పాత పింఛన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి

పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉమ్మడి జాతీయ సదస్సులో నాయకులు డిమాండ్‌ చేశారు.

Updated : 09 Dec 2022 05:47 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సదస్సు డిమాండ్‌

ఈనాడు, దిల్లీ: పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉమ్మడి జాతీయ సదస్సులో నాయకులు డిమాండ్‌ చేశారు. పాత పింఛన్‌ పునరుద్ధరణపై దిల్లీ తాలకటోరా స్టేడియంలో అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్‌జీఈఎఫ్‌), కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య (సీసీజీఈడబ్ల్యూ)ల ఆధ్వర్యంలో సంయుక్త జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఒప్పంద ఉద్యోగ వ్యవస్థను రద్దు చేసి శాశ్వత ఉద్యోగులను నియమించాలని, పొరుగు సేవల ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ఉద్యోగులకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలపై 2023 మే, జూన్‌ నెలల్లో ప్రచారం నిర్వహించాలని, జులై, ఆగస్టుల్లో రాష్ట్ర స్థాయి జాతాలు చేపట్టాలని, సెప్టెంబరులో పార్లమెంట్‌ మార్చ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. సదస్సులో ఆయా సంఘాల నేతలు సుభాష్‌ లాంబా, శ్రీకుమార్‌, రవీంద్రన్‌ నాయర్‌, పరాశర్‌, ఎం.ఏ.అజిత్‌ కుమార్‌, శివరాజన్‌ పాల్గొన్నారు.


జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం: బండి శ్రీనివాసరావు

ఉద్యోగులకు నెల మొదటి తేదీన జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడం బాధాకరమని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు, జేఏసీ ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు అన్నారు. ఏఐఎస్‌జీఈఎఫ్‌, సీసీజీఈడబ్ల్యూ సంయుక్త జాతీయ సదస్సులో పాల్గొన్న అనంతరం ఏపీ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపులో ఆలస్యం అవుతోందన్నారు. మంత్రులు, శాసనసభ్యుల జీతాలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలో జమ చేస్తుండడం సరికాదన్నారు. కాంట్రిబ్యూటరీ పింఛను విధానం (సీపీఎస్‌) రద్దు చేయాలని తాము చేస్తున్న డిమాండ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీపీఎస్‌ను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని