సంక్షిప్త వార్తలు (4)

జిల్లా, డివిజన్‌, మండల స్థాయిలోని అన్ని పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఈ స్థాయి పోస్టుల్లో ఎక్కడా ఇన్‌ఛార్జులను నియమించొద్దని సూచించింది.

Updated : 02 Feb 2023 05:31 IST

ఆ పోస్టులు ఖాళీగా ఉంచొద్దు: సీఎంఓ

ఈనాడు, అమరావతి: జిల్లా, డివిజన్‌, మండల స్థాయిలోని అన్ని పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఈ స్థాయి పోస్టుల్లో ఎక్కడా ఇన్‌ఛార్జులను నియమించొద్దని సూచించింది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. కోర్టు కేసులకు లోబడి అవసరమైతే అడహాక్‌ పదోన్నతులు కల్పించొచ్చని తెలిపింది.


9 నుంచి 19 వరకు విజయవాడ పుస్తక మహోత్సవం

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: విజయవాడ పుస్తక మహోత్సవం ఈ నెల 9 నుంచి 19 వరకు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్నట్లు పుస్తక మహోత్సవ కమిటీ సమన్వయకర్త విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది దాదాపు 200 స్టాల్స్‌ ఏర్పాటుకు దరఖాస్తులు వచ్చాయని బుధవారం ఆయన తెలిపారు. 9వ తేదీన గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఫిబ్రవరి 13వ తేదీ సాయంత్రం పుస్తకప్రియుల పాదయాత్ర ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది రాచమల్లు రామచంద్రారెడ్డి, ముదివర్తి కొండమాచార్య మూర్తి, బెల్లంకొండ రామదాసు, అవసరాల సూర్యారావు శత జయంతి సభలు నిర్వహిస్తామని వివరించారు. కార్యక్రమంలో పుస్తక మహోత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు బెల్లపు బాబ్జి, అధ్యక్షుడు మనోహర్‌నాయుడు, కార్యదర్శి కె.లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.


బీమా కంపెనీకి వినియోగదారుల కమిషన్‌ ఝలక్‌

రైతులకు రూ.15.72 కోట్ల పరిహారం అందజేయాలని తీర్పు

మసీదుసెంటర్‌(కాకినాడ), న్యూస్‌టుడే: కాకినాడ జిల్లాలో తుపాను కారణంగా పంట నష్టపోయిన 14,153 మంది రైతులకు రూ.15.72 కోట్లను పరిహారంగా అందజేయాలని కాకినాడ వినియోగదారుల కమిషన్‌ తీర్పు వెలువరించింది. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై)లో భాగంగా రైతుల నుంచి ప్రీమియం కింద రూ.1 నగదును బీమా కంపెనీకి చెల్లించగా, మిగిలిన మొత్తం ప్రభుత్వమే చెల్లించింది. 2020లో పెటా తుపాను కారణంగా రైతులకు పంట నష్టం కలిగింది. దీనిపై కాకినాడ డీసీసీబీ బ్యాంకు వారు రైతుల తరఫున పంట నష్టం అందజేయాలని ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ను కోరగా, వారు పరిహారం చెల్లించేందుకు నిరాకరించారు. దాంతో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కాకినాడ వారు గతేడాది మే 17న కమిషన్‌ను ఆశ్రయించారు. వాదోపవాదాల అనంతరం రూ.15,72,59,998 పరిహారంతో పాటు ఖర్చుల నిమిత్తం రూ.50 వేలు ఇవ్వాలని ఆదేశించింది. తీర్పు వెలువరించిన 45 రోజుల్లోపు బీమా కంపెనీ వారు ఈ సొమ్ము చెల్లించాలని కమిషన్‌ అధ్యక్షుడు చెరుకూరి రఘుపతి వసంత్‌కుమార్‌, సభ్యులు చెక్కా సుశీఆదిత్యకుమార్‌, చాగంటి నాగేశ్వరరావు తీర్పు వెలువరించారు.


ఓపీఎస్‌ సాధన దీక్ష: ఎస్టీయూ

ఈనాడు, అమరావతి: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం(సీపీఎస్‌) రద్దు చేసి పాత పెన్షన్‌(ఓపీఎస్‌) పునరుద్ధరణ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 3న కడప కలెక్టరేట్‌ వద్ద ఓపీఎస్‌ సాధన దీక్ష నిర్వహించనున్నట్లు రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయి శ్రీనివాస్‌, తిమ్మన్న తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్టీయూ సభ్యులు అందరూ తరలివస్తారని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు