తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల శాశ్వత పంపిణీ జరగలేదు

కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయించిన 811 టీఎంసీల నీటిని రాష్ట్ర విభజన తర్వాత ఒప్పందాల ద్వారా కానీ, ట్రైబ్యునల్‌ ద్వారా కానీ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య శాశ్వత ప్రాతిపదికన ఇప్పటివరకూ పంపిణీ చేయలేదని కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ టుడు తెలిపారు.

Updated : 09 Dec 2022 05:03 IST

విద్యుత్తు ఉత్పత్తిలో ఇరువైపులా నిబంధనల ఉల్లంఘన

కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు వెల్లడి

ఈనాడు, దిల్లీ: కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయించిన 811 టీఎంసీల నీటిని రాష్ట్ర విభజన తర్వాత ఒప్పందాల ద్వారా కానీ, ట్రైబ్యునల్‌ ద్వారా కానీ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య శాశ్వత ప్రాతిపదికన ఇప్పటివరకూ పంపిణీ చేయలేదని కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ టుడు తెలిపారు. ఆయన గురువారం లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘‘అంతర్‌ రాష్ట్ర జల వివాదాల పరిష్కార చట్టం 1956లోని సెక్షన్‌ 5(3)కింద 1976లో బచావత్‌ ట్రైబ్యునల్‌ (కృష్ణా జలవివాద పరిష్కార ట్రైబ్యునల్‌-1) 75% డిపెండబిలిటీ ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల నీటిని కేటాయించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వాటాలను ఇంతవరకూ ఖరారు చేయలేదు. ఈ పరిస్థితుల్లో రెండు రాష్ట్రాలు 2015-16 జలసంవత్సరంలో పరస్పర అంగీకారంతో తాత్కాలిక ప్రాతిపదికన ఒక కార్యాచరణ ఒప్పందం చేసుకున్నాయి. తర్వాతి సంవత్సరానికి ఆ ఒప్పందాన్ని అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదించింది. 2017-18 నుంచి 2022-23 మధ్యకాలంలో ఏటా అదే ఏర్పాట్లను కృష్ణా నదీ యాజమాన్య మండలి (కేఆర్‌ఎంబీ) ఆమోదిస్తూ వచ్చింది. ఆ తాత్కాలిక ఒప్పందానికి అనుగుణంగా రెండు రాష్ట్రాలు నీటిని తీసుకొని వాడుకుంటూ వస్తున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టులు ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి రిజర్వాయర్లుగా పనిచేస్తున్నాయి. అక్కడ 2 రాష్ట్రాలూ జల విద్యుత్తు ఉత్పత్తిచేస్తున్నాయి. 2020-21, 2021-22 సంవత్సరాల్లో రెండు రాష్ట్రాలూ డ్యాంల్లో మిగులు జలాలు లేనప్పుడు పాటించాల్సిన నిబంధనలను ఉల్లంఘించాయి. జల విద్యుత్తు ఉత్పత్తిని ఆపేయాలని కేఆర్‌ఎంబీ పదేపదే విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. విద్యుత్తు ఉత్పత్తికోసం రిజర్వాయర్లను దుర్వినియోగం చేయకుండా కేఆర్‌ఎంబీ ఒక ఉపకమిటీని ఏర్పాటుచేసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలోని విద్యుత్తు కేంద్రాల నిర్వహణతోపాటు, రిజర్వాయర్లను తగిన విధంగా నిర్వహించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని రూపొందించడం ఈ కమిటీ బాధ్యత. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాలను పంపిణీచేసే అధికారం ప్రస్తుత బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌కు ఉంది’’ అని కేంద్ర మంత్రి వివరించారు.

9,576 మంది తెలంగాణ వాసులు విదేశాల్లో పనులు..

ఈ-మైగ్రేట్‌ పోర్టల్‌లో నమోదయిన లెక్క ప్రకారం ఈ ఏడాది అక్టోబరు 31 నాటికి 9,576 మంది తెలంగాణ వాసులు విదేశాల్లో పనులు చేస్తున్నారని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌ తెలిపారు. తెరాస రాజ్యసభ సభ్యుడు పార్థసారథిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సౌదీ అరేబియాలో అత్యధికంగా 2,215 మంది, అత్యల్పంగా ఇరాక్‌లో 29 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఈ 9,576 మందిలో అత్యధికంగా నిజామాబాద్‌ వాసులు 2,476 మంది ఉన్నారన్నారు. జయశంకర్‌ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌ జిల్లాల నుంచి అత్యల్పంగా ముగ్గురు చొప్పున ఉన్నారని వెల్లడించారు.

దేశవ్యాప్తంగా కేంద్ర పర్యావరణ అనుమతులు ఇవ్వాల్సిన ప్రాజెక్టుల ప్రతిపాదనలు 117 ఉండగా అందులో తెలంగాణకు చెందినవి ఆరు ఉన్నాయని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌చౌబే తెలిపారు. తెరాస ఎంపీ దామోదర్‌రావు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రాజెక్టు ప్రతిపాదనలు సమర్పించాక కనీసం 105 రోజుల గడువు ఉంటుందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని