క్షేత్రస్థాయి పరిశీలనతో భూ రికార్డుల స్వచ్ఛీకరణ జరగాలి

భూముల రికార్డుల స్వచ్ఛీకరణ చర్యలను కార్యాలయాల్లో కూర్చోకుండా క్షేత్రస్థాయిలో పరిశీలన ఆధారంగా చేపట్టాలని భూ పరిపాలన శాఖ జిల్లా అధికారులను ఆదేశించింది.

Published : 06 Dec 2022 05:02 IST

జిల్లా కలెక్టర్లకు సీసీఎల్‌ఏ ఆదేశాలు

ఈనాడు, అమరావతి: భూముల రికార్డుల స్వచ్ఛీకరణ చర్యలను కార్యాలయాల్లో కూర్చోకుండా క్షేత్రస్థాయిలో పరిశీలన ఆధారంగా చేపట్టాలని భూ పరిపాలన శాఖ జిల్లా అధికారులను ఆదేశించింది. నిర్దేశించిన మేరకు 17,460 గ్రామాల్లో రీ-సర్వే పూర్తి చేసేందుకు రికార్డుల స్వచ్ఛీకరణ మరింత జాగ్రత్తగా చేపట్టాలని పేర్కొంది. ఈ మేరకు గ్రామ సచివాలయ సిబ్బందితో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. రీ-సర్వేలో భాగంగా 17,460కు గాను 4,000 గ్రామాల్లో ఇప్పటికే ‘ఆర్థో రెక్టిఫైడ్‌ ఇమేజ్‌స్‌’ ప్రాసెస్‌ ముగిసింది. మిగిలిన గ్రామాల్లో రానున్న వంద రోజుల్లోగా భూ రికార్డుల స్వచ్ఛీకరణ పూర్తి చేయాలి. అడంగళ్‌, 1బి, ఆర్‌.ఎస్‌.ఆర్‌., ఎఫ్‌ఎంబీ/విలేజ్‌ మ్యాప్‌, ఇతర వాటిని పరిశీలించేందుకు అవసరమైతే గూగుల్‌ మ్యాప్‌ సహకారాన్ని తీసుకోవాలని తెలిపింది. రీ-సర్వేలో భాగంగా జరిగే ‘డ్రోన్‌ ఫ్లైయింగ్‌’ ముందు ఈ ప్రక్రియ జరిగిపోవాలని వెల్లడించింది. ‘క్షేత్రస్థాయిలో భూమిపై పరిశీలన జరగడం ద్వారా వ్యత్యాసాలు (మ్యుటేషన్‌/పట్టా సబ్‌ డివిజన్‌/ఎఫ్‌-లైన్స్‌, ఆర్‌.ఎస్‌.నెంబర్లు/చుక్కల భూములు, ఇతర) వెంటనే సరిచేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రకాశం జిల్లా కలెక్టర్‌ భూముల రికార్డుల స్వచ్ఛీకరణలో చేపట్టిన చర్యల ద్వారా వచ్చిన పురోగతిని పరిశీలించాలి. విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్‌, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌, డిజిటల్‌ అసిస్టెంట్‌, ఇంజినీరింగ్‌, సర్వేయర్‌తో కలిపి ‘ఫీల్డ్‌ వెరిఫికేషన్‌’ కమిటీలు ఏర్పాటు చేయాలి. గ్రామాల పేర్లు, సర్వే నెంబర్ల వారీగా జరిగే క్షేత్రస్థాయి పరిశీలన గురించి ప్రజలకు ముందుగానే తెలియబరచాలి. పరిశీలనలో కుటుంబాల మధ్య వివాదాలు ఉంటే వారితో చర్చించి, పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. కోర్టు వివాదాలు ఉంటే.. వాటి గురించి తహసీల్దార్‌ దృష్టికి తీసుకువెళ్లాలి. పట్టాదారు మరణించి ఉంటే...మ్యుటేషన్‌ ద్వారా పేర్లు మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలని వారసులకు తెలియచేయాలి. ప్రభుత్వ భూముల ఆక్రమణలు గుర్తిస్తే మండల సర్వేయర్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఉమ్మడిగా అవసరమైన చర్యలు తీసుకోవాలి. క్షేత్రస్థాయి పురోగతిని ప్రతి గురువారం సమీక్షిస్తాం...’ అని రాష్ట్ర భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌ జి.సాయిప్రసాద్‌ వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గ్రామ రెవెన్యూ బృందాలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లాల కలెక్టర్లకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని