Tirumala: తిరుమల భద్రత దైవాధీనం!

తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్‌తో చిత్రీకరించినట్లుగా భావిస్తున్న దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. నో ఫ్లై జోన్‌గా ఉన్న తిరుమల గిరులపై విమానాలు వెళ్లడం నిషిద్ధం.

Updated : 22 Jan 2023 08:25 IST

నిబంధనలు అతిక్రమించి  డ్రోన్‌తో ఆలయం చిత్రీకరణ
నిఘా వైఫల్యంపై భక్తుల్లో ఆందోళన

ఈనాడు- తిరుపతి; న్యూస్‌టుడే- తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్‌తో చిత్రీకరించినట్లుగా భావిస్తున్న దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. నో ఫ్లై జోన్‌గా ఉన్న తిరుమల గిరులపై విమానాలు వెళ్లడం నిషిద్ధం. ఇలాంటిచోట డ్రోన్‌ను వినియోగించి శ్రీవారి ఆనంద నిలయం దృశ్యాలను అతి సమీపం నుంచి చిత్రీకరించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. భద్రత సిబ్బంది వైఫల్యంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

సర్వే కోసం..: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సహకారంతో తిరుమలలో బయో గ్యాస్‌ ప్లాంటు ఏర్పాటుకు తితిదే గతేడాది జూన్‌ 14న ఒప్పందం చేసుకుంది. భూగర్భ విద్యుత్తు, యూడీఎస్‌ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు తితిదే ఇంజినీరింగ్‌శాఖ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తిరుమలలో సర్వే బాధ్యతలను హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థకు తితిదే అప్పగించింది. డ్రోన్‌ ద్వారా సర్వే కోసం గతేడాది నవంబరు 8న అనుమతి పొందారు. నవంబరు 10, 11, 12వ తేదీల్లో చిత్రీకరించేందుకు అనుమతించారు. కల్యాణ వేదిక, ఆక్టోపస్‌ నూతన భవనం, శ్రీవారి సేవా సదన్‌ ప్రాంతాల్లోనే సర్వే చేపట్టాలి. అయితే సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న రాంభగీచా నుంచి ఆస్థాన మండపం వద్దకు చేరుకుని అక్కడి నుంచి డ్రోన్‌ను ఆకాశంలోకి పంపి శ్రీవారి ఆలయాన్ని చిత్రీకరించారు. ఆ ప్రాంతాల్లో డ్రోన్‌తో సంచరిస్తున్న వారిని స్థానికులు తమ ఫోన్‌లో వీడియో తీశారు. వారిని స్థానికులు హెచ్చరించిన అంశం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

ముప్పుపై గతంలోనే..: శ్రీవారి ఆలయానికి ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని గతంలోనే కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. గతంలో వైకాపా నేత ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి తన అనుచరులతో అన్నమయ్య నడక మార్గంలో వస్తూ డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించారు. తిరుమల వచ్చిన తర్వాత డ్రోన్‌ను వినియోగించడం వివాదాస్పదమైంది.

అదుపులో ప్రైవేటు సిబ్బంది..: శ్రీవారి ఆలయంపై డ్రోన్‌ను ఎగురవేసిన సంస్థకు చెందిన సిబ్బందిని తితిదే భద్రతాధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. యాంటీ డ్రోన్‌ సాంకేతికత వినియోగాన్ని పరిశీలిస్తామని సీవీఎస్‌వో నరసింహ కిషోర్‌ తెలిపారు.

డ్రోన్‌తో చిత్రీకరణపై కేసు నమోదు

డ్రోన్‌తో చిత్రీకరణ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంపై తితిదే వీజీవో బాలిరెడ్డి ఫిర్యాదు మేరకు తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ సుధాకర్‌ వివరాలు తెలిపారు కిరణ్‌ అనే వ్యక్తి డ్రోన్‌ను వినియోగించి వీడియో చిత్రీకరణ చేసి..గృహశ్రీనివాస, ఐకాన్‌ ఫ్యాక్డ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు. డ్రోన్‌ కెమెరాతో ఆలయ దృశ్యాలు చిత్రీకరించి భద్రతా నిబంధనలు ఉల్లంఘించడంతోపాటు, అసాంఘిక శక్తులకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరించడంపై ఐపీసీ సెక్షన్‌ 447 కింద కేసు నమోదు చేశామన్నారు.  

శ్రీవారి ఆలయాన్ని డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించి, సామాజిక మాధ్యమాల్లో ఉంచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.  

డ్రోన్‌ దృశ్యాల చిత్రీకరణపై తితిదే జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు సూచించారు. శ్రీవారి ఆలయంపై విమానాలు ప్రయాణించకూడదనే నియమం ఆగమ శాస్త్రంలో ఉందని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు