ఇళ్లలో ‘సౌర వెలుగులకు’ డిస్కంలు అడ్డు

ఇళ్లపై సౌర విద్యుత్‌ ప్రాజెక్టులను సామాన్య ప్రజలకు చేరువ చేయాలని కేంద్రం భావిస్తుంటే.. రాష్ట్ర డిస్కంలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి.

Published : 04 Feb 2023 04:52 IST

జాతీయ పోర్టల్‌లో నమోదుకు అవకాశం కల్పించని రెండు డిస్కంలు
పథకం కింద అందని కేంద్రం రాయితీ
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇచ్చింది కేవలం 6.8 మెగావాట్లే!

ఈనాడు, అమరావతి: ఇళ్లపై సౌర విద్యుత్‌ ప్రాజెక్టులను సామాన్య ప్రజలకు చేరువ చేయాలని కేంద్రం భావిస్తుంటే.. రాష్ట్ర డిస్కంలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే ఇళ్లపై సౌర విద్యుత్‌ ఫలకలు ఏర్పాటు చేసుకున్న వారికి నెట్‌ మీటర్లు ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నాయి. ఈ పథకం అమలు చేస్తే.. భవిష్యత్తులో డిస్కంల నుంచి తీసుకునే విద్యుత్‌ తగ్గిపోతుందని అధికారులు పేర్కొంటున్నారు. అందువల్లే కేంద్రం ప్రకటించిన ఇళ్ల కప్పుపై సౌర విద్యుత్‌(ఆర్‌టీఎస్‌) పథకానికి డిస్కంలు అవకాశం కల్పించడం లేదు. మంజూరుకు ఎలాంటి పరిమితి లేకున్నా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తూర్పు విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్‌) 1.4 మెగావాట్లు, దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్‌) 5.4 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు మాత్రమే అనుమతులు ఇచ్చాయి. డిస్కంల నిర్వాకంతో ఇళ్లపై ఏర్పాటు చేసే వాటికి కిలోవాట్‌కు రూ.14,588 వంతున.. రెసిడెన్షియల్‌ వెల్‌ఫేర్‌ అసోసియేషన్లు(ఆర్‌డబ్ల్యూఏ), గ్రూప్‌ హౌసింగ్‌ సొసైటీ (జీహెచ్‌ఎస్‌)లకు మెగావాట్‌కు రూ.7,294 వంతున కేంద్రం ఇచ్చే రాయితీని కోల్పోవాల్సి వస్తోంది. దేశ వ్యాప్తంగా ఆర్‌టీఎస్‌, పీఎం కుసుమ్‌ కింద(రైతులకు కిలోవాట్‌ సౌర విద్యుత్‌ ప్రాజెక్టులు ఇచ్చే పథకం) 40 వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. పథకం అమలుకు నేరుగా దరఖాస్తు చేసుకునేలా జాతీయ స్థాయి పోర్టల్‌ను కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. విద్యుత్‌ వినియోగదారుల వివరాలను డిస్కంలు ఆ పోర్టల్‌కు అనుసంధానించాలి.

రెండు డిస్కంల సమాచారమే లేదు

ఇళ్లపై గృహ విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతులు ఇస్తూ వెళ్తే.. భవిష్యత్తులో విద్యుత్‌ కొనేవారే ఉండరన్న అభిప్రాయాన్ని డిస్కంలకు చెందిన ముఖ్య అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అందువల్లే డిస్కంలు ఉద్దేశపూర్వకంగా నెట్‌ మీటర్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో సుమారు 50 పాఠశాలల్లో ఈ ప్రాజెక్టులను ఒక ఏజెన్సీ ఏర్పాటు చేస్తే.. వాటికి నెట్‌ మీటర్లు ఇవ్వకుండా డిస్కం ఇబ్బందిపెడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రాల డిస్కంల నుంచి ఆశించిన సహకారం లేదన్న కారణంగా జాతీయ స్థాయిలో పోర్టల్‌ను httpa://solarrooftop.gov.in/ కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో వచ్చిన దరఖాస్తులను డిస్కంలకు కేంద్రం పంపుతుంది. ఈపీడీసీఎల్‌ మినహా.. మిగిలిన రెండు డిస్కంలు విద్యుత్‌ వినియోగదారుల వివరాలను పోర్టల్‌కు ఇప్పటికీ అనుసంధానించలేదు. దీనివల్ల వాటి పరిధిలోని వారు కేంద్రం ఇచ్చే రాయితీలు కోల్పోవాల్సి వస్తోంది.

పీపీఏ విద్యుత్‌ ఏం చేయాలి?

ఇప్పటికే వ్యవసాయ విద్యుత్‌ కోసం సెకి నుంచి 7 వేల మెగావాట్లను ప్రభుత్వం తీసుకుంటోంది. దీనివల్ల రైతుల కోసం ఇప్పటికే కొన్న విద్యుత్‌ను డిస్కంలు సర్దుబాటు చేయాల్సి వస్తోంది. వాణిజ్య సంస్థలు, పరిశ్రమల నుంచి వసూలు చేసే టారిఫ్‌ ఎక్కువగా ఉందన్న ఉద్దేశంతో కొన్ని సంస్థలు ఇప్పటికే ఓపెన్‌ యాక్సెస్‌ విధానంలో బహిరంగ మార్కెట్‌ నుంచి విద్యుత్‌ కొంటున్నాయి. దీనివల్ల వాటి నుంచి వచ్చే క్రాస్‌ సబ్సిడీ కూడా నష్టపోవాల్సి వస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్‌టీఎస్‌ పథకం కింద నెట్‌ మీటర్లు ఇస్తూ వెళ్తే డిస్కంలు దివాలా తీసే పరిస్థితి ఏర్పడుతుందని అధికారి పేర్కొనడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని