‘గడప గడప’కూ తాయిలాలు

గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైకాపా కార్యకర్తలు వెండి జ్ఞాపికలు పంపిణీ చేయడం ఒంగోలులో వెలుగుచూసింది.

Published : 07 Dec 2022 03:50 IST

ఒంగోలులో వెండి జ్ఞాపికల అందజేత

ఒంగోలు ట్రంకురోడ్డు, ఒంగోలు నగరం-న్యూస్‌టుడే: గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైకాపా కార్యకర్తలు వెండి జ్ఞాపికలు పంపిణీ చేయడం ఒంగోలులో వెలుగుచూసింది. 25వ డివిజన్‌లో ఈ కార్యక్రమం జోరుగా సాగింది. ఒంగోలు నగరపాలక సంస్థ ఉపమేయర్‌ వేమూరి సూర్యనారాయణ ఈ డివిజన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడురోజులుగా ఈ డివిజన్‌లో మాజీమంత్రి, శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బాలినేని అక్కడి నుంచి వెళ్లిపోగానే మరో బృందం వెళ్లి, ఆయా కుటుంబాల సంప్రదాయాలను బట్టి వెండితో తయారుచేసిన దేవుని ప్రతిమలను అందజేశారు. కార్పొరేటర్‌ వేమూరికి బంగారు ఆభరణాల దుకాణం ఉంది. ఆయన డివిజన్‌లో ఉన్నవారికి ఈ బహుమతులు అందడం గమనార్హం. మరోవైపు ఇటీవల 26వ డివిజన్‌లోనూ కొందరికి వెండి ప్రతిమలు అందించారు. గత నెలలో ఎమ్మెల్యే బాలినేని తమ సొంత స్థలంలో శ్రీనివాస కల్యాణం నిర్వహించారు. ఆ కల్యాణానికి హాజరైన భక్తులకు స్వామివారి ప్రసాదం, చీరలు పంపిణీ చేశారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో కొందరికి అందలేదు. అలా అందని 26వ డివిజన్‌లోని కొందరికి ఈ ప్రతిమలను పంపిణీ చేసినట్లు కార్యకర్తలు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని