Andhra News: సీఎం క్యాంపు కార్యాలయంలోని ‘పవర్‌ఫుల్‌ వ్యక్తి’సహాయకుడిపై సీబీ‘ఐ’

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉండే ఓ ‘పవర్‌ఫుల్‌ వ్యక్తి’కి సహాయకుడిగా వ్యవహరిస్తున్న నవీన్‌కు సీబీఐ సోమవారం నోటీసులిచ్చింది. దీంతోపాటు ‘అత్యంత ముఖ్య నేత’కు సన్నిహితుడైన మరొకరికీ  నోటీసులు జారీ చేసింది.

Updated : 31 Jan 2023 09:48 IST

అతని పేరిట ఉన్న నంబర్‌కు అవినాష్‌రెడ్డి నుంచి ఎక్కువగా కాల్స్‌
దీంతో విచారణకు రావాలంటూ నోటీసులు
‘అత్యంత ముఖ్య నేత’ సన్నిహితుడికి కూడా..
పులివెందులలోని సీఎం ఓఎస్డీ కార్యాలయానికి సీబీఐ అధికారులు
వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు

ఈనాడు- అమరావతి, ఈనాడు డిజిటల్‌- కడప, న్యూస్‌టుడే- పులివెందుల: మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉండే ఓ ‘పవర్‌ఫుల్‌ వ్యక్తి’కి సహాయకుడిగా వ్యవహరిస్తున్న నవీన్‌కు సీబీఐ సోమవారం నోటీసులిచ్చింది. దీంతోపాటు ‘అత్యంత ముఖ్య నేత’కు సన్నిహితుడైన మరొకరికీ  నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ నెల 28న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని నాలుగున్నర గంటలపాటు విచారించిన సీబీఐ ప్రధానంగా ఆయన కాల్‌డేటాపై ఆరా తీసింది. నవీన్‌ అనే వ్యక్తి పేరిట ఉన్న మొబైల్‌ నంబర్‌కు అవినాష్‌ ఎక్కువగా కాల్‌ చేసి మాట్లాడినట్లు దర్యాప్తులో గుర్తించింది. ఈ నేపథ్యంలో నవీన్‌ గురించి ఆరా తీసింది. తాడేపల్లి ప్యాలెస్‌లో ఓ ‘పవర్‌ఫుల్‌’ వ్యక్తిని సన్నిహితులు, ముఖ్యులు ఎవరైనా సంప్రదించాలన్నా, ఫోన్‌లో మాట్లాడాలన్నా నవీన్‌ పేరిట ఉన్న నంబర్‌కే కాల్‌ చేయాల్సి ఉంటుందని, ఆయన ఆ సమాచారాన్ని ‘పవర్‌ఫుల్‌’ వ్యక్తికి తెలియజేసి మాట్లాడే ఏర్పాటు చేస్తారని సీబీఐ గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అవినాష్‌రెడ్డి ఎక్కువగా ఆ నంబర్‌కు కాల్స్‌ చేసినట్లు అంచనాకు వచ్చింది. వీటిపై సమగ్రంగా ప్రశ్నించేందుకు నవీన్‌కు సీబీఐ నోటీసులిచ్చినట్లు సమాచారం. మరోవైపు వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు సోమవారం వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందులలోని సీఎం జగన్‌ ఓఎస్డీ కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయ అధికారులను కలిసి కె.హరిప్రసాద్‌తో పాటు ఇతరుల పేర్లు అడుగుతూ.. వారు ఎక్కడుంటారని ఆరా తీశారు. అనంతరం పాత బస్టాండు మీదుగా పూల అంగళ్లు, వివేకానందరెడ్డి ఇంటి వరకు వెళ్లి పరిశీలించారు. అవినాష్‌రెడ్డిని అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని సీబీఐ చెప్పిన నేపథ్యంలో అధికారులు పులివెందులకు వచ్చి పలు అంశాలపై ఆరా తీయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసులో నిందితులు ఎర్రగంగిరెడ్డి (బెయిల్‌పై ఉన్నారు), అప్రూవర్‌గా మారిన డ్రైవర్‌ దస్తగిరి, రిమాండు ఖైదీలుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్‌లను ఫిబ్రవరి 10న విచారణకు హైదరాబాద్‌కు రావాలని సీబీఐ నోటీసులిచ్చింది.  వీరి విచారణకు ముందు మరింతమందికి నోటీసులిచ్చి దర్యాప్తుకు పిలిచే అవకాశాలున్నట్లు సమాచారం. సీబీఐ కదలికలు తెలుసుకున్న పలువురు నాయకులు పులివెందుల నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని