Polavaram: పోలవరానికి దిగులు..

రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు జగన్‌ ప్రభుత్వం కేంద్రం నుంచి ఎలాంటి నిధులూ సాధించలేకపోతోంది. జాతీయ హోదా దక్కినా నిధులు చిక్కడం లేదు.

Updated : 02 Feb 2023 10:22 IST

కేంద్ర బడ్జెట్‌లో రిక్తహస్తం
నిధులు సాధించలేకపోతున్న జగన్‌ సర్కార్‌
ఇలాగైతే 50 ఏళ్లకైనా పూర్తయ్యేనా?
కర్ణాటకలోని అప్పర్‌ భద్రకు రూ. 5,300 కోట్లు

ఈనాడు-అమరావతి: రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు జగన్‌ ప్రభుత్వం కేంద్రం నుంచి ఎలాంటి నిధులూ సాధించలేకపోతోంది. జాతీయ హోదా దక్కినా నిధులు చిక్కడం లేదు. అదే సమయంలో కర్ణాటకలోని అప్పర్‌ భద్రకు జాతీయ హోదా ఇవ్వడంతో పాటు ఈ బడ్జెట్‌లో ఏకంగా రూ. 5,300 కోట్లు కేటాయించడం గమనార్హం. పైగా ఆ ప్రాజెక్టు నిర్మాణం వల్ల దిగువ రాష్ట్రమైన ఆంధప్రదేశ్‌ నష్టపోతుంది. ఒకవైపు నష్టం కలిగించే ప్రాజెక్టును నిలువరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోంది. మరోవైపు పోలవరానికీ నిధులూ సాధించలేకపోతోంది. కేంద్ర బడ్జెట్‌లో పోలవరం ఊసే ఎత్తలేదు. అప్పర్‌ భద్రకు నిధుల గురించి ఆర్థికమంత్రి ప్రస్తావించారు. యూపీ, ఎంపీల ఉమ్మడి ప్రాజెక్టు కెన్‌బెత్వాకు రూ. 3,500 కోట్ల కేటాయించారు. ‘రాష్ట్రంలో అన్ని ఎంపీ స్థానాల్లో గెలిపించండి ప్రత్యేక హోదాతో సహా సర్వం సాధిస్తామని’ పదేపదే చెప్పిన జగన్‌ ఆఖరికి రాష్ట్ర విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా పేర్కొన్న పోలవరానికి కనీస స్థాయిలో కూడా నిధులు తీసుకురాలేకపోతుండడం విశేషం.

కావలసింది రూ.25 వేల కోట్లు.. ఇచ్చింది రూ. 478 కోట్లు

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఇంకా రూ. 25,000 కోట్లకు పైగా అవసరం. అలాంటిది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఇచ్చింది రూ. 478 కోట్లు మాత్రమే. దిల్లీ వెళ్లిన ప్రతిసారీ సీఎం జగన్‌ పోలవరం నిధులపై మాట్లాడినట్లు ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు. మరోవైపు ఇంతవరకు రాష్ట్రం వెచ్చించిన నిధుల్లో రూ. 2,873 కోట్లు కేంద్రం రీయింబర్స్‌ చేయాలి. వాటి విషయం పక్కన పెడితే తాత్కాలికంగా రూ. 10,000 కోట్లు కావాలని అడుగుతున్నా అదీ దిక్కులేదు. కేంద్రం నియమించిన కమిటీ రూ. 5,306 కోట్లకే సిఫార్సు చేసినా రీయింబర్స్‌ నిధులకూ దిక్కులేదు.. తాత్కాలిక నిధులకూ అడ్రస్‌ లేదు.

పోలవరం ప్రాజెక్టుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన నిధులు, అవసరమైన నిధులతో పోలిస్తే ఈ ప్రాజెక్టును పూర్తి కావడానికి మరో 50 ఏళ్లు పడుతుంది. ఆలస్యం అయ్యే కొద్దీ పెరిగిపోయే అంచనా వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే ఈ పరిస్థితి. ఇక వాస్తవ దృక్పథంతో ఆలోచిస్తే పోలవరం పూర్తి చేయడం సాధ్యమేనా అనే ప్రశ్న వినిపిస్తోంది.


నీళ్లు లేని ప్రాజెక్టుకు ఇన్ని కోట్లా?

పైగా జాతీయ హోదా కూడానా?

గువ రాష్ట్రం కర్ణాటక తలపెట్టిన అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు స్పష్టమైన నీటి కేటాయింపులు లేకున్నా జలసంఘం అనుమతులూ, కేంద్రం జాతీయ హోదా ఇవ్వడంతో పాటు కేంద్ర బడ్జెట్‌లో ఏకంగా రూ.5,300 కోట్ల నిధులూ కేటాయించేయడం ఆందోళన కలిగిస్తోంది. దీని వల్ల రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాలు, కరవు ప్రాంతాలకు భవిష్యత్తులో నీరందక కరవు ఏర్పడే ప్రమాదమూ ఉంది. కృష్ణా ట్రైబ్యునల్‌ కేటాయింపులు లేకున్నా.. కర్ణాటక రకరకాలుగా నీటి లభ్యతను చూపి ప్రాజెక్టుకు అన్నీ సాధించుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌ దీనిపై కేంద్ర జలసంఘానికి, కేంద్ర జల్‌శక్తి శాఖకు అభ్యంతరాలు తెలియజేస్తున్నా రాజకీయంగా గట్టి ప్రతిఘటన ప్రదర్శించడం లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు దీనిపై కనీసం పల్లెత్తు మాట అనడం లేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్‌ ప్రధాని నరేంద్ర మోదీతో తనకు అలౌకిక బంధం ఉందని బహిరంగంగా ప్రకటించారు. అయితే ఆ బంధాలేవీ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడటం లేదనేందుకు రాష్ట్రానికి వాటిల్లుతున్న ఇలాంటి నష్టాలే సాక్ష్యం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని