తానా ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్టూన్ల పోటీలు

తెలుగు కార్టూన్ల కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటేందుకు అంతర్జాతీయ కార్టూన్ల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు తోటకూర ప్రసాద్‌ వెల్లడించారు.

Published : 07 Dec 2022 05:15 IST

పటమట (విజయవాడ), న్యూస్‌టుడే: తెలుగు కార్టూన్ల కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటేందుకు అంతర్జాతీయ కార్టూన్ల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు తోటకూర ప్రసాద్‌ వెల్లడించారు. విజయవాడలోని సర్వోత్తమ గ్రంథాలయం ఆడిటోరియంలో పోటీల కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తోటకూర ప్రసాద్‌ మాట్లాడుతూ తానా తొలిసారిగా ఈ పోటీలను నిర్వహిస్తోందని, ప్రపంచంలో ఏ దేశంలో నివసిస్తున్న తెలుగు వారైనా పాల్గొనవచ్చన్నారు. వ్యక్తులను, మతాలను, రాజకీయపార్టీలను కించపరిచేలా కాకుండా, వ్యవస్థలోని లోపాలను తెలిపే విధంగా ఉండాలన్నారు. పోటీల్లో వచ్చిన 12 అత్యుత్తమ కార్టూన్లు ఎంపిక చేసి ఒక్కొక్క దానికి రూ.5 వేలు, మరో 13కి రూ.3 వేలు చొప్పున మొత్తం 25 మందికి నగదు బహుమతులు అందజేస్తామని వివరించారు. ఒక్కొక్కరూ మూడు కార్టూన్లు పంపవచ్చని చెప్పారు. అనంతరం వీటిని డిజిటల్‌ పుస్తకంగా ప్రచురిస్తామన్నారు. కార్టూన్లను ఈ నెల 26వ తేదీ లోగా జేపీజీ ఫార్మెట్‌లో tanacartooncontest23@gmail.com పంపాలని సూచించారు. ఫలితాలను జనవరి 15 సంక్రాంతి రోజున ప్రకటిస్తామని చెప్పారు. ఇతర వివరాలకు 91545 55675 నంబరులో సంప్రదించాలని తెలిపారు. ఈ సమావేశంలో కార్యనిర్వాహక సభ్యులు కళాసాగర్‌, కలిమి శ్రీ, కార్టూనిస్టులు ఆదినారాయణ, మురళీధర్‌, ప్రసాద్‌, భువన్‌, రావేళ్ల, సర్వోత్తమ గ్రంథాలయ సంఘం కార్యదర్శి రావి శారద తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని