జీతాలేవి మహాప్రభో..!

ఉద్యోగులకు జీతాల కోసం పడిగాపులు తప్పడం లేదు. జీతాలే ఇలావుంటే.. మిగతా డిమాండ్లు తీరేదెప్పుడు? ఉపాధ్యాయ, ఉద్యోగుల మనోభావాలు ఎలా ఉన్నాయనే అంశంపై మంగళవారం ఈటీవీ ప్రతిధ్వని చర్చ చేపట్టింది.

Updated : 07 Dec 2022 05:30 IST

ప్రభుత్వమే ఆలస్యం చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి?
నేడు కలెక్టరేట్‌ల వద్ద  రాష్ట్రోపాధ్యాయ సమాఖ్య నిరసన
ఈటీవీ ప్రతిధ్వని చర్చ

ఈటీవీ, అమరావతి: ఉద్యోగులకు జీతాల కోసం పడిగాపులు తప్పడం లేదు. జీతాలే ఇలావుంటే.. మిగతా డిమాండ్లు తీరేదెప్పుడు? ఉపాధ్యాయ, ఉద్యోగుల మనోభావాలు ఎలా ఉన్నాయనే అంశంపై మంగళవారం ఈటీవీ ప్రతిధ్వని చర్చ చేపట్టింది. ఇందులో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నేతల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.


పీనల్‌ ప్రొవిజన్‌ ఏర్పాటు కోరతాం

రాష్ట్రంలో నవంబరు నుంచి ఏ నెలకు ఆ నెల జీతం, పింఛను తీసుకోవడానికి ఇబ్బందులు తలెత్తే పరిస్థితి వస్తుందని ఫిబ్రవరిలోనే చెప్పాను. నేటికీ 40% ఉద్యోగులకు జీతాలు రాలేదు. 80% పింఛనుదారులకు ఇంకా పింఛను జమకాలేదు. ఆర్టికల్‌ 72 ప్రకారం ఉద్యోగుల జీతభత్యాలు, పింఛను మొత్తాన్ని ఆ నెల 30వ తేదీకి ఇవ్వాలి. దాన్ని ఒకటో తేదీగా మార్చారు. ఏడో తేదీలోగా వేతనాలు చెల్లించకపోతే, కార్మికులు ఫిర్యాదు చేస్తే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఇండియన్‌ వేజెస్‌ యాక్ట్‌-1936లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాల్లో జీతాలు, పింఛన్లు చివరి అంశంగా ఉన్నట్లు కనిపిస్తోంది. సమయానికి ఈఎంఐ చెల్లించకపోతే ఒక్కరోజు ఆలస్యమైనా నెల వడ్డీ భారం భరించాలి. 2018-19 డీఏ బకాయిలు చెల్లిస్తామని రెండేళ్ల క్రితం జీవోలు ఇచ్చారు. వీటిని చెల్లించకపోయినా జీతాల నుంచి ఆదాయపన్ను మినహాయించారు. ఇంకా కొత్తగా రెండు డీఏలు రావాలి. ఉద్యోగ విరమణ చేసినవారి ఆర్థిక ప్రయోజనాలు ఒక్కరోజు ఆలస్యం చేసినా 4% వడ్డీతో చెల్లించాలనే నిబంధన ఉన్నా అమలు కావడంలేదు. 2023లో కొత్త పీఆర్సీ ఏర్పాటుచేయాలని కోరము. ప్రభుత్వం ఏప్రిల్‌లో ఉద్యోగ సంఘాలతో చర్చించి ఎంత వేతన సవరణ చేయబోతున్నారనేది ప్రకటించి ఓ నిర్ణయం తీసుకోవాలని డిమాండు చేస్తున్నాం.

కె.ఆర్‌.సూర్యనారాయణ, అధ్యక్షుడు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం


ఆర్థికంగా బాగుంటే ఎందుకు ఆలస్యం?

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని ప్రభుత్వం ప్రకటిస్తోంది. మరి జీతాలు, పింఛన్లు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? స్కీంలకు బటన్‌ నొక్కుతున్నారు గానీ.. జీతాలు, బకాయిల విషయంలో ఏ బటన్‌ నొక్కడంలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఇబ్బందులను మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకెళ్లినా నిర్దిష్టమైన హామీలు ఏమీ రావడంలేదు. ఆర్థికేతర అంశాల సాధనకు సాధారణ పరిపాలన కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ కూడా చాలా మొత్తం విడుదల కావాలి. బోధనేతర విధుల పేరిట ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి మినహాయించడం హాస్యాస్పదం. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే చేస్తున్న అనేక బోధనేతర కార్యక్రమాల నుంచి మినహాయించాలి. అయిదు గంటలపాటు బోధించాల్సిన ఉపాధ్యాయులకు ఓ గంట యాప్‌లతోనే కాలం సరిపోతుంది.

సాయి శ్రీనివాస్‌, అధ్యక్షుడు, రాష్ట్రోపాధ్యాయ సంఘం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని