పరిహారం ఒకటే.. బటన్‌ నొక్కుడు రెండుసార్లు

ఉచిత పంటల బీమా కింద రైతులకు ముఖ్యమంత్రి జగన్‌ గతేడాది జూన్‌లో పరిహారం విడుదల చేశారు. అయినా కొందరు రైతులకు సొమ్ము జమ కాలేదు.

Updated : 30 Jan 2023 09:29 IST

అయినా రైతులకు అందని సొమ్ము 

ఈనాడు, అమరావతి: ఉచిత పంటల బీమా కింద రైతులకు ముఖ్యమంత్రి జగన్‌ గతేడాది జూన్‌లో పరిహారం విడుదల చేశారు. అయినా కొందరు రైతులకు సొమ్ము జమ కాలేదు. ఆరు నెలల తర్వాత డిసెంబరులో సీఎం మరోసారి బటన్‌ నొక్కారు. నెల గడిచినా రైతుల ఖాతాల్లోకి డబ్బు రాలేదు. రూ.187 కోట్ల మొత్తానికి ఇన్నిసార్లు బటన్‌ నొక్కాలా అనే ప్రశ్న రైతుల నుంచి వ్యక్తమవుతోంది. వ్యవసాయాధికారుల్ని సంప్రదించినా త్వరలో వస్తాయనే సమాధానం తప్పితే.. పరిహారం జమ చేయడం లేదు. 2021 ఖరీఫ్‌ కాలంలో పంటలు దెబ్బతిన్న 15.61 లక్షల మంది రైతులకు ఉచిత పంటల బీమా పరిహారంగా రూ.2,977.82 కోట్లను 2022 జూన్‌ 13న శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో ముఖ్యమంత్రి జగన్‌ బటన్‌ నొక్కి విడుదల చేశారు. అయితే 28వేల మంది రైతులకు సొమ్ము పడలేదు. వారికి సంబంధించి మొత్తం రూ.187 కోట్లను జమ చేయకుండా నిలిపేశారు. ఈ ప్రభుత్వం ఎవరికీ ఎగ్గొట్టాలని చూడదని, ఇంకా ఎవరైనా అర్హులుంటే నమోదు చేసుకుంటే వారికీ పరిహారం ఇస్తామని సీఎం సభలో ప్రకటించారు. దీంతో పంటలు నష్టపోయినా పరిహారం అందని లక్షల మంది రైతులు ఆర్బీకేల్లో అర్జీలిచ్చారు. ఎట్టకేలకు డిసెంబరు 27న సీఎం జగన్‌ మరోసారి బటన్‌ నొక్కారు. 28వేల మంది రైతులకు రూ.187 కోట్లు వేస్తున్నామని చెప్పారు. తర్వాత నెల దాటినా ఇప్పటికీ చాలా మంది రైతుల ఖాతాల్లో సొమ్ము పడలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని