ISB: ఫలించిన దార్శనికత

అంతర్జాతీయ స్థాయి మేనేజ్‌మెంట్‌ విద్యను అభ్యసించేందుకు వార్టన్‌, బూత్‌, కెల్లాగ్‌, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ వంటి విదేశీ విద్యా సంస్థలకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో.. అటువంటి ప్రమాణాలను మనదేశంలో ఆవిష్కరించిన ఘనత ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌కు (ఐఎస్‌బీ) దక్కుతుంది.

Updated : 16 Dec 2022 10:09 IST

అగ్రశ్రేణి మేనేజ్‌మెంట్‌ విద్యా సంస్థగా ఎదిగిన ఐఎస్‌బీ
ఎన్నో రాష్ట్రాలు పోటీపడినా హైదరాబాద్‌లో ఏర్పాటు
రెండు దశాబ్దాల ఘన ప్రస్థానం
నేడు ద్వి దశాబ్ది వేడుకల ముగింపు
ముఖ్య అతిథిగా పాల్గొననున్న చంద్రబాబు

ఈనాడు, బిజినెస్‌ బ్యూరో: అంతర్జాతీయ స్థాయి మేనేజ్‌మెంట్‌ విద్యను అభ్యసించేందుకు వార్టన్‌, బూత్‌, కెల్లాగ్‌, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ వంటి విదేశీ విద్యా సంస్థలకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో.. అటువంటి ప్రమాణాలను మనదేశంలో ఆవిష్కరించిన ఘనత ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌కు (ఐఎస్‌బీ) దక్కుతుంది. రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటైన ఈ విద్యా సంస్థ దినదిన ప్రవర్థమానమవుతూ, హైదరాబాద్‌కు ఎంతో ప్రతిష్ఠ తీసుకు రావడంతో పాటు దేశానికే గర్వకారణంగా ఎదిగింది. తాజాగా ఎఫ్‌టీ గ్లోబల్‌ ఎంబీఏ ర్యాంకింగ్స్‌- 2022లో ఐఎస్‌బీ 32వ స్థానాన్ని సంపాదించింది. ఆసియా- ఎఫ్‌టీ గ్లోబల్‌ ఎంబీఏ ర్యాంకింగ్స్‌- 2022లో 4వ స్థానంలో నిలిచింది. మనదేశంలో రీసెర్చ్‌ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో ఉంది. ప్రజలకు మేలు చేసే పలు సామాజిక పరిశోధనా ప్రాజెక్టులపైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో; కొన్ని వర్తక సంఘాలతో కలిసి పనిచేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న మేనేజ్‌మెంట్‌ విద్యావేత్తలు, పలు వ్యాపార సంస్థల ప్రతినిధులను ఆకర్షిస్తూ, స్థానికంగా వ్యాపార నైపుణ్యాల విస్తృతికి కృషి చేస్తోంది. మనదేశంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లు ఎన్నో ఏళ్లుగా ఉన్నత మేనేజ్‌మెంట్‌ విద్యను అందిస్తున్నాయి. కానీ అతి తక్కువ సమయంలో అత్యున్నత ప్రమాణాలను సాధించి, అంతర్జాతీయంగా మనదేశానికి గుర్తింపు తెచ్చిన ఘనత ఐఎస్‌బీకి దక్కుతుంది.

ఇంతటి కార్యాచరణతోనే

ఇంతటి అగ్రగామి సంస్థ మనదేశానికి రావడం, అదీ హైదరాబాద్‌లో ఏర్పాటు కావడం అత్యంత అరుదైన అవకాశమనే చెప్పాలి. అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ఉన్న ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు నాయుడు దార్శనికతే ఇందుకు కారణం. మనదేశంలో అంతర్జాతీయ స్థాయి మేనేజ్‌మెంట్‌ విద్యా సంస్థను నెలకొల్పాలనే ఆలోచన మెకిన్సే అండ్‌ కంపెనీ చీఫ్‌ రజత్‌ గుప్తాది. రాహుల్‌ బజాజ్‌, ఆది గోద్రెజ్‌, అంబానీ.. వంటి కార్పొరేట్‌ అగ్రజులు రజత్‌ గుప్తా ఆలోచనను సమర్థించారు. 1997లో ఐఎస్‌బీ గవర్నింగ్‌ బోర్డు ఏర్పాటైంది. ఈ విద్యాసంస్థను ఎక్కడ స్థాపించాలనే ప్రశ్న వచ్చినప్పుడు.. సహజంగానే దేశ ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబయి వైపు గవర్నింగ్‌ బోర్డు మొగ్గుచూపింది. కానీ మరిన్ని రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు రావడంతో, తుది నిర్ణయం తీసుకునే ముందు ఆయా రాష్ట్రాలలో పరిశీలించాలని బోర్డు భావించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు దీనికోసం పోటీ పడ్డాయి. ఇతర రాష్ట్రాలకు బోర్డు సభ్యులు వెళ్లినప్పుడు అక్కడి పాలకులు, అధికారులు కొంత తాత్సారం చేశారు. చంద్రబాబు మాత్రం చొరవ తీసుకుని, గవర్నింగ్‌ బోర్డు సభ్యులను స్వయంగా ఆహ్వానించి హైదరాబాద్‌లో ఐఎస్‌బీ ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ రంగాలు వేగంగా విస్తరిస్తున్నందున ఐఎస్‌బీ వంటి అత్యున్నత స్థాయి మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థ ఏర్పాటైతే నగర ప్రతిష్ఠ ఇంకా పెరుగుతుందని ఆయన ఎంతో భావించారు. ప్రభుత్వ పరంగా పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తామని హామీ ఇవ్వడమే కాకుండా, వేగంగా అనుమతులు మంజూరు చేసేందుకు సిద్ధపడ్డారు. దీంతో గవర్నింగ్‌ బోర్డు హైదరాబాద్‌ను ఎంచుకుంది. 1999 డిసెంబరు 20న భవన నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 2001 డిసెంబరు 2న అప్పటి ప్రధాని వాజ్‌పేయీ చేతుల మీదుగా ఐఎస్‌బీ ప్రారంభమైంది.

మే నెలలో ప్రారంభ వేడుకలకు హాజరైన ప్రధాని మోదీ

రెండు దశాబ్దాలు తక్కువ సమయం ఏమీ కాదు. గతాన్ని సమీక్షించుకుని, భవిష్యత్తు లక్ష్యాలు నిర్దేశించుకోడానికి ఇదొక ముఖ్యమైన సందర్భం. అందువల్ల ద్వి దశాబ్ది వేడుకలను ఐఎస్‌బీ ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం మే నెలలో ప్రారంభ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరై, ఐఎస్‌బీ ప్రత్యేకతలను కొనియాడారు. లాభాపేక్షతో పాటు సమాజానికి మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని ఆయన ఐఎస్‌బీ విద్యార్థులకు సూచించారు. తదుపరి ఎన్నో చర్చాగోష్ఠులనూ ఐఎస్‌బీ ఏర్పాటు చేసింది. ద్వి దశాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమం శుక్రవారం జరగనుంది. దీనికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఐఎస్‌బీ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, విద్యావేత్తలు, ఫ్యాకల్టీ, ఇతర ముఖ్యులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఐఎస్‌బీ వ్యవస్థాపక డీన్‌ డా.ప్రమత్‌ రాజ్‌ సిన్హా కూడా హాజరుకానున్నారు.


ప్రస్తుత పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ కోర్సులు ఇలా..

పీజీపీ: గ్లోబల్‌ ఎంబీఏకు సమానం. 2-25 ఏళ్ల అనుభవం కలిగిన వృత్తి నిపుణులకు ఏడాది శిక్షణ
పీజీపీ మ్యాక్స్‌: 10-25 ఏళ్ల అనుభవం గల సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లకు 15 నెలల పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌.
పీజీపీ ప్రో: 5+ అనుభవంతో పనిచేస్తున్న వృత్తి నిపుణులకు పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌లో 18 నెలల శిక్షణ
పీజీపీ ఎంఎఫ్‌ఏబీ: కుటంబ వ్యాపారాల్లో 0-5 ఏళ్ల అనుభవం కలిగిన వారికి 15 నెలల శిక్షణ


మారిన రూపురేఖలు

రాయదుర్గం, న్యూస్‌టుడే: ఐఎస్‌బీకి శంకుస్థాపన జరిగినప్పుడు నానక్‌రాంగూడలోని ఈ ప్రాంతం  చెట్లు, పొదలతో ఉండేది. చంద్రబాబు చొరవతోనే అమెరికా వెలుపల మైక్రోసాఫ్ట్‌ తొలి కార్యాలయం హైదరాబాద్‌లోనే, ఐఎస్‌బీ చెంతనే ఏర్పాటైంది. ఇదే రోడ్డులో ఇన్ఫోసిస్‌, విప్రో ప్రాంగణాలున్నాయి. సమీపంలోనే క్యాప్‌జెమినీ కార్యాలయం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, ఐటీ మంత్రిగా కె.టి.రామారావు చొరవతో  అమెజాన్‌ సంస్థ రెండో అతిపెద్ద కేంద్రం కూడా ఐఎస్‌బీకి కొంత దూరంలోనే ఏర్పాటైంది. మరిన్ని అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలు ప్రారంభిస్తున్నాయి. ఫైనాన్షియల్‌ జిల్లాలో ఆర్థిక సంస్థలు, ఐసీఐసీఐ బ్యాంక్‌ టవర్‌, ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ సంస్థలు, స్టార్‌ హోటళ్లు శరవేగంగా వచ్చాయి. పరిసర ప్రాంతాల్లో విలాసవంత బహుళ అంతస్తుల భవనాలను నెలకొల్పారు. ఐటీ సంస్థలు కొలువుదీరిన వేవ్‌రాక్‌, క్యూసిటీ వంటి ఐటీ భవనాలు, పలు సంస్థల పరిశోధన, అభివృద్ధి కేంద్రాలూ వచ్చాయి. సమీపంలోని కోకాపేటకూ ఐటీ సదుపాయాలు విస్తరించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు