శ్రీరామనగరంలో సమతాకుంభ్‌

సమతామూర్తి స్ఫూర్తికేంద్రం శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల తొలి వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ శివారులోని శ్రీరామనగరంలో ఫిబ్రవరి 2 నుంచి 12 వరకూ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి తెలిపారు.

Updated : 31 Jan 2023 05:50 IST

శ్రీరామానుజాచార్య-108  దివ్యదేశాల బ్రహ్మోత్సవాలు
ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు..
అందరూ ఆహ్వానితులే..
చినజీయర్‌ స్వామి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, శంషాబాద్‌: సమతామూర్తి స్ఫూర్తికేంద్రం శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల తొలి వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ శివారులోని శ్రీరామనగరంలో ఫిబ్రవరి 2 నుంచి 12 వరకూ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి తెలిపారు.  శ్రీరామనగరంలోని తన ఆశ్రమంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ‘సమతాకుంభ్‌-2023’గా నామకరణం చేశామని, శ్రీరామానుజాచార్యుల సమతాస్ఫూర్తి సందేశాన్ని ప్రజలందరికీ వివరించాలన్న లక్ష్యంతో లక్షల మందిని ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. ఇకపై ఏటా సమాతాకుంభ్‌ పేరుతో బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలు మతపరమైనవి కావని, ప్రజలంతా ఆహ్వానితులేనని తెలిపారు. రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపలేదని వివరించారు.

రాజకీయ పార్టీలు, నాయకుల మధ్య  అంతరాలు పెరగడం ప్రజలకు క్షేమం కాదు

సమాజ శ్రేయస్సుకు కృషి చేస్తున్న రాజకీయ పార్టీలు, నాయకుల మధ్య అంతరాలు పెరగడం ప్రజలకు క్షేమం కాదని చినజీయర్‌ స్వామి అన్నారు. ఒకరినొకరు దూషించుకోవడం మంచిది కాదని, వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యాఖ్యానించడం సరికాదని, ఇది ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపుతుందని అన్నారు.

పద్మభూషణ్‌ ఇస్తామన్నారు.. సరేనన్నా..

‘‘కొద్దిరోజుల క్రితం దిల్లీ నుంచి ఫోన్‌ వచ్చింది. మీకు పద్మభూషణ్‌ పురస్కారం ప్రకటించాలనుకుంటున్నామని.. మీకేమైనా అభ్యంతరమా అంటూ అడిగారు. సరే అన్నాను. నాకేం అభ్యంతరం లేదని చెప్పాను. పద్మభూషణ్‌ కావాలంటూ నేను ఎవరినీ అభ్యర్థించలేదు’’ అని చినజీయర్‌ స్వామి తెలిపారు. ఏడాది వ్యవధిలో 2 కోట్ల మంది సమతామూర్తిని సందర్శించుకున్నారని, రోజూ సగటున 5 వేల మంది సందర్శకులు వస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో సముద్రాల రంగ రామానుజాచార్యులు, దేవనాధ జీయర్‌స్వామి, అహోబిల జీయర్‌ స్వామి, వికాస తరంగణి అధ్యక్షుడు, విశ్రాంత ఐఏఎస్‌ జగదీశ్వర్‌లు పాల్గొన్నారు.


బ్రహ్మోత్సవాల ప్రత్యేకతలు..

బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏ పుణ్యక్షేత్రానికి, దేవాలయానికైనా భక్తులంతా దేవుని వద్దకు వెళ్తారని, ఇందుకు భిన్నంగా శ్రీరామనగరంలోని 108 దివ్యదేశాల ఆలయాల్లో కొలువైన ఉత్సవమూర్తులను భక్తుల వద్దకే తీసుకురానున్నట్లు చినజీయర్‌ స్వామి తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ప్రత్యేకమేనని, రామానుజ నూత్తందాది, శాంతి కల్యాణమహోత్సవం, తెప్పోత్సవం, లక్షమందితో గీతా పారాయణం ప్రధానమైనవని వెల్లడించారు.

* ఫిబ్రవరి 5న 108 దివ్యక్షేత్రాల్లో కొలువైన 108 దేవుళ్లకు సాయంత్రం 5 గంటల నుంచి శాంతి కల్యాణ మహోత్సవం. దేశంలో తొలిసారిగా 18 మంది గరుత్మంతులతో గరుడ వాహనసేవలు.

* 8న క్షీరసాగర శయనుడికి 18 రూపాల్లో సాయంత్రం 4.30 నుంచి తెప్పోత్సవం. మధ్యాహ్నం 1.30 గంటలకు భగవద్గీతలోని శ్లోకాలపై 10 వేల మంది విద్యార్థులకు ‘సూపర్‌ మెమొరీ’ పరీక్ష.

* 11న లక్ష మంది భక్తులు, విద్యార్థులతో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి విశ్వశాంతి విరాట్‌ గీతా పారాయణం. ఉదయం రథోత్సవం, పుష్కరిణిలో చక్రస్నానం.

* 4న ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం సందర్భంగా వికాస తరంగిణి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 250 మంది వైద్యనిపుణులతో మహిళలకు ప్రత్యేకంగా క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు