స్వాతంత్య్రోద్యమంలో తొలి వీరులు ఆదివాసీలే

దేశానికి స్వాతంత్య్రం ఏ కొద్ది మంది పోరాటం వల్లనో రాలేదని, వీరోచితంగా పోరాడిన అనేక మంది గుర్తింపునకు నోచుకోలేదని ప్రముఖ పాత్రికేయుడు, రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్‌ అన్నారు.

Updated : 29 Jan 2023 06:01 IST

సాహితీ వేడుకలో రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్‌

ఈనాడు హైదరాబాద్‌: దేశానికి స్వాతంత్య్రం ఏ కొద్ది మంది పోరాటం వల్లనో రాలేదని, వీరోచితంగా పోరాడిన అనేక మంది గుర్తింపునకు నోచుకోలేదని ప్రముఖ పాత్రికేయుడు, రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్‌ అన్నారు. అటువంటి వీరుల గురించి భవిష్యత్తు తరాలకు చెప్పేందుకే ‘ది లాస్ట్‌ హీరోస్‌- ఫుట్‌ సోల్జర్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫ్రీడం’ పుస్తకాన్ని రాసినట్లు తెలిపారు. 13వ హైదరాబాద్‌ సాహితీ వేడుకలో భాగంగా శనివారం ఉదయం ఈ పుస్తకంపై సైఫాబాద్‌లోని విద్యారణ్య ఉన్నత పాఠశాలలో జరిగిన చర్చాగోష్ఠిలో సాయినాథ్‌ పాల్గొని మాట్లాడారు. ఓ తాజా అధ్యయనం ప్రకారం బ్రిటిష్‌ పాలనలో 160 మిలియన్ల మంది మరణించారని, అలాంటిది బ్రిటిషు రాణి చనిపోతే మన జాతీయ జెండాను దించడం అవమానకరమని అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్ర సమరంలో ఆదివాసీలు మొదట పోరాడారని, ఆ ఫలితాల కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారన్నారు. స్వాతంత్య్రోద్యమకారులను గుర్తించేందుకు పెట్టిన పలు నిబంధనల వల్ల ఎందరో అర్హులకు అన్యాయం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆజాదీ కా అమృతోత్సవ్‌ వెబ్‌సైట్‌లో ఎక్కడా బ్రిటిషు వలసవాదం గురించి లేదన్నారు. చరిత్రను చెరిపేసే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరి సాగించిన గెరిల్లా పోరాటం, రజాకార్లపై పోరాడిన మల్లు స్వరాజ్యం గురించి ఈ సందర్భంగా వివరించారు. హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ నిర్వాహకుల్లో ఒకరైన సునీతారెడ్డి ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ వై.వేణుగోపాల్‌రెడ్డి, కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ మాజీ కార్యదర్శి సుజాతారావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు సహా అధిక సంఖ్యలో సాహితీవేత్తలు, రచయితలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు చర్చాగోష్ఠులు జరిగాయి.

రాజ్యాంగంపై చర్చ అవసరం..

రాజ్యాంగాన్ని లీగల్‌ డాక్యుమెంట్‌గా కాకుండా ఆ స్ఫూర్తిని అర్థం చేసుకోవాలని పౌరహక్కుల నేత కె.జి.కన్నబిరాన్‌ వాదిస్తుండేవారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. సాహితీ వేడుకలో కల్పనా కన్నబిరాన్‌ రచించిన ‘ది స్పీకింగ్‌ కాన్‌స్టిట్యూషన్‌’ పుస్తకంపై జరిగిన చర్చాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. కె.జి.కన్నబిరాన్‌ 2009లో తెలుగులో రాసిన ‘24 గంటలు’ పుస్తకం ఆధారంగా మరికొన్ని వ్యక్తిగత అంశాలు, కోర్టు తీర్పులు, ప్రచురితం కాని విషయాలతో కల్పనా కన్నబిరాన్‌ ఈ పుస్తకం ఆంగ్లంలో రాశారన్నారు. గణతంత్ర దినోత్సవం జరపాలని పాలకులకు చెప్పాల్సి వస్తున్న తరుణంలో రాజ్యాంగం అవసరం ఉందా? అనే ప్రశ్న సహేతుకం, చర్చనీయాంశమన్నారు. రచయిత ఓల్గా సమన్వయకర్తగా వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు