమీటర్ల కంటే తక్కువ ఉండకూడదు. శ్వాస పీల్చినప్పుడు ఛాతీ 5 సెంటిమీటర్ల మేర విస్తరించాలి.

* మహిళలు బరువు 40 కిలోల కంటే తక్కువ ఉండకూడదు.


దశ-3: దేహ దారుఢ్య పరీక్షలు (పీఈటీ)
సివిల్‌ ఎస్సై, సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు పోటీపడేవారు

* దేహ దారుఢ్య పరీక్షల్లో పురుషులైతే 8 నిమిషాల్లో, మహిళలైతే 10 నిమిషాల 30 సెకన్లలో 1,600 మీటర్ల పరుగు పూర్తి చేయాలి.

* 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌ విభాగాల్లో ఏదో ఒక దాంట్లో అర్హత సాధిస్తే చాలు. నిర్దేశిత సమయంలో అవి పూర్తి చేయాలి.

* సివిల్‌ ఎస్సై, సివిల్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఇది కేవలం అర్హత పరీక్షే. తుది ఎంపికలో ఈ మార్కులను పరిగణనలోకి   తీసుకోరు.


ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ పోస్టులకు పోటీపడేవారు

* 1,600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌లో అర్హత సాధించాలి. మహిళలు ఈ పోస్టుకు పోటీపడే అవకాశం లేదు.

* ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు పోటీపడే వారికి 1600 మీటర్ల పరుగుకు 40, 100 మీటర్ల పరుగుకు 30, లాంగ్‌జంప్‌కు 30 చొప్పున 100 మార్కులకు దేహ దారుఢ్య పరీక్ష నిర్వహిస్తారు.

* నిర్దేశించిన సమయం కంటే ఎంత ముందు గమ్యాన్ని చేరుకుంటే అన్ని ఎక్కువ మార్కులు అభ్యర్థులకు లభిస్తాయి. ఈ మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు.


దశ-4: తుది రాత పరీక్ష
సివిల్‌ ఎస్సై ఉద్యోగాలకు పోటీపడేవారికి..

* పేపర్‌-1: ఆంగ్లం,

* పేపర్‌-2: తెలుగు.. వందేసి మార్కులకు నిర్వహిస్తారు. ఈ రెండు పేపర్లు వివరణాత్మక విధానంలో (డిస్క్రిప్టివ్‌) ఉంటాయి. వీటిలో అర్హత మార్కులు సాధిస్తే చాలు.

* పేపర్‌-3: అర్థమేటిక్‌, రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ,

* పేపర్‌-4: జనరల్‌ స్టడీస్‌ రెండేసి వందల మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నలు బహుళైచ్ఛిక విధానంలో (ఆబ్జెక్టివ్‌) ఉంటాయి. ఈ రెండు పేపర్లలో కలిపి 400 మార్కులకుగానూ అభ్యర్థులు సాధించిన మార్కులనే ఉద్యోగ ఎంపిక కోసం పరిగణనలోకి తీసుకుంటారు.

ఆంగ్లం, తెలుగు పేపర్లలో అర్హత సాధించకపోతే మిగతా రెండు పేపర్లను పరిగణనలోకి తీసుకోరు.

మొత్తం 600 మార్కులకు 4 పేపర్లుంటాయి.


ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు పోటీపడేవారికి..

*  పేపర్‌-1, పేపర్‌-2లు సివిల్‌ ఎస్సై అభ్యర్థులకు ఉన్నట్లే వందేసి మార్కులకు ఉంటాయి. వీటిలో అర్హత మార్కులు సాధిస్తే చాలు.

* పేపర్‌-3, పేపర్‌-4లను వందేసి చొప్పున 200 మార్కులకు నిర్వహిస్తారు. ఈ రెండు పేపర్లలో అభ్యర్థి సాధించిన మార్కులను, 100 మార్కులకు నిర్వహించిన దేహ దారుఢ్య పరీక్షల్లో అభ్యర్థి సాధించిన మార్కులకు కలుపుతారు. మొత్తం 300 మార్కులకుగానూ అత్యధిక మార్కులు సాధించిన వారిని ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.


తుది రాత పరీక్షలో అత్యధిక మార్కులు సాధించినవారే విజేత

*  సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు పోటీపడే వారికి 200 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటాయి. అత్యధిక మార్కులు సాధించినవారు ఉద్యోగానికి ఎంపికవుతారు.

*  ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ పోస్టులకు పోటీపడే వారికి 200 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు అర మార్కు ఉంటుంది. 100 మార్కులకు నిర్వహించిన దేహ దారుఢ్య పరీక్షల్లో ఆయా అభ్యర్థులు సాధించిన మార్కులను వీటికి కలుపుతారు. మొత్తం 200కు అత్యధిక మార్కులు వచ్చిన వారు ఉద్యోగానికి ఎంపికవుతారు.


ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ పోస్టులు

ఎచ్చెర్ల, రాజమహేంద్రవరం, మద్దిపాడు, చిత్తూరులలో ఏర్పాటు చేసే ఐఆర్‌ బెటాలియన్లలో ఒక్కోచోట 630 చొప్పున మొత్తం 2,520 ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ పోస్టులు.

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని