ఆర్టీసీ నుంచి మరింత పిండేద్దాం!

ఆర్టీసీ రాబడి నుంచి మరింత సొమ్ము తీసుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నెలకు 25 శాతం రాబడుతున్న సర్కారు.. ఇకపై రోజువారీ ఆదాయంలో ఖర్చులు పోనూ, మిగిలినదంతా తీసుకునేందుకు సిద్ధమవుతోంది.

Updated : 31 Jan 2023 08:14 IST

రాబడిలో నెలకు 25 శాతం తీసుకుంటున్న ప్రభుత్వం
ఇకపై రోజువారీగా తీసుకునేందుకు సన్నాహాలు
ఖర్చులు పోనూ మిగులంతా సర్కారు ఖజానాకే

ఆర్టీసీ రాబడి నుంచి మరింత సొమ్ము తీసుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నెలకు 25 శాతం రాబడుతున్న సర్కారు.. ఇకపై రోజువారీ ఆదాయంలో ఖర్చులు పోనూ, మిగిలినదంతా తీసుకునేందుకు సిద్ధమవుతోంది. దీనివల్ల నెలకు అదనంగా మరో రూ.50 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాలోకి చేరిపోతుంది. ఆర్టీసీ ఉద్యోగులు ప్రజా రవాణాశాఖ (పీటీడీ)లో విలీనమయ్యాక వారి జీతాలను ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఆర్టీసీకి జీతాల భారం లేకపోవడంతో.. ఆ సొమ్ముతో బ్యాంకు రుణాల చెల్లింపులు, ఉద్యోగుల పాత బకాయిలను ఒకొక్కటిగా తీర్చుకుంటూ వస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వం కన్ను ఆర్టీసీ రాబడిపై పడింది. జీతాలు చెల్లిస్తున్నందున.. సంస్థ నుంచి కొంత మొత్తం తీసుకునేందుకు వీలైన అంశాలను పరిశీలించింది. మొదట ఆర్టీసీని లీజుకు తీసుకునేలా, రాబడిలో ఖర్చులు పోనూ మిగిలినదంతా ప్రభుత్వానికి దక్కేలా.. అధికారుల కమిటీ నివేదిక రూపొందించింది. ముందుగా రాబడి నుంచి నెలకు 25 శాతం తీసుకునే ప్రక్రియను ఆరంభించారు. నెలకు రాబడి సగటున రూ. 480-500 కోట్ల వరకు ఉండగా.. అందులో రూ.120-125 కోట్లు ప్రతినెలా ప్రభుత్వానికి వెళ్తోంది.

మరో రూ.50 కోట్ల వరకు రాబట్టేలా..

తాజాగా మరింత ఎక్కువ మొత్తం తీసుకోవడానికి వీలుగా.. నెలవారీగా కాకుండా, ఆర్టీసీకి నిత్యం వచ్చే రాబడిలో వ్యయాలు మినహాయించుకొని మిగిలినదంతా జిల్లాలవారీగా ప్రభుత్వ ఖజానాకు జమచేయాలని ప్రతిపాదిస్తోంది. సాధారణంగా ఆర్టీసీ రాబడిలో డీజిల్‌కు 50 శాతం, విడిభాగాలు, నిర్వహణ వ్యయాల కింద 15 శాతం ఖర్చవుతుంది. మిగిలిన 35 శాతంలో 25 శాతం ప్రభుత్వం తీసుకుంటోంది. ఇంకా 10 శాతం ఉంటుంది. దానిని సంస్థ ఇతర అవసరాలకు వినియోగించేందుకు అవకాశం ఉంటోంది. ఇపుడు ఈ మొత్తంపైనా ప్రభుత్వం కన్నేసింది. ఖర్చులన్నీ పోనూ నిత్యం మిగిలేదంతా తీసుకోవడం ద్వారా మొత్తంగా నెలకు సంస్థ రాబడిలో 35 శాతం వరకు సర్కారుకు వెళ్తుంది. అంటే ఇపుడు నెలకు రూ.125 కోట్లు సర్కారుకు చేరుతుండగా, కొత్త ప్రతిపాదనతో మరో రూ.50 కోట్లు ఆర్టీసీ వదులుకోవాల్సి ఉంటుంది. దీనిని ఒకటి, రెండు నెలల్లో అమలు చేసేందుకు చూస్తున్నట్లు సమాచారం.

కొత్త బస్సుల కొనుగోళ్లు ప్రశ్నార్థకమే?

ఆర్టీసీ కాలం చెల్లిన బస్సుల స్థానంలో వెంటనే 617 కొత్త బస్సులు తీసుకోవాలని, దీనికి రూ.250 కోట్ల వరకు వ్యయమవుతుందని ప్రతిపాదించింది. రాబడిలో 25 శాతం ప్రభుత్వానికి ఇవ్వగా, మిగిలే మొత్తాన్ని బస్సుల కొనుగోలుకి వినియోగించవచ్చని అధికారులు భావించారు. ఇపుడు మిగులు మొత్తమంతా సర్కారు తీసుకుంటే కొత్త బస్సుల కొనుగోళ్లు ప్రశ్నార్థకమవుతుందని ఆర్టీసీ వర్గాలు పేర్కొంటున్నాయి.

 ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు