ప్రభుత్వ భూమిలో దర్జాగా లేఅవుట్‌

అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ప్రభుత్వ భూమిలోనే లేఅవుట్‌ వేసేశారు. యంత్రాల సహాయంతో భూమిని చదును చేసి ప్లాట్లుగా విభజించి అమ్మకాలు చేపట్టారు.

Published : 31 Jan 2023 05:05 IST

అక్రమంగా అమ్మకాలు
అనకాపల్లి జిల్లా వల్లూరులో వైకాపా నేతల భూదందా
తమకు మంత్రి అమర్‌నాథ్‌ అండదండలు ఉన్నాయని బెదిరింపులు

ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి - లక్ష్మీదేవిపేట, న్యూస్‌టుడే: అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ప్రభుత్వ భూమిలోనే లేఅవుట్‌ వేసేశారు. యంత్రాల సహాయంతో భూమిని చదును చేసి ప్లాట్లుగా విభజించి అమ్మకాలు చేపట్టారు. డిమాండునుబట్టి సెంటుకు రూ.4 లక్షల నుంచి రూ.6లక్షల వరకూ వసూలు చేస్తున్నారు. ఈ తంతు బహిరంగంగానే జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా భూదందా కొనసాగుతోంది. ఎవరైనా గ్రామస్థులు ప్రశ్నిస్తే మంత్రి అమర్‌నాథ్‌, మండల స్థాయి నేత అండదండలున్నాయని, ఎవరూ ఏమీ చేయలేరని ఎదురు తిరుగుతున్నారు. మంత్రి తమకు అనుకూలంగా ఇచ్చిన లెటర్‌ ఉందని చెబుతున్నట్లు తెలిసింది. అనకాపల్లి జిల్లా వల్లూరు గ్రామంలోని సర్వే నంబరు 159లో రూ.కోట్ల విలువైన రెండెకరాల ప్రభుత్వ భూమి ఉంది. తాజాగా అనకాపల్లి జిల్లాగా ఏర్పడటం, మరోవైపు ఈ గ్రామం జీవీఎంసీ పరిధిలో ఉండటంతో ఇక్కడి భూములకు డిమాండ్‌ పెరిగింది. దీంతో గ్రామానికి చెందిన కొంత మంది వైకాపా నాయకులు ముఠాగా ఏర్పడి భూదందాకు తెరతీశారు.

గతంలో 60 మందికి పట్టాల పంపిణీ

1993లో 60 మంది రిక్షా కార్మికులకు ఈ సర్వే నంబరులో ఒక్కొక్కరికి 3 సెంట్ల చొప్పున స్థలాలిచ్చారు. అయితే అనువుగా లేకపోవడంతో ఎవరూ ఇళ్లు నిర్మించుకోవడానికి ముందుకు రాలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టా ఇచ్చిన 6 నెలల్లో నిర్మాణం చేపట్టకపోతే మళ్లీ ఆ స్థలం రెవెన్యూ ఆధీనంలోకి వెళ్లిపోతుంది. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల క్రితం కొంతమంది అక్రమంగా చొరబడి నిర్మాణ పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు నిర్మాణాలను కూల్చివేసి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఇటీవల గ్రామానికి చెందిన కొంతమంది వైకాపా నాయకులు రెవెన్యూ హెచ్చరిక బోర్డు పీకేసి యంత్రాల సహాయంతో దున్నేశారు. లేఅవుట్‌ వేసి దర్జాగా అమ్మకాలు చేపడుతున్నారు. గతంలో పట్టాలు పొందినవారిలో కొంత మందిని బెదిరించి మరీ పత్రాలు లాగేసుకున్నట్లు సమాచారం.


పరిశీలించి చర్యలు తీసుకుంటాం

వల్లూరులో ప్రభుత్వ భూమి ఆక్రమణపై పరిశీలించి చర్యలు తీసుకుంటాం. తహసీల్దార్‌ను పంపించి వివరాలను సేకరిస్తాం. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే  కేసులు నమోదు చేస్తాం. నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తాం.

చిన్నికృష్ణ, ఆర్‌డీఓ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని