JEE Main 2023: జేఈఈలో మళ్లీ ఇంటర్‌ మార్కుల నిబంధన!

జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌ పరీక్షలకు ఇంటర్‌లో కనీస మార్కుల నిబంధనను పునరుద్ధరించాలని కేంద్ర విద్యాశాఖ, జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ)లు భావిస్తున్నాయి.

Updated : 07 Dec 2022 09:12 IST

పాత విధానం పునరుద్ధరించనున్న ఎన్‌టీఏ

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌ పరీక్షలకు ఇంటర్‌లో కనీస మార్కుల నిబంధనను పునరుద్ధరించాలని కేంద్ర విద్యాశాఖ, జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ)లు భావిస్తున్నాయి. ప్రవేశాలు పొందాలంటే జేఈఈలో ర్యాంకుతోపాటు ఇంటర్‌లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 65 శాతం, ఇతరులు 75 శాతం మార్కులు పొందటం తప్పనిసరి. కరోనా మహమ్మారి కారణంగా చాలా రాష్ట్రాల్లో ఇంటర్‌ లేదా 12వ తరగతి వార్షిక పరీక్షలు జరగలేదు. ఈ నేపథ్యంలో 2020 నుంచి 2022 వరకు ఆ నిబంధనలను ఎత్తివేశారు. ఇంటర్‌ కనీస మార్కులతో పాసైనవారూ ప్రవేశ పరీక్ష ర్యాంకుతో ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో చేరేలా వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్నందున జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌-2023కు మళ్లీ పాత నిబంధనలను అమలు చేయాలని జేఈఈ మెయిన్‌ను నిర్వహించే ఎన్‌టీఏ, అడ్వాన్స్‌డ్‌ను జరిపే ఐఐటీలు ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం.

మెయిన్‌ నిర్వహణపై ఇంకా అయోమయమే

జేఈఈ మెయిన్‌ను జనవరి, ఏప్రిల్‌లో నిర్వహించాలని భావిస్తున్న ఎన్‌టీఏ.. ఇప్పటివరకు నోటిఫికేషన్‌ ఇవ్వకపోవడం విద్యార్థులను అయోమయానికి గురిచేస్తోంది. మొదటి విడత జనవరిలో నిర్వహించని పక్షంలో ఫిబ్రవరి, మార్చిలో జరిపేందుకు కొన్ని అడ్డంకులున్నాయి. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి సీబీఎస్‌ఈ పరీక్షలు మొదలవుతాయి. ఇతర రాష్ట్రాల్లో మార్చిలో ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమవుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరిలో ప్రయోగ పరీక్షలు, మార్చిలో ఇంటర్‌ పరీక్షలు ఉంటాయి. వాస్తవంగా నోటిఫికేషన్‌కు, పరీక్షకు మధ్య కనీసం 40 రోజుల వ్యవధి ఉండాలి. ఆ ప్రకారం ఈ వారంలో ప్రకటన జారీ చేస్తేనే జనవరి నెలాఖరులో పరీక్ష జరిపేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ‘ఒకవేళ జనవరిలో నిర్వహించలేని పక్షంలో ఏప్రిల్‌, మే నెలల్లో జరుపుతామంటూ అధికారికంగా ప్రకటిస్తే విద్యార్థులకు సన్నద్ధతపై స్పష్టత వస్తుంది. ఎన్‌టీఏ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన రాకపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోందని’ వారు అభిప్రాయపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని