తీసుకునే విద్యుత్‌ తక్కువ.. చెల్లించే స్థిర ఛార్జీలు ఎక్కువ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో (2022-23) పోలిస్తే.. వచ్చే ఏడాది (2023-24)లో డిస్కంలు విద్యుదుత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన స్థిర ఛార్జీలు 41.32 శాతం పెరగనున్నాయి.

Updated : 03 Feb 2023 06:07 IST

ఇదీ డిస్కంల తీరు
వచ్చే ఏడాది 41.32 శాతం పెరగనున్న భారం

ఈనాడు, అమరావతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో (2022-23) పోలిస్తే.. వచ్చే ఏడాది (2023-24)లో డిస్కంలు విద్యుదుత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన స్థిర ఛార్జీలు 41.32 శాతం పెరగనున్నాయి. ఈ భారం రూ.3,280 కోట్లుగా డిస్కంలు తేల్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.7,938.37 కోట్లు స్థిర ఛార్జీలుగా చెల్లించాలని లెక్కిస్తే.. ఆ మొత్తం వచ్చే ఏడాది రూ.11,218.48 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నాయి. కొత్తగా రెండు జెన్‌కో థర్మల్‌ ప్లాంట్లు అందుబాటులోకి రావడమే స్థిర ఛార్జీలు భారీగా పెరగడానికి కారణమని డిస్కంలు చెబుతున్నాయి. కానీ ఆ మేరకు జెన్‌కో నుంచి తీసుకునే విద్యుత్‌లో పెరుగుదల లేదు. జెన్‌కో నుంచి 2022-23లో 18,462.19 ఎంయూల విద్యుత్‌ వస్తుందని లెక్కిస్తే.. వచ్చే ఏడాది 18,880.60 ఎంయూలుగా డిస్కంలు అంచనా వేస్తున్నాయి. అంటే జెన్‌కో నుంచి అదనంగా వచ్చే 418.41 ఎంయూల విద్యుత్‌కు.. స్థిర ఛార్జీలుగా రూ.1,691.87 కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. 2022-23లో రూ.2,347.87 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని డిస్కంలు పేర్కొన్నాయి. రాష్ట్ర డిమాండ్‌కు మించి ఉన్న మిగులు విద్యుత్‌ కారణంగా థర్మల్‌ యూనిట్లను డిస్కంలు బ్యాక్‌డౌన్‌ (పూర్తి సామర్థ్యంలో ఉత్పత్తి చేయకుండా తగ్గించడం) చేయాల్సి వస్తోంది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆమోదం కోసం డిస్కంలు ప్రతిపాదన దాఖలు చేశాయి.

సీజీఎస్‌ల విద్యుత్‌ తగ్గినా.. స్థిర ఛార్జీలు పెరగడమేంటి?

కేంద్ర విద్యుదుత్పత్తి సంస్థల (సీజీఎస్‌) నుంచి ప్రస్తుత సంవత్సరంలో 13,797.62 ఎంయూల విద్యుత్‌ను డిస్కంలు తీసుకుంటే.. వచ్చే ఏడాది వాటి నుంచి 12,843.06 ఎంయూలు తీసుకునేలా ప్రతిపాదించాయి. వాటి నుంచి తీసుకునే దానిలో 954 ఎంయూలు తగ్గించినా.. చెల్లించాల్సిన స్థిర ఛార్జీలు మాత్రం రూ.4.87 కోట్లు పెరిగాయి.

డిస్కంలు ప్రస్తావించని ‘సెకి’ విద్యుత్‌ లెక్కలు

కృష్ణపట్నం, వీటీపీఎస్‌లో (ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యం) రెండు యూనిట్లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తిలోకి వస్తాయని.. వాటితో పాటు సెంబ్‌కార్ప్‌ నుంచి వచ్చే 625 మెగావాట్లతో కలిపి 12,496 ఎంయూల మిగులు ఉందని డిస్కంలు పేర్కొంటున్నాయి. ఇంత మిగులు ఉన్నా.. సెకి నుంచి ఏటా 17 వేల ఎంయూల సౌర విద్యుత్‌ 2024 సెప్టెంబరు నుంచి దశల వారీగా మూడేళ్లలో వస్తుంది. వచ్చే ఏడాది సెకి నుంచి 4,500 ఎంయూల (7 నెలలకు) విద్యుత్‌ వస్తుందని అంచనా.   దీంతో కలిపి రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ సుమారు 17 వేల ఎంయూలకు చేరుతుంది. వాటి నుంచి వచ్చే విద్యుత్‌ గ్రిడ్‌కు తీసుకున్నా.. లేకున్నా పీపీఏ ఒప్పందం ప్రకారం డిస్కంలు చెల్లించాలి. ఈ భారం కూడా విద్యుత్‌ వినియోగదారులపైనే పడనుంది.

కేంద్రం నిర్దేశించిన ఆర్‌పీపీవో కంటే ఎక్కువే

రాష్ట్రంలో వినియోగించే దానిలో 21.5 శాతం పునరుత్పాదక విద్యుత్‌ ఉండాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించింది. రాష్ట్ర విద్యుత్‌ డిమాండ్‌లో పునరుత్పాదక విద్యుత్‌ వాటా 25 శాతంగా ఉంది. ఇప్పటికే కేంద్రం నిర్దేశించిన పునరుత్పాదక విద్యుత్‌ కొనుగోలు బాధ్యత (రెన్యూవబుల్‌ పవర్‌ పర్చేజ్‌ ఆబ్లిగేషన్‌-ఆర్‌పీపీవో) మొత్తానికి మించి వినియోగిస్తున్నా.. మళ్లీ సెకి నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను డిస్కంలు తీసుకోనున్నాయి. ఇది కూడా కలిపితే పునరుత్పాదక విద్యుత్‌ వాటా 30 శాతానికి చేరుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వనరుల నుంచి వచ్చే విద్యుత్‌ను సర్దుబాటు చేయడానికి సుమారు 2,500 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిని బ్యాక్‌డౌన్‌ చేయాల్సి వస్తోందని అధికారులు పేర్కొన్నారు. దీనివల్ల సెకి నుంచి తీసుకునే విద్యుత్‌కు చెల్లించే మొత్తంతో పాటు.. స్థిర ఛార్జీల భారం కూడా వినియోగదారులపై పడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని