రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకం

రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఆర్‌.ఎం.సి.) ముసాయిదాలోని ఏ అంశమూ తమ ప్రయోజనానికి తగ్గట్లుగా లేదని, ఆ సిఫార్సులు ఆమోదయోగ్యం కావని తెలంగాణ పేర్కొంది.

Updated : 06 Dec 2022 05:54 IST

ఆ సిఫార్సులు ఆమోదయోగ్యం కావు
పెండింగ్‌లో పెట్టాలన్న తెలంగాణ

ఈనాడు, హైదరాబాద్‌: రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఆర్‌.ఎం.సి.) ముసాయిదాలోని ఏ అంశమూ తమ ప్రయోజనానికి తగ్గట్లుగా లేదని, ఆ సిఫార్సులు ఆమోదయోగ్యం కావని తెలంగాణ పేర్కొంది. ఇప్పుడు జరిగే ఒప్పందం కృష్ణా ట్రైబ్యునల్‌-2లో తమ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉందని అభిప్రాయపడింది. ముసాయిదాలోని సిఫార్సులను పెండింగ్‌లో పెట్టాలని, ఆ మేరకు ఆర్‌.ఎం.సి. కన్వీనర్‌కు తగు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. సోమవారం జరిగిన ఆర్‌.ఎం.సి. సమావేశానికి హాజరుకాని తెలంగాణ.. కృష్ణా నదీ యాజమాన్యబోర్డు ఛైర్మన్‌కు లేఖ రాసింది. నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ ఈ లేఖ రాశారు. రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ సమావేశంలో రెండు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చినట్లు కన్వీనర్‌ చెప్పారని మీడియాలో వచ్చిందని... ఇది తీవ్ర అభ్యంతరకరం, అవాస్తవమని పేర్కొన్నారు. నీరు, విద్యుత్తు పంపిణీ, క్యారీఓవర్‌ స్టోరేజి, వరద జలాలను లెక్కించడం తదితర విషయాల్లో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, గతంలో కూడా అనేకసార్లు ఈ విషయమై లేఖలు రాశామని స్పష్టం చేశారు. విద్యుత్తు పంపిణీ 50:50 నిష్పత్తిలో ఉండాలని ఆర్‌.ఎం.సి. ముసాయిదా పేర్కొందని, ఇది తమకు ఆమోదయోగ్యం కాదని తెలిపింది. శ్రీశైలం జల విద్యుత్తు ప్రాజెక్టు అని, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కింద రెండు రాష్ట్రాల తాగు, సాగు అవసరాలకు, ఆవిరయ్యే నీటితో కలిపి 280 టీఎంసీలను విడుదల చేయాల్సి ఉందన్నారు. పూర్తి సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి చేయాలని 2021 జూన్‌లో టి.ఎస్‌.జెన్‌కోను ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చామని, 50:50 నిష్పత్తిలో అనడం పై ఉత్తర్వులకు విరుద్ధమని వివరించారు. లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

854 అడుగులు కాదు 830 ఉండాలి

* శ్రీశైలం కనీస నీటిమట్టం 854 అడుగులు ఉండాలని ఆర్‌.ఎం.సి. ముసాయిదా పేర్కొంది. ఇది కేంద్ర జలసంఘం మార్గదర్శకాలకు విరుద్ధం. వాస్తవానికి 830 అడుగులు ఉండాలి.

* కృష్ణా ట్రైబ్యునల్‌-1 ప్రకారం శ్రీశైలం నుంచి నీటిని తీసుకోవడానికి అవకాశం లేదు. ఈ ట్రైబ్యునల్‌ అవార్డు నోటిఫై అయ్యాక చెన్నై తాగునీటి సరఫరాకు జులై నుంచి అక్టోబరు వరకు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 1500 క్యూసెక్కులు తీసుకోవడానికి, తర్వాత ఉమ్మడి ఏపీ శ్రీశైలం కుడిగట్టు కాలువకు 19 టీఎంసీలకు ఆమోదం పొందింది. దీన్ని కృష్ణా ట్రైబ్యునల్‌-2 ఎదుట సవాలు చేశాం. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కులకు పెంచడమూ అక్రమం. దీన్నీ సవాలు చేశాం. 

* ఎస్సార్బీసీకి 19 టీఎంసీలకు అంగీకరించినా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి వెళ్లాల్సింది 34 టీఎంసీలే. బోర్డు, ఆర్‌.ఎం.సి.లు ఈ మేరకు మాత్రమే నీటిని తీసుకొనేలా ఆంధ్రప్రదేశ్‌ను నియంత్రించాలి.

* మిగులుజలాల వినియోగం అంశం ప్రస్తుతం కృష్ణా ట్రైబ్యునల్‌-2 ముందు ఉంది. రిజర్వాయర్లు పొంగిపొర్లినపుడు వాడుకొనే నీటిని లెక్కలోకి తీసుకోరాదని ట్రైబ్యునల్‌ ఎదుట ఏపీ అడగలేదు. ఇక్కడ ఒప్పందం ద్వారా ప్రయోజనం పొందాలని చూస్తోంది. వరదల తర్వాత శ్రీశైలం, సాగర్‌ల నుంచి తెలంగాణ తీసుకొనే నీటిలో మార్పు చేస్తే తప్ప మిగులు జలాల విషయంలో ఒప్పందం చేసుకోవడానికి కారణం కనిపించడం లేదు.

* నీటి పంపిణీ 66:34 నిష్పత్తిలో కాకుండా 50:50 నిష్పత్తిలో ఉండాలని ఈ ఏడాది మే 6న జరిగిన బోర్డు సమావేశంలో తెలంగాణ కోరింది. మొత్తం 575 టీఎంసీలు అవసరమంటూ బోర్డు ఏకపక్షంగా 66:34 నిష్పత్తిని కొనసాగిస్తూ నోటీసు జారీ చేసింది. దీనికి మా ఆమోదం లేదు. న్యాయపరంగా చెల్లదు. ఈ సంవత్సరం కేటాయించి వినియోగించుకోని నీటిని తదుపరి ఏడాది వాడుకోవడానికి అనుమతించాలని తెలంగాణ తరచూ కోరుతున్నా బోర్డు అంగీకరించడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని