స్మార్ట్‌ సిటీలపై పొంతనలేని సమాధానాలు

స్మార్ట్‌ సిటీలకు నిధుల వ్యయం విషయంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్‌ కిశోర్‌ రెండు ప్రశ్నలకు ఇచ్చిన వేర్వేరు సమాధానాలు గందరగోళానికి గురిచేస్తున్నాయి.

Updated : 03 Feb 2023 05:56 IST

పైసా ఖర్చు పెట్టలేదన్న కేంద్ర సహాయమంత్రి
రూ. 488 కోట్లు ఖర్చయ్యాయని మరోసారి వెల్లడి  

ఈనాడు, దిల్లీ: స్మార్ట్‌ సిటీలకు నిధుల వ్యయం విషయంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్‌ కిశోర్‌ రెండు ప్రశ్నలకు ఇచ్చిన వేర్వేరు సమాధానాలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. గత జనవరి 27 నాటికి కేంద్రం ఏపీలోని నాలుగు స్మార్ట్‌ సిటీలకు రూ. 1,905.2 కోట్లు విడుదల చేయగా, రూ. 1,690.19 కోట్లు వినియోగమయ్యాయని చెప్పారు. అత్యధికంగా అమరావతికి రూ. 528 కోట్లు విడుదల చేయగా రూ. 488 కోట్లు ఖర్చయినట్లు తెలిపారు. కాకినాడకు ఇచ్చిన రూ. 490 కోట్లలో రూ. 485 కోట్లు, తిరుపతికి ఇచ్చిన రూ. 392 కోట్లలో రూ. 289.75 కోట్లు, విశాఖకు ఇచ్చిన రూ. 495 కోట్లలో రూ. 427.44 కోట్లు ఉపయోగించినట్లు వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కాకినాడ, తిరుపతి, విశాఖపట్నలకు నిధులు ఏమీ విడుదల చేయలేదని, అమరావతికి మాత్రం రూ. 32 కోట్లు ఇచ్చామని తెలిపారు. ఇదే అంశంపై వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అడిగిన ప్రశ్నకు ఆయనే సమాధానమిస్తూ ఏపీలోని నాలుగు స్మార్ట్‌ సిటీల్లో రూ. 7,854 కోట్లతో 281 ప్రాజెక్టులు చేపట్టగా రూ. 2,437 కోట్ల విలువైన 183 ప్రాజెక్టులు పూర్తయ్యాయని, ఇంకా రూ. 5,417 కోట్ల విలువైన 98 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని చెప్పారు. అమరావతిలో రూ. 2,046 కోట్లతో 21 ప్రాజెక్టులు చేపట్టగా ఒక్కటీ పూర్తికాలేని, పైసా కూడా ఖర్చు కాలేదని వెల్లడించారు. ఒక సమాధానంలో అమరావతిలో కేంద్రం ఇచ్చిన రూ. 528 కోట్ల నిధుల్లో రూ. 488 కోట్లు వినియోగం అయ్యాయని చెప్పిన కేంద్రమంత్రి మరో సమాధానంలో మాత్రం పైసా కూడా ఖర్చు కాలేదని చెప్పడం గందరగోళం రేపుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని