ప్రైవేటు విద్యార్థులకూ రెసిడెంట్‌ డాక్టర్‌గా అవకాశం

సీనియర్‌ రెసిడెంట్స్‌ (ఎస్‌ఆర్‌)గా పనిచేసే అవకాశాన్ని పీజీ వైద్య విద్య పూర్తిచేసిన వారందరికీ కల్పిస్తూ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) నోటిఫికేషన్‌ జారీచేసింది.

Updated : 06 Dec 2022 06:29 IST

హైకోర్టు ఆదేశాలతో తొలి ఉత్తర్వులు రద్దు చేసిన డీఎంఈ

ఈనాడు, అమరావతి: సీనియర్‌ రెసిడెంట్స్‌ (ఎస్‌ఆర్‌)గా పనిచేసే అవకాశాన్ని పీజీ వైద్య విద్య పూర్తిచేసిన వారందరికీ కల్పిస్తూ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) నోటిఫికేషన్‌ జారీచేసింది. కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే ఎస్‌ఆర్‌గా అవకాశమిస్తూ నవంబర్‌ 13న ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకుంది. ప్రైవేట్‌ కళాశాలల్లో పీజీ చేసిన వారికి అవకాశం ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 2న హైకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు తొలి నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు డీఎంఈ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు.

ఇదీ వివాదం: బోధనాసుపత్రుల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరాలంటే సీనియర్‌ రెసిడెంట్‌గా ఏడాదిపాటు తప్పనిసరిగా పనిచేయాలి. అయితే, ఎస్‌ఆర్‌ విధానాన్ని ప్రభుత్వ కళాశాలల్లో చదివిన వైద్య విదార్థులకే పరిమితం చేస్తున్నట్లు తొలుగ డీఎంఈ ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. నీట్‌ పీజీ ద్వారా ర్యాంకులు సాధించిన వారు ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహించిన కౌన్సెలింగ్‌ ద్వారానే ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో సీట్లు పొందుతున్నారు. వీరందరికీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయమే పరీక్షలు నిర్వహిస్తోంది. అయినా పారితోషికం భారం దృష్ట్యా ప్రభుత్వ/ ప్రైవేటు వివక్ష చూపడం వివాదానికి కారణమైంది. హైకోర్టు ఆదేశాల మేరకు జాతీయ వైద్య మండలి అనుమతి పొందిన కళాశాలల్లో పీజీ అల్లోపతి, దంత వైద్య విద్య (డీఎం/ ఎంసీహెచ్‌/ ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ/ ఎండీఎస్‌)ను పూర్తిచేసిన వారందరికీ ఎస్‌ఆర్‌గా దరఖాస్తు చేసుకునే అవకాశమిచ్చినట్లు డీఎంఈ వినోద్‌కుమార్‌ తాజాగా ప్రకటించారు. స్థానికులు లేకుంటే స్థానికేతరుల (వైద్యమండలి, దంత వైద్యమండలి కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారికి)కు అవకాశం ఇస్తామన్నారు. ఈ నెల 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. వైద్య కళాశాలల వారీగా పోస్టింగ్స్‌ను ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లో కేటాయిస్తారు. జనరల్‌ సర్జరీ, గైనిక్‌, పీడియాట్రిక్స్‌, ఈఎన్‌టీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, తదితర 49 స్పెషాలిటీల్లో 1,458 సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని