‘అప్పర్‌ భద్ర’తో సీమకు పెను విపత్తు

కర్ణాటక చేపట్టిన అప్పర్‌ భద్ర ప్రాజెక్టుతో రాయలసీమకు ముప్పు ముంచుకొస్తోంది. తుంగ నుంచి మొదటి దశలో 17.4 టీఎంసీలను భద్ర జలాశయానికి, రెండో దశలో భద్ర జలాశయం నుంచి మొత్తం 29.50 టీఎంసీల నీటిని 5.56 లక్షల ఎకరాల ఆయకట్టుకు తరలిస్తారు.

Updated : 04 Feb 2023 05:52 IST

29.9 టీఎంసీలను ఎత్తిపోయనున్న కర్ణాటక
ప్రాజెక్టుకు బడ్జెట్‌లో రూ.5,300 కోట్లు ఇచ్చిన కేంద్రం
దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను పట్టించుకోని తీరు
రాయలసీమ ప్రాజెక్టులకు ఇక కన్నీరే

ఈనాడు, అమరావతి - న్యూస్‌టుడే, అనంతపురం(శ్రీనివాస్‌నగర్‌): కర్ణాటక చేపట్టిన అప్పర్‌ భద్ర ప్రాజెక్టుతో రాయలసీమకు ముప్పు ముంచుకొస్తోంది. తుంగ నుంచి మొదటి దశలో 17.4 టీఎంసీలను భద్ర జలాశయానికి, రెండో దశలో భద్ర జలాశయం నుంచి మొత్తం 29.50 టీఎంసీల నీటిని 5.56 లక్షల ఎకరాల ఆయకట్టుకు తరలిస్తారు. 2020 నుంచి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.5.300 కోట్లను కేటాయించింది. ఇప్పటికే తుంగభద్ర జలాశయానికి సరిపడా నీరు రాక రాయలసీమ జిల్లాలు కష్టాలు ఎదుర్కొంటున్నాయి. తాజా ప్రాజెక్టుతో మూడు ఉమ్మడి జిల్లాల్లోని 7.94 లక్షల ఎకరాలపై తీవ్ర ప్రభావం పడనుంది. అప్పర్‌ భద్రను వ్యతిరేకిస్తూ మన రాష్ట్రం త్వరలోనే సుప్రీంకోర్టులో ఒరిజినల్‌ సూట్‌ దాఖలు చేయడానికి కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం...

తుంగభద్ర జలాశయం పరిధిలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఉన్నాయి. కృష్ణా ట్రైబ్యునల్‌ కేటాయించిన మేరకు అనేక సందర్భాల్లో నీళ్లు ఇవ్వలేకపోతున్నారు. అందుబాటులో ఉన్న నీటిని ఆయా నిష్పత్తి ప్రకారం పంచినా ఆ స్థాయిలోనైనా రాష్ట్రానికి నీళ్లు ఒకట్రెండు సందర్భాల్లో మాత్రమే వచ్చాయి. తుంగభద్రపై ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లోని దాదాపు 7.94 లక్షల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. ఎగువ (హెచ్‌ఎల్‌సీ), దిగువ (ఎల్‌ఎల్‌సీ), కేసీ కాలువల ద్వారా నీటిని వదులుతారు. అయితే... జలాశయం నుంచి రాయలసీమ జిల్లాల్లోని పూర్తి ఆయకట్టుకు నీళ్లు వచ్చిన సందర్భాలు లేవు. ఎప్పుడైనా వరద అధికంగా వచ్చి స్పిల్‌వే మీదుగా నీటిని దిగువకు నదిలోకి వదిలేస్తున్నా... జలాశయంలో సాగుకు సరిపోయే స్థాయిలో మాత్రం నీరు ఉండటం లేదు. ఈ పరిస్థితుల్లో అప్పర్‌ భద్ర నుంచి 29.50 టీఎంసీలను మళ్లిస్తే తుంగభద్ర ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంలో పడటం ఖాయంగా కనిపిస్తోంది.

* హెచ్‌ఎల్‌సీ కింద ఉమ్మడి అనంతపురం, కడప జిల్లాల్లోని 3,78,124 ఎకరాల ఆయకట్టుకు 32.50 టీఎంసీల నీటిని ఇవ్వాలి.

* ఎల్‌ఎల్‌సీ కింది ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 1,51,134 ఎకరాలకు 24 టీఎంసీలను ఇవ్వాలి.

* కేసీ కాలువ కింద ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాల్లోని 2,65,628 ఎకరాలకు 10 టీఎంసీలు వదలాలి.

అభ్యంతరాలున్నా దక్కిన అనుమతులు

తుంగ, విజయనగరం బ్రాంచి కాలువల ఆధునికీకరణ ద్వారా 11.5 టీఎంసీలు, కృష్ణా మొదటి ట్రైబ్యునల్‌ కేటాయించిన 734 టీఎంసీల్లో తాము వాడుకోని 10 టీఎంసీలు, పోలవరం ద్వారా వచ్చే గోదావరి జలాల్లో 2.4 టీఎంసీలు, కే-8, కే-9 బేసిన్లలో చిన్న నీటి వనరుల వినియోగంలో ఆరు టీఎంసీలు కలిపి మొత్తంగా... 29.5 టీఎంసీలను అప్పర్‌ భద్ర ద్వారా వినియోగిస్తామని కర్ణాటక అంటోంది. ఈ లెక్కల్లో అసమంజసమైన వివరాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ వాదిస్తున్నా... కేంద్ర జలసంఘం అనుమతులు ఇచ్చేసింది. ఈతీరుపై ఏపీ సుప్రీంకోర్టును ఆశ్రయించబోతోంది.

శ్రీశైలం ప్రాజెక్టుపై ప్రభావం

కృష్ణా నదికి తుంగభద్ర ఉప నది. వరదల కాలంలో తుంగభద్ర డ్యామ్‌ గేట్లు ఎత్తితే జలాలు నేరుగా శ్రీశైలం జలాశయంలోకి వస్తాయి. శ్రీశైలం జలాశయం బ్యాక్‌ వాటర్‌పై ఆధారపడి రాయలసీమ జిల్లాల్లో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు, ఎస్‌ఆర్‌బీసీ, తెలుగు గంగ వంటి వాటిపై అప్పర్‌గంగ ప్రభావం పడుతుంది. శ్రీశైలం జలాశయానికి ఆశించిన మేర వరద రాకుంటే సీమ ప్రాజెక్టులన్నీ ఒట్టిపోతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని