Andhra News: కరిగిపోయిన స్థిరాస్తి కల

రాష్ట్రంలో స్థిరాస్తి రంగం వృద్ధి కలలా కరిగిపోయింది. అమరావతి రాజధాని ప్రకటనతో ఊపందుకున్న స్థిరాస్తి వ్యాపార వృద్ధి.. ప్రభుత్వం మారి రాజధాని పనులు నిలిచిపోవడంతో అర్ధంతరంగా ఆగిపోయింది.

Updated : 30 Jan 2023 08:31 IST

పొరుగు రాష్ట్రం తెలంగాణలో భారీ వృద్ధి
ఏపీలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
రాజధాని నిర్మాణం ఆపేయడంతో మధ్యలోనే నిలిచిపోయిన ప్రాజెక్టులు
పెట్టుబడిదారులు, ప్రవాసాంధ్రుల చూపు పొరుగు రాష్ట్రాలవైపే..
ఈనాడు - అమరావతి

రాష్ట్రంలో స్థిరాస్తి రంగం వృద్ధి కలలా కరిగిపోయింది. అమరావతి రాజధాని ప్రకటనతో ఊపందుకున్న స్థిరాస్తి వ్యాపార వృద్ధి.. ప్రభుత్వం మారి రాజధాని పనులు నిలిచిపోవడంతో అర్ధంతరంగా ఆగిపోయింది. పొరుగు రాష్ట్రం తెలంగాణతో పోల్చితే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ బాగా వెనకబడింది. 2015-16, 2021-22 సంవత్సరాల్లో రిజిస్టరైన డాక్యుమెంట్లు, ప్రభుత్వానికి వచ్చిన ఆదాయపరంగా చూస్తే.. రెండు రాష్ట్రాల మధ్య తేడా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 2015-16తో పోల్చితే 2021-22లో తెలంగాణ రిజిస్ట్రేషన్ల ఆదాయం 228.29 శాతం పెరిగింది. ఏపీలో ఆ వృద్ధి 104.89 శాతమే. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో భూముల మార్కెట్‌ ధరలను 2021 వరకూ పెంచలేదు. 2021 తర్వాతే రెండు సార్లు సవరించారు. ఏపీలో దాదాపు రెండేళ్లకోసారి రిజిస్ట్రేషన్‌ ధరలను పెంచుతూనే ఉన్నారు. దీనివల్లే ఆదాయంలో వృద్ధి కనిపించింది తప్పితే లావాదేవీలు పెరగలేదని స్థిరాస్తి రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో ఉపాధి, ఉద్యోగావకాశాలు గణనీయంగా తగ్గిపోవడం, ఎక్కువ జీతాలొచ్చే ఐటీ వంటి రంగాల్లో హైదరాబాద్‌తో పోల్చితే విజయవాడ, విశాఖ వంటి నగరాలు వెనకబడి ఉండటంతో స్థిరాస్తి రంగంలో వృద్ధి రేటు మందగించింది. ఏపీలో ఓ స్థాయి నిర్మాణదారుల నుంచి భారీ ప్రాజెక్టులు చేపట్టిన పెద్ద పెద్ద సంస్థలవారు హైదరాబాద్‌, బెంగళూరు వంటి నగరాలకు తరలిపోయారు. స్థలాలు, ఇళ్లపై పెట్టుబడి పెడదామనుకునే ప్రవాసాంధ్రులు.. ఏపీ కంటే హైదరాబాద్‌ వంటి ఇతర ప్రాంతాలవైపే మొగ్గు చూపుతున్నారు.

*  2015-16లో తెలంగాణలో 10.62 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.3,786 కోట్ల ఆదాయం వచ్చింది. ఏపీలో 15.12 లక్షల రిజిస్ట్రేషన్లు జరగ్గా రూ.3,585.12 కోట్ల ఆదాయం వచ్చింది.   తెలంగాణలో కంటే ఏపీలో 4.5 లక్షల రిజిస్ట్రేషన్లు ఎక్కువ జరిగినా.. ఆదాయం తెలంగాణకే రూ.200.88 కోట్లు అధికంగా వచ్చింది.

* 2021-22కి వచ్చేసరికి తెలంగాణలో రిజిస్ట్రేషన్లు దాదాపు రెట్టింపయ్యాయి. 20.38 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2015-16తో పోల్చితే తెలంగాణలో రిజిస్ట్రేషన్లు 91.91 శాతం, ఆదాయం 228.29 శాతం పెరిగాయి. 2015-16లో రెండు రాష్ట్రాల్లో జరిగిన రిజిస్ట్రేషన్ల దామాషా ప్రకారం చూస్తే 2021-22లో ఏపీలో 30 లక్షలకుపైగా రిజిస్ట్రేషన్లు జరగాలి. కానీ 25.74 లక్షల రిజిస్ట్రేషన్లే జరిగాయి. 2015-16తో పోల్చితే ఏపీలో రిజిస్ట్రేషన్లు 70.23 శాతం, ఆదాయం 104.89 శాతం పెరిగాయి.

* 2015-16లో తెలంగాణ ప్రభుత్వానికి రూ.3,786 కోట్ల ఆదాయం రాగా, 2021-22 నాటికి అది రూ.12,429 కోట్లకు చేరింది. 2015-16 లెక్కలతో పోల్చి చూస్తే 2021-22లో ఏపీకి దాదాపు రూ.12వేల కోట్ల ఆదాయం రావాలి. కానీ రూ.7,345.88 కోట్లే వచ్చింది.

* 2015-16లో రెండు రాష్ట్రాల మధ్య ఆదాయంలో వ్యత్యాసం 5.60 శాతం ఉంటే అది 2021-22కి 69.21 శాతానికి పెరిగింది.

* 2018-19కి, 2021-22కి మధ్య.. తెలంగాణలో రిజిస్ట్రేషన్ల ఆదాయం 87.98 శాతం పెరిగితే, ఏపీ ఆదాయంలో వృద్ధి 55.46 శాతమే నమోదయింది.

* తెలంగాణలో రిజిస్ట్రేషన్ల సంఖ్య 2015-16 నుంచి 2019-20 వరకు స్వల్పంగా పెరుగుతూ వచ్చింది. 2019-20లో 16.58 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగి రూ.7,061 కోట్ల ఆదాయం వచ్చింది. కొవిడ్‌ ప్రభావంతో 2020-21లో రిజిస్ట్రేషన్ల సంఖ్య 14.96 లక్షలకు తగ్గిపోయి, ఆదాయం రూ.5,260 కోట్లకు పడిపోయింది. 2021-22లో రిజిస్ట్రేషన్ల సంఖ్య, ఆదాయం అనూహ్యంగా పెరిగాయి. 20.38 లక్షలకుపైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. రూ.12,429 కోట్ల ఆదాయం వచ్చింది.

* ఆంధ్రప్రదేశ్‌లో 2015-16లో 15.12 లక్షలున్న రిజిస్ట్రేషన్ల సంఖ్య 2016-17లో 13.71 లక్షలకు తగ్గింది. మళ్లీ క్రమంగా పెరుగుతూ 2020-21కి 17.20 లక్షలకు చేరింది. 2021-22లో ఒక్కసారి 25.74 లక్షలకు పెరిగింది. 2015-16లో రూ.3,585.12 కోట్లున్న ఆదాయం.. 2016-17లో కొంత తగ్గి, ఆ తర్వాత  క్రమంగా పెరుగుతూ వెళ్లింది. 2020-21లో రూ.5,399.41 కోట్ల ఆదాయం రాగా 2021-22లో రూ.7,345.38 కోట్లకు పెరిగింది.

* 2020-21లో తెలంగాణకు వచ్చిన ఆదాయం రూ.5,260 కోట్లయితే, ఏపీ ఆదాయం రూ.5,399.41 కోట్లు. 2015-16లో తెలంగాణ కంటే ఆదాయంలో రూ.200 కోట్లు వెనకబడిన ఆంధ్రప్రదేశ్‌.. 2020-21లో సుమారు రూ.140 కోట్ల ఆదాయం అధికంగా సాధించింది. కానీ 2021-22కి వచ్చేసరికి తెలంగాణ ఆదాయం రూ.12,429 కోట్లకు చేరగా, ఏపీ రాబడి రూ.7,345.38 కోట్లే. వ్యత్యాసం సుమారు రూ.5,084 కోట్లు. 2020-21తో పోల్చితే 2021-22లో తెలంగాణ ఆదాయంలో 136.29 శాతం వృద్ధి నమోదవగా, ఏపీలో 36.04 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది.

* ప్రాప్‌టైగర్‌ అనే సంస్థ దేశంలోని 8 అగ్రశ్రేణి నగరాల్లో స్థిరాస్తి రంగం పురోభివృద్ధిపై చేసిన అధ్యయనం ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికం కంటే రెండో త్రైమాసికంలో ఫ్లాట్ల విక్రయాల్లో అత్యధిక వృద్ధి నమోదైన నగరాల్లో అహ్మదాబాద్‌ తర్వాత హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్‌లో 21 శాతం వృద్ధి నమోదైంది.

ని‘బంధనాల’తో మరింత ప్రతికూలత

తాజాగా 200 అడుగుల రహదారులకు అటూ ఇటూ 250 మీటర్ల దూరం వరకు నిర్మించే భవనాలకు చదరపు అడుగుకు రూ.75 చొప్పున అదనంగా ఇంపాక్టు ఫీజు కట్టాలంటూ ప్రభుత్వం మరో నిబంధన తెచ్చింది. ఇది కొత్త నిర్మాణాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

* వీఎంఆర్‌డీఏ ఇది వరకు ఏటా సగటున 80 వరకు లేఅవుట్లకు అనుమతులిచ్చేది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు వరకు 8 లేవుట్‌లకే అనుమతులిచ్చింది. లేఅవుట్ల సంఖ్య ఏ స్థాయిలో పడిపోయిందో చెప్పడానికి ఇదో నిదర్శనం మాత్రమే.


రాజధాని నిర్మాణం కొనసాగి ఉంటే!

రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనుకున్నవారికి అమరావతి చుక్కానిలా కనిపించింది. అనతికాలంలోనే అమరావతికి అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్‌ ఇమేజ్‌ రావడంతో చుట్టుపక్కలున్న విజయవాడ, గుంటూరు, తాడేపల్లి, మంగళగిరి వంటి ప్రాంతాలకూ గిరాకీ పెరిగింది. ప్రముఖ నిర్మాణ సంస్థలు భారీ ప్రాజెక్టులు చేపట్టాయి. ఇటు విజయవాడలోనూ, అటు గుంటూరులోనూ నిర్మాణ రంగం ఊపందుకుంది. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేసేందుకు అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, మెడ్‌టెక్‌ జోన్‌ ఏర్పాటు, లులు, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, అదానీ డేటా సెంటర్‌ వంటి ప్రాజెక్టులకు స్థలాలు కేటాయించడంతో విశాఖలోనూ నిర్మాణ రంగం వేగం పుంజుకుంది. వైకాపా అధికారంలోకి వచ్చాక అమరావతి నిర్మాణాన్ని ఆపేయడంతో.. విజయవాడ- గుంటూరు మధ్య జాతీయ రహదారి పక్కన చేపట్టిన భారీ ప్రాజెక్టుల్లో చాలావరకు ఆగిపోయాయి. ఎల్‌ఈపీఎల్‌, జయభేరి, అపర్ణ వంటి సంస్థలు మూడేళ్ల క్రితమే నిర్మాణాలు పూర్తి చేసినా వాటిలో ఫ్లాట్ల విక్రయాలు పూర్తవలేదు. మరికొన్ని సంస్థలు ప్రాజెక్టుల్ని వదిలేసి వెళ్లిపోయాయి. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య, ఆదాయం ఆశించినంత పెరగకపోవడానికి ఇదో ప్రధాన కారణం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని