‘నాడు-నేడు’ నిధులు వెనక్కి..

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చేపట్టిన ‘నాడు-నేడు’ రెండో విడత నిధులను ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంది.

Updated : 06 Dec 2022 06:35 IST

ఖర్చు చేయని సొమ్ము తిరిగి ఇచ్చేయాలంటూ ఆదేశాలు

రూ.266 కోట్లు తీసుకున్న ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చేపట్టిన ‘నాడు-నేడు’ రెండో విడత నిధులను ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంది. జిల్లాలకు కేటాయించిన నిధుల్లో ఖర్చు చేయని మొత్తాలను రాష్ట్ర కార్యాలయానికి జమచేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. నిధుల కొరత కారణంగా ‘నాడు-నేడు’ రెండో విడత పనులు నత్త నడకన సాగుతున్నాయి. పనుల ప్రారంభంలోనే తీవ్ర జాప్యం జరగ్గా.. ఇప్పుడు నిధుల కొరతతో ముందుకు సాగడం లేదు. పలు పాఠశాలల్లో ఇప్పటి వరకు చేసిన పనుల కంటే నిధులు ఎక్కువగా ఉన్నాయని, వాటిని అవసరమైన బడులకు సర్దుబాటు చేసేందుకు ‘నాడు-నేడు’ ప్రధాన కార్యాలయ ఖాతాకు జమ చేయాలని మౌలిక వసతుల కల్పన విభాగం ఆదేశాల్లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు చేయని రూ.266.24 కోట్లను వెనక్కి తీసేసుకున్నారు. రాష్ట్రంలో రూ.వెయ్యి కోట్ల వరకు బిల్లులు పేరుకుపోయాయి. ప్రభుత్వం వీటికి డబ్బు ఇవ్వకపోవడంతో స్థానికంగానే సర్దుబాటుకు ఈ చర్యలు చేపట్టారు. అత్యధికంగా కాకినాడ, గుంటూరు జిల్లాల నుంచి రూ.28 కోట్ల చొప్పున రాష్ట్ర కార్యాలయ ఖాతాకు జమ చేశారు. నెల్లూరు జిల్లాలో రూ.కోటి ఉన్నా వీటిని వెనక్కి లాగేశారు. ఖర్చు చేయని మొత్తమంటూ వెనక్కి తీసుకోవడంతో భవిష్యత్తులో పనులు చేపట్టేందుకు నిధుల కొరత ఏర్పడుతుందనే అభిప్రాయం ఉంది.

చాలాచోట్ల గదుల కొరత..

ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదుల కొరత తీవ్రంగా ఉంది. ప్రాథమిక పాఠశాలల నుంచి 3,4,5 తరగతులను తరలించడంతో ఉన్నత పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న గదుల్లోనే సర్దుబాటు చేశారు. మరికొన్నిచోట్ల కొత్త గదుల నిర్మాణం కోసం పాతవాటిని కూల్చేశారు. మొదటి విడతలో గదుల నిర్మాణం చేపట్టనందున రెండో విడతలోనే వీటిని నిర్మిస్తున్నారు. నిధుల కొరతతో గదులు సకాలంలో పూర్తికాకపోతే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు నిధులు ఖర్చు చేసినా బిల్లులు రావడం లేదు. సెప్టెంబరు నెల చివరి నుంచి చాలా బడులకు బిల్లులు విడుదల కాలేదు. ఇలాంటి చోట పనులు నిలిపివేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని