Andhra News: పొట్టకూటికి ప్రాణాలు పణం

‘తను శవమై.. ఒకరికి వశమై.. తనువు పుండై.. ఒకడికి పండై.. ఎప్పుడూ ఎడారై’ అన్న కవి అలిశెట్టి హృదయ వేదన ఆ విధి వంచితులకు అచ్చంగా సరిపోతుంది. పొట్టకూటికి వ్యభిచారమనే మురికి కూపంలోకి వారు వెళ్లక తప్పడం లేదు.

Updated : 10 Jan 2023 08:51 IST

మహిళా సెక్స్‌ కార్మికులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ప్రథమం
ఏటా 10నుంచి 15శాతం కొత్తగా వృత్తిలోకి..
అనంతపురం, కర్నూలు, చిత్తూరు   జిల్లాలో అధికం
కేంద్ర నివేదిక వెల్లడి

ఈనాడు, అమరావతి: ‘తను శవమై.. ఒకరికి వశమై.. తనువు పుండై.. ఒకడికి పండై.. ఎప్పుడూ ఎడారై’ అన్న కవి అలిశెట్టి హృదయ వేదన ఆ విధి వంచితులకు అచ్చంగా సరిపోతుంది. పొట్టకూటికి వ్యభిచారమనే మురికి కూపంలోకి వారు వెళ్లక తప్పడం లేదు. దురదృష్టవశాత్తూ ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ జాడలు విస్తరిస్తున్నాయి. దేశంలో మహిళా సెక్స్‌ కార్మికులు ఎక్కువగా ఉన్నది ఆంధ్రప్రదేశ్‌లోనని కేంద్ర నివేదిక వెల్లడిస్తోంది. వేశ్యా వృత్తిలోకి ప్రవేశించేవారి సంఖ్య రాష్ట్రంలో ఏటా పెరుగుతోంది. ఇది 10నుంచి 15 శాతం వరకు ఉంటోంది. కొత్తగా వృత్తిలోకి వస్తున్నవారి వయసు సరాసరి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటోంది. జీవనోపాధి లేకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, బాధ్యతలు, విలాస జీవితాలకు అలవాటుపడటం వంటి కారణాలు దీనికి కారణమవుతున్నాయి. దేశంలోనే హెచ్‌ఐవీ బాధితులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో (2.09 లక్షలు) ఉంది. మహారాష్ట్రలో 3.94 లక్షలు, కర్ణాటకలో 2.76 లక్షల మంది హెచ్‌ఐవీ బాధితులు ఉన్నారు.


నేటివ్‌ సెక్స్‌వర్కర్లు ఏపీలో ఎక్కువ

వేశ్యా వృత్తి ఆధారంగా స్థానికంగా జీవించే సెక్స్‌ కార్మికులు (నేటివ్‌ సెక్స్‌ వర్కర్లు) ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ (1.33 లక్షల మంది) తొలి స్థానంలో ఉంది. రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సొసైటీ, సేవా సంస్థల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వీరి సంఖ్య ఎక్కువ. కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోనూ ఎక్కువే. ఈ జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి కడప జిల్లాలో వీరి సంఖ్య తక్కువ. కరవు కాటకాలు, జీవనోపాధి దొరక్క సీమలో చాలా మంది ఈ కూపంలో కూరుకుపోతున్నారు. ఈ జిల్లాల మీదుగా బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై వెళ్లే జాతీయ రహదారులు ఉండటమూ సంఖ్య పెరిగేందుకు కారణమవుతోంది. ఈ సెక్స్‌వర్కర్లలో 1,450 మందికి హెచ్‌ఐవీ సోకినప్పటికీ మందులు వాడుతూ వృత్తిని కొనసాగిస్తున్నారు. మహారాష్ట్రలో నేటివ్‌ సెక్స్‌వర్కర్లు 59,785 మంది ఉన్నారు. దిల్లీలో 46,786 మంది, తక్కువగా మిజోరంలో 833 మంది ఉంటున్నారు.


పొరుగు రాష్ట్రాల నుంచి వలస

ఏపీకి పొరుగు రాష్ట్రాల నుంచి వలస వచ్చి వేశ్యా వృత్తిలో ఉన్నవారు 11,639 మంది ఉన్నారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, అసోం, బిహార్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి నిర్మాణ, ఇతర రంగాల్లో పని చేస్తున్న కొందరు వేశ్యావృత్తిని కొనసాగిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వలసవెళ్లి మహారాష్ట్రలో పడుపు వృత్తిలో ఉన్నవారు 6,06,689 మంది ఉండటం గమనార్హం. ఆ తరువాత గుజరాత్‌లో 2.08 లక్షలు, దిల్లీలో 1.85 లక్షల చొప్పున జీవిస్తున్నారు.

* స్వలింగ సంపర్కులు దేశవ్యాప్తంగా 1,66,844 మంది ఉన్నారు. 25,690 మందితో ఈ జాబితాలో ఏపీది మూడో స్థానం. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో వీరు ఎక్కువగా ఉన్నారు. తమిళనాడులో 46,859, కర్ణాటకలో 34,988 మంది చొప్పున స్వలింగ సంపర్కులు ఉంటున్నారు.

* హిజ్రాలు దేశవ్యాప్తంగా 57,934 మంది ఉండగా 4,157 మంది ఉన్న ఏపీది ఐదో స్థానం. దిల్లీలో 9,415, మహారాష్ట్రలో 8,989, తమిళనాడులో 7,872, ఉత్తరప్రదేశ్‌లో 4,681 మంది చొప్పున జీవిస్తున్నారు.  

* జీవనోపాధికి ఇతర రాష్ట్రాలకు వెళ్లే లారీ డ్రైవర్లు, క్లీనర్లు దేశవ్యాప్తంగా 30వేల మంది వరకు సెక్స్‌ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఈ కేటగిరీలో ఏపీది 15వ స్థానం.


దేశంలో 8,25,055 మంది మహిళా సెక్స్‌వర్కర్లు

దేశంలో 2021 జనవరి నుంచి అదే ఏడాది సెప్టెంబరు మధ్య చేసిన అధ్యయనం ప్రకారం 8,25,055 మంది మహిళా సెక్స్‌ వర్కర్లున్నారు. ఇందులో 1,33,447 మంది సెక్స్‌ వర్కర్లతో ఏపీది తొలి స్థానం. కర్ణాటకలో 1,16,288 మంది, తెలంగాణ 1,00,818, తమిళనాడులో 65,818 మంది చొప్పున ఉన్నారు. 2005లో రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం.. ప్రస్తుతమున్న ఏపీ పరిధిలో 65వేల మంది సెక్స్‌ వర్కర్లు నివసిస్తున్నారు. 2022నాటికి ఈ సంఖ్య రెండింతలు దాటింది. ఉమ్మడి అనంతపురం, కృష్ణా జిల్లాల్లో ఒక్కోచోట 17వేల మందికిపైగా ఉన్నారు. గుంటూరు జిల్లాలో 13,781, కర్నూలులో 12,709, చిత్తూరు జిల్లాలో 10,296 మంది చొప్పున ఉన్నారు. ప్రకాశం, తూర్పుగోదావరి, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాలో 6వేల నుంచి 8వేల మధ్యన ఉన్నారు. కడప, విశాఖ, విజయనగరం జిల్లాల్లో 2వేల నుంచి 4వేల మంది ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కాస్త తక్కువ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని