నాలుగు శాఖల్లో ఎక్కువ ఫిర్యాదులు

ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ప్రస్తుతం నిర్వహిస్తున్న ‘స్పందన’ కార్యక్రమాన్ని మరింత సమర్థంగా, మెరుగ్గా అమలు చేసేందుకు ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు.

Updated : 04 Feb 2023 05:34 IST

‘జగనన్నకు చెబుదాం’లో వాటిపై ప్రత్యేక దృష్టి
‘స్పందన’కు మెరుగైన రూపమే ఇది
ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం

ఈనాడు, అమరావతి: ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ప్రస్తుతం నిర్వహిస్తున్న ‘స్పందన’ కార్యక్రమాన్ని మరింత సమర్థంగా, మెరుగ్గా అమలు చేసేందుకు ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. వినతులను సంతృప్త స్థాయిలో పరిష్కరించడమే కార్యక్రమం ప్రధాన లక్ష్యమని, దానికి అధికారులంతా సన్నద్ధం కావాలని ఆయన ఆదేశించారు. ‘జగనన్నకు చెబుదాం’పై ఆయన  క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. స్పందన డేటా ప్రకారం రెవెన్యూ, పంచాయతీరాజ్‌, హోం, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖలకు సంబంధించి అత్యధిక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ‘జగనన్నకు చెబుదాం’ ప్రారంభమయ్యాక కూడా వాటికి సంబంధించే అత్యధికంగా వినతులు వచ్చే అవకాశాలున్నాయని, ఆయా శాఖల విభాగాధిపతులు అర్జీల పరిష్కారంపై మరింత దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతినీ పూర్తిస్థాయిలో పరిష్కరించే వరకు ప్రతి విభాగాధిపతి ట్రాక్‌ చేయాలని ఆదేశించారు. ‘ప్రజల నుంచి అందిన అర్జీలపై ప్రతివారం ఆడిట్‌ నిర్వహించి, నివేదికలు తీసుకోవాలి. వాటి ట్రాకింగ్‌, పర్యవేక్షణ సజావుగా జరుగుతోందో లేదో ప్రతివారం సమీక్షించాలి. వివిధ ప్రభుత్వ విభాగాల్లో అర్జీలు, ఫిర్యాదుల స్వీకరణకు ఇప్పటికే ఉన్న కాల్‌సెంటర్లను అనుసంధానించాలి. వివిధ విభాగాల్లో వినతుల పరిష్కారానికి ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతుల్ని పునఃపరిశీలించి, అవసరమైన మార్పులు చేయాలి’ అని ఆయన ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ప్రతి ప్రభుత్వ శాఖలోను ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమ పర్యవేక్షణ విభాగాలుండాలని, ఆ తర్వాత జిల్లా, మండల, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల స్థాయిలోను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

సహనం, ఓపికతో పరిష్కరించాలి

‘సమస్యల పరిష్కారం కోసమో, ఏదైనా విభాగంలో పని జరగలేదనో ప్రజలు వినతులు, ఫిర్యాదులు అందజేసినప్పుడు, వారిని సంతృప్తపరిచే స్థాయిలో పరిష్కారం చూపడం సవాల్‌తో కూడుకున్నది. సహనం, ఓపిక, పునఃపరిశీలన, విధానాల పునర్నిర్మాణంతో ముందుకు సాగాలి. సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు జరగాలి. ప్రాజెక్టు పర్యవేక్షణ యూనిట్ల ఏర్పాటుకు మార్గదర్శకాలు రూపొందించాలి. ఏ సమస్యనైనా నిర్దేశిత గడువులోగా పరిష్కరించడం చాలా ముఖ్యం. ఫిర్యాదుదారు నుంచి సమస్య పరిష్కారమయ్యాక లేఖ తీసుకోవాలి. ఏదైనా అర్జీని తిరస్కరించాల్సి వస్తే మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. దరఖాస్తును పరిష్కరించలేకపోయినా, ఆ దిశగా అధికారులు చేసిన కృషి, జరిగిన ప్రక్రియపై అర్జీదారులు సంతృప్తి వ్యక్తంచేసేలా ఉండాలి. ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వస్తే కఠినంగా వ్యవహరించాలి’ అని సీఎం ఆదేశించారు. పోలీసులకు వచ్చే అర్జీల పరిష్కారానికి మండల స్థాయిలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు వై.శ్రీలక్ష్మి, బుడితి రాజశేఖర్‌, ఎంటీ కృష్ణబాబు, హరీష్‌కుమార్‌ గుప్తా, ప్రవీణ్‌కుమార్‌, ఏఎండీ ఇంతియాజ్‌, ప్రభుత్వ సలహాదారుల సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని