Ushashri Charan: మంత్రి రిసార్టా... మజాకా?

మహిళా శిశు సంక్షేమ మంత్రి ఉష శ్రీచరణ్‌ కనగానపల్లి మండలం తూంచెర్ల గ్రామ పరిధిలో విలాసవంతమైన భారీ రిసార్టును నిర్మిస్తున్నారు.

Updated : 18 Jan 2023 09:34 IST

నిర్మాణానికి 120 ఎకరాలు సేకరించిన ఉషశ్రీచరణ్‌
ఆమె భర్త చేతిలోకి పవన విద్యుత్తు ప్లాంటు భూములు
రైతుల నుంచీ కారుచౌకగా పొలాల కొనుగోలు

x

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: మహిళా శిశు సంక్షేమ మంత్రి ఉష శ్రీచరణ్‌ కనగానపల్లి మండలం తూంచెర్ల గ్రామ పరిధిలో విలాసవంతమైన భారీ రిసార్టును నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 120 ఎకరాల వరకు సేకరించారు. మొత్తం 300 ఎకరాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం చుట్టుపక్కల రైతుల్ని పొలాలు అమ్మాలని ఒత్తిడి తెస్తున్నారు. సన్నకారు రైతులను భయపెట్టి కారుచౌకగా కొనేస్తున్నారు.

సుజలాన్‌ నుంచి భూసేకరణ

శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధి కనగానపల్లి మండలం తూంచెర్ల గ్రామ పరిధిలోని సర్వే నంబరు 99లో పవన విద్యుత్తు ప్లాంటు స్థాపనకు సుజలాన్‌ సంస్థ రైతుల నుంచి పెద్ద ఎత్తున భూములను సేకరించింది. అప్పట్లో కొంతవరకూ గాలి మరలు ఏర్పాటు చేశారు. ప్లాంటు విస్తరణ కోసం కొంత భూమిని అలాగే వదిలేశారు. దీంతోపాటు తూంచెర్ల సరిహద్దులో ఉన్న కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం నూతిమడుగులలోనూ ఈ సంస్థ భూములను సేకరించింది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషకు మంత్రి పదవి వచ్చాక ఆమె కన్ను ఈ భూములపై పడింది. అనుకున్నదే తడవుగా కంపెనీ నుంచి అతి తక్కువ ధరకు భూముల్ని కొనేశారు.

రైతుల నుంచి బలవంతపు కొనుగోళ్లు

సుజలాన్‌ సేకరించిన భూములను ఆనుకుని నూతిమడుగు గ్రామ రైతుల పొలాలున్నాయి. వీరికి చెందిన సర్వే నంబర్లు 124-2, 3లో 10.92 ఎకరాలు, సర్వే నంబరు 125లో 33.98 ఎకరాలు, సర్వే నంబరు 127లో 10 ఎకరాల చొప్పున మొత్తం 54.9 ఎకరాలను కొన్నారు. ఎకరాకు రూ.1.32 లక్షల చొప్పున చెల్లించినట్లు తెలుస్తోంది. పనులు జరుగుతున్న ప్రాంతానికి ఆత్మకూరు- భానుకోట రహదారి నుంచి ఓ రైతు పొలం మీదుగా ఆయన అనుమతి లేకుండానే రోడ్డు నిర్మించారు. తర్వాత రైతు గొడవ చేయడంతో ఎకరాకు రూ.5 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది. పక్కనే ఉన్న మరో రైతును పొలం అమ్మాలని ఒత్తిడి తేవడంతో ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది.

గుట్టనూ ఆక్రమించేశారు  

సర్వే నంబరు 99లో సుజలాన్‌ సంస్థ సేకరించగా మిగిలిపోయిన భూమిని రైతులు సాగు చేసుకుంటున్నారు. మంత్రి అనుచరులు అందులోని 20 ఎకరాల వరకు ఆక్రమించుకుని కంచె వేసేశారు. దీనిపై ప్రశ్నించగా... ‘మీ భూములు ఎప్పుడో సుజలాన్‌కు ఇచ్చేశారు కదా...’ అంటూ సమాధానం చెప్తున్నారని రైతులు వాపోతున్నారు. సర్వే నంబరు 99కు ఆనుకుని ఉన్న ఆరు ఎకరాల గుట్టనూ ఆక్రమించేశారు.

హంద్రీనీవా మట్టి.. పెన్నా ఇసుక

హంద్రీనీవాలో భాగంగా జీడిపల్లి-పేరూరు ఎత్తిపోతల పథకం కోసం తెదేపా హయాంలో 53 కిలోమీటర్ల కాలువ తవ్వారు. దీనికి సమీపంలోనే ప్రస్తుతం రిసార్టు నిర్మిస్తున్నారు. కాలువ గట్టుపై ఉన్న మట్టితోపాటు ఏపీఐఐసీ భూముల్లోని మట్టిని టిప్పర్లతో తమ భూమిలోకి తరలించారు. పెన్నా నది నుంచి అక్రమంగా ఇసుకను తీసుకెళ్లారు. దీంతోపాటు ఇటీవల వరదలకు నూతిమడుగు సమీపంలో కల్వర్టు పైపులు కొట్టుకుపోయాయి. వాటిని అక్కడి నుంచి తరలించి రిసార్టు నిర్మిస్తున్న ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

చెరువు నిర్మాణానికి ప్రతిపాదనలు

రిసార్టులో బోటింగ్‌ సౌకర్యం ఉండేలా ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం సమీపంలోని వంక నీటిని మళ్లించి చెరువు నిర్మించాలని అనుకున్నారు. సొంతంగా నిర్మిస్తే రూ.కోట్లలో ఖర్చవుతుందని భావించి ఆ భారం ప్రభుత్వంపై మోపేలా పావులు కదిపినట్లు తెలుస్తోంది. మంత్రి ఉష శ్రీచరణ్‌ సిఫార్సు మేరకు రూ.3.16 కోట్ల అంచనాతో చెరువు నిర్మాణానికి జల వనరులశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని