కేంద్రం ద్వారా 932 విద్యుత్‌ అద్దె బస్సులు

కేంద్ర ప్రభుత్వం ద్వారా పెద్ద సంఖ్యలో విద్యుత్‌ అద్దె బస్సులు తీసుకునేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది.

Updated : 05 Dec 2022 05:44 IST

గ్రాండ్‌ ఛాలెంజ్‌ కింద ప్రతిపాదనలు పంపనున్న ఆర్టీసీ

ఈనాడు, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ద్వారా పెద్ద సంఖ్యలో విద్యుత్‌ అద్దె బస్సులు తీసుకునేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. వివిధ రాష్ట్రాల ఆర్టీసీలకు విద్యుత్‌ బస్సులు అందించడంపై కేంద్రం కసరత్తు చేస్తుండటంతో, ఇందులో ఏపీఎస్‌ఆర్టీసీ 932 బస్సులు కావాలంటూ కోరనుంది. దేశంలో విద్యుత్‌ వాహనాలను ప్రోత్సహించడంలో భాగంగా గతంలో కేంద్రం ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఫేమ్‌) 1, 2  పథకాల కింద వివిధ రాష్ట్రాల ఆర్టీసీలు తీసుకునే విద్యుత్‌ బస్సులకు ఆర్థికసాయం అందించింది. ఈ పథకం ముగియడంతో కొత్తగా గ్రాండ్‌ ఛాలెంజ్‌ కింద సాయం అందించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. ఇందులో అన్ని రాష్ట్రాల ఆర్టీసీల నుంచి ఎన్నేసి బస్సులు అవసరమనే వివరాలు తీసుకుంటోంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఏపీఎస్‌ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా 932 విద్యుత్‌ అద్దె బస్సులు అవసరమని ఓ జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనను ఆమోదించాలంటూ రాష్ట్రప్రభుత్వానికి పంపనున్నారు. అనంతరం దీనిని కేంద్రానికి పంపుతారు. ఇలా ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనల ద్వారా మొత్తం బస్సుల సంఖ్య ఖరారయ్యాక.. కేంద్రమే ఈ విద్యుత్‌ అద్దె బస్సుల కోసం టెండర్లు పిలిచి గుత్తేదారు సంస్థలను ఎంపిక చేయనుంది. కి.మీ.కు ఎంత చొప్పున చెల్లించాలనేది కూడా కేంద్రమే ఖరారు చేయనుంది. గతంలో ఫేమ్‌-2 కింద ఏపీఎస్‌ఆర్టీసీ తిరుపతి-తిరుమల ఘాట్‌లో 50, తిరుపతి నుంచి సమీప నగరాలు, పట్టణాలకు మరో 50విద్యుత్‌ బస్సులను అద్దెప్రాతిపదికన తీసుకుంది. వీటికి టెండర్లను ఏపీఎస్‌ఆర్టీసీయే పిలిచి, కి.మీ.కు ఎంత చెల్లిస్తామనేది ఖరారు చేసింది. తాజాగా గ్రాండ్‌ ఛాలెంజ్‌లో టెండర్లు, కి.మీ.కు చెల్లించే మొత్తాన్ని కేంద్రమే చూసుకోనుందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.

పాత బస్సులకు విద్యుత్‌ సోకులు..

పాత డీజిల్‌ బస్సులను ఛార్జింగ్‌ బ్యాటరీతో నడిచే విద్యుత్‌ బస్సులుగా మార్చే రెట్రోఫిట్‌మెంట్‌ ప్రాజెక్టును అమలుకు కేంద్రం ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టును తొలుత ఏపీఎస్‌ఆర్టీసీ చేపట్టింది. తిరుపతి-తిరుమల ఘాట్‌లో తిరిగే పాత సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ బస్సులను విద్యుత్‌ బస్సులుగా మార్చే ప్రాజెక్టును గతంలో వీరవాహన సంస్థకు ప్రయోగాత్మకంగా అప్పగించారు. ఆ సంస్థ తక్కువ ఖర్చుతో రెట్రోఫిట్‌మెంట్‌ చేసి అందజేసింది. దీనిని కొంతకాలం కిందట తిరుపతి-తిరుమల ఘాట్‌లో నడిపారు. తర్వాత పుణేలోని సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (సీఐఆర్‌టీ) ఆమోదానికి పంపారు. ఆ సంస్థ కూడా ఇటీవల దీనికి క్లియరెన్స్‌ ఇచ్చింది. అయితే ఇంతలో కేంద్రమే రెట్రోఫిట్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ చేపట్టేందుకు సిద్ధమైంది. ఏడు రాష్ట్రాల ఆర్టీసీలకు చెందిన వందేసి డీజిల్‌ బస్సులను విద్యుత్‌ బస్సులుగా మారుస్తామని సమాచారం పంపింది. ఇందులో ఏపీఎస్‌ఆర్టీసీకి కూడా అవకాశం కల్పించారు. ఈ ప్రాజెక్ట్‌కు అయ్యే వ్యయాన్ని కేంద్రమే భరించనుంది. ఈ బస్సులకు వినియోగించే బ్యాటరీల నిర్వహణను ఎన్టీపీసీకి కేంద్రం అప్పగించింది. ఆయా డిపోల్లో ఎన్టీపీసీ ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటుచేసి బ్యాటరీల నిర్వహణ బాధ్యతలు చూడనుంది. ఇందుకు ఆర్టీసీ కి.మీ.కు ఎంత చొప్పున ఎన్టీపీసీకి చెల్లించాలనేది కేంద్రం నిర్ణయించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని