వివేకా హత్య కేసులో నేడు సీబీఐ ముందుకు అవినాష్‌రెడ్డి

మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి శనివారం సీబీఐ విచారణకు హాజరుకానున్నారు.

Updated : 28 Jan 2023 07:06 IST

పులివెందుల నుంచి హైదరాబాద్‌కు పయనం
ఇప్పటికే ఛార్జిషీట్‌లో ఎంపీ గురించి ప్రస్తావించిన కేంద్ర దర్యాప్తు సంస్థ

ఈనాడు డిజిటల్‌, కడప: మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి శనివారం సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావడానికి పులివెందుల నుంచి శుక్రవారం బయలుదేరి వెళ్లారు. సీఆర్పీసీ 160 సెక్షన్‌ కింద అవినాష్‌కు సీబీఐ నోటీసు జారీ చేసింది. 2019 మార్చి 15న వివేకా హత్య జరిగినప్పటి నుంచి.. ప్రతిపక్షాల వేళ్లన్నీ ఎంపీతో పాటు ఆయన తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డి వైపే చూపిస్తున్నాయి. 2020 మార్చి 11న హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టి 248 మంది సాక్షులు, అనుమానితులను విచారించి.. వాంగ్మూలాలను రికార్డు చేసింది. ఆ వాంగ్మూలాలు, సేకరించిన ఆధారాలతో ఇప్పుడు కీలకమైన అవినాష్‌రెడ్డి విచారణకు రంగం సిద్ధమైంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వివేకా కేసు హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు బదిలీ అయినందున విచారణ ముమ్మరం చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థ భావిస్తోంది. దర్యాప్తు అధికారి రాంసింగ్‌ పేరుతో ఈ నెల 24న ఎంపీకి నోటీసులు జారీ అయ్యాయి.

సాక్ష్యాలు తుడిపేస్తున్నా అడ్డుకోలేదని..

వివేకా దారుణ హత్యకు గురికాగా, గుండెపోటుతో చనిపోయారని దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ద్వారా ప్రచారం చేయించినా.. మృతదేహం వద్ద రక్తపు మరకలు, సాక్ష్యాధారాలు చెరిపేస్తున్నా.. పులివెందుల సీఐ శంకరయ్యని శివశంకర్‌రెడ్డి బెరిస్తున్నా.. ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి అడ్డుకోలేదనే ఆరోపణలను అవినాష్‌రెడ్డి ఎదుర్కొంటున్నారు. 2019 ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్‌ అవినాష్‌రెడ్డికి కాకుండా.. షర్మిలకో, విజయమ్మకో లేదంటే  తనకో ఇవ్వాలనేది వివేకా పట్టుదల. ఇది తెలిసే అవినాష్‌రెడ్డి కుటుంబం కుట్రకు పాల్పడి ఉంటుందనే అనుమానాలను సీబీఐ వ్యక్తం చేస్తోంది.

దస్తగిరి కీలక వాంగ్మూలం

వివేకా కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్‌ దస్తగిరి మెజిస్ట్రేట్‌ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, మనోహర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిల పేర్లు ప్రముఖంగా ప్రస్తావించారు. వివేకాను హత్య చేస్తే శివశంకర్‌రెడ్డి రూ. 40 కోట్లు ఇస్తారంటూ ఎర్ర గంగిరెడ్డి తమకు చెప్పారని ఆయన తెలిపారు. ‘ఎవరూ భయపడవద్దని.. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి మనల్ని చూసుకుంటారంటూ’ గంగిరెడ్డి భరోసా ఇచ్చారని కూడా దస్తగిరి వెల్లడించినట్లు సీబీఐ ఛార్జిషీట్‌లో పొందుపరిచింది. అలాగే దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అరెస్టు సందర్భంగా పులివెందుల కోర్టుకు వచ్చిన అవినాష్‌రెడ్డి.. తమ దర్యాప్తు అధికారి రాంసింగ్‌ను బెదిరించినట్లు సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. వివేకా కేసును రెండున్నరేళ్లకు పైగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఇన్నాళ్లకు ఎంపీని విచారణకు పిలిచిన నేపథ్యంలో ఈ కేసు ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని