రాష్ట్రం పెట్రో దెబ్బ!

బాదుడే బాదుడంటే ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్ర ప్రజలకు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. పెట్రో అమ్మకాలు తగ్గినా... ఆదాయం ఎలా పెంచుకోవాలో.. పన్నులను మోపుతూ ప్రజల నుంచి ఎంత మేర పిండుకోవాలో ఈ ప్రభుత్వం నుంచి నేర్చుకోవచ్చేమో అన్నంతగా జనాన్ని నిలువు దోపిడీ చేస్తున్నారు.

Updated : 05 Feb 2023 10:57 IST

పెట్రో ఉత్పత్తులపై పన్నుల మోత  
అమ్మకాలపై ఈ ఏడాది రూ.17వేల కోట్లపైనే రాబడి
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతెత్తి అరిచిన జగన్‌
అధికారంలోకి వచ్చాక ప్రజల నుంచి పిండుకుంటున్న వైనం
రాష్ట్ర పన్నులను తగ్గించకపోవడంతో తొలగని భారం
ఈనాడు - అమరావతి

బాదుడే బాదుడంటే ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్ర ప్రజలకు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. పెట్రో అమ్మకాలు తగ్గినా... ఆదాయం ఎలా పెంచుకోవాలో.. పన్నులను మోపుతూ ప్రజల నుంచి ఎంత మేర పిండుకోవాలో ఈ ప్రభుత్వం నుంచి నేర్చుకోవచ్చేమో అన్నంతగా జనాన్ని నిలువు దోపిడీ చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ సరకులు అమ్ముకునే చిరు వ్యాపారుల నుంచి సరకు రవాణా వాహనాల యజమానుల వరకూ అన్ని వర్గాల ప్రజల నడ్డి విరుస్తున్నారు.

ప్రభుత్వ బాదుడు భరించలేక వాహన దారులు పక్క రాష్ట్రాలకు పారిపోతున్నారు. లారీ, ట్రాక్టర్ల యజమానులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటప్పుడే ట్యాంకు నిండా ఇంధనం భర్తీ చేయించుకుంటున్నారు. కాకినాడ, అనంతపురం, కర్నూలు తదితర ప్రాంతాల వారైతే తమకు దగ్గరలోని పుదుచ్చేరి, కర్ణాటకల్లోని బంకులకు వెళ్లి పెట్రోలు కొంటున్నారు.

బాదుడులో రాష్ట్రానిదే అగ్రస్థానం

పెట్రోలు, డీజిల్‌ ధరల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే... ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. పుదుచ్చేరితో పోలిస్తే ప్రతి లీటరుకు పెట్రోలుపై రూ.15.71, డీజిల్‌పై రూ.13.28 చొప్పున తేడా ఉంది. అమరావతితో పోలిస్తే.. బెంగళూరులో లీటరు పెట్రోలు రూ.9.93, డీజిల్‌ రూ.12.02 తక్కువకే లభిస్తోంది.  

బాదుడు భరించలేకే ఇతర రాష్ట్రాలకు!

మన రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్‌పై బాదుడును భరించలేకనే వాహనదారులు పక్క రాష్ట్రాలకు పోతున్నారు. అందుకే ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మినహా మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో అమ్మకాల వృద్ధి గణనీయంగా నమోదైంది. కర్ణాటకలో డీజిల్‌పై 71.24%, పుదుచ్చేరిలో 134.47% వృద్ధి నమోదైంది. పెట్రోలు అమ్మకాల్లోనూ పుదుచ్చేరిలో 53.54%, కేరళలో 29.82%, కర్ణాటకలో 26.33% వృద్ధి కనిపించింది. తమిళనాడులోనూ 20.95% ఉంది. రాష్ట్రంలో పెట్రోలు అమ్మకాల్లో 1.03%, డీజిల్‌ అమ్మకాల్లో 8.04% వృద్ధే నమోదైంది.


* పెట్రోలు, డీజిల్‌పై బాదుడే బాదుడంటూ.. ఎన్నికల ముందు జగన్‌ గొంతెత్తి అరిచారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలోనూ అప్పటి అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. పక్క రాష్ట్రానికి పోతే లీటరు ఆరేడు రూపాయలు  తక్కువకు దొరుకుతోందని మరీ చెప్పారు.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలలకు పెట్రో ఉత్పత్తుల అమ్మకాలపై రాబడి రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరం (2021-22) తొలి ఆరు నెలల కంటే రూ.1,478 కోట్లు పెరిగింది. ఇదే సమయంలో కర్ణాటకలో రూ.9,413 కోట్ల నుంచి రూ.9,140 కోట్లకు తగ్గింది. పుదుచ్చేరిలోనూ పెట్రో పన్నుల రాబడి 16.67% పడిపోయింది. కేంద్రంతోపాటు దేశంలోని అధిక శాతం రాష్ట్రాలు ఇంధనంపై అమ్మకం పన్నును తగ్గించడం ద్వారా ప్రజలపై భారాన్ని తగ్గించాయి. సీఎం జగన్‌ పైసా తగ్గించకుండా నిలువు దోపిడీ చేయడాన్ని ఏమనాలి?

* ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో కర్ణాటకలో డీజిల్‌ అమ్మకాల్లో 71%, పెట్రోలు అమ్మకాల్లో 26% వృద్ధి నమోదైంది. కేరళలోనూ డీజిల్‌ అమ్మకాలు ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య 153% పెరిగాయి. రాష్ట్రంలో డీజిల్‌ అమ్మకాల్లో 1.03%, పెట్రోలు అమ్మకాల్లో 8.04% వృద్ధి మాత్రమే నమోదైంది. అయినా ఆ రాష్ట్రాల కంటే ఆదాయం ఎక్కువగా రావడాన్ని బాదుడే అనుకోవాలి కదా?


పెట్రో పన్ను రాబడి ఎక్కువే

* రాష్ట్రంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలలతో పోలిస్తే 2022-2023 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో పెట్రో ఉత్పత్తుల అమ్మకాలపై పన్నుల రాబడి 20.48% అధికంగా ఉంది. 6 నెలల్లోనే రాష్ట్ర ఖజానాకు రూ.8,694 కోట్లు జమయ్యాయి.  

* గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల ద్వారా రూ.14,724 కోట్లు పిండుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల గణాంకాల ప్రాతిపదికన చూస్తే.. ఏడాది రాబడి రూ.17వేల కోట్లపైనే ఉంటుందని అంచనా.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని