వివేకా హత్య కేసులో.. సీబీఐ ఎదుటకు ఐదుగురు నిందితులు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా ఐదుగురు నిందితులు ఈ నెల 10న సీబీఐ కోర్టులో హాజరుకానున్నారు.

Updated : 05 Feb 2023 06:48 IST

10న హాజరు కావాలని వారెంట్లు, సమన్ల జారీ

ఈనాడు డిజిటల్‌, కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా ఐదుగురు నిందితులు ఈ నెల 10న సీబీఐ కోర్టులో హాజరుకానున్నారు. ఈ కేసు దర్యాప్తు హైదరాబాద్‌ సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ అయ్యాక ఐదుగురు నిందితులనూ ఒకేసారి పిలవడం ఇదే తొలిసారి. వైయస్‌ఆర్‌ జిల్లా కేంద్రమైన కడప కేంద్ర కారాగారంలో ఉన్న ముగ్గురు నిందితులకు ప్రొడక్షన్‌ వారెంట్‌ జారీ కాగా, బెయిలుపై ఉన్న మరో ఇద్దరికి సీబీఐ నుంచి సమన్లు అందాయి. కడప జైలులో రిమాండు ఖైదీలుగా ఉన్న సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలతో పాటు బెయిల్‌పై ఉన్న ఎర్రగంగిరెడ్డి, డ్రైవర్‌ దస్తగిరి 9న కడప నుంచి బయల్దేరి.. 10న ఉదయం 10.30 గంటలకు సీబీఐ కోర్టు ముందు హాజరుకానున్నారు. జనవరి 27న సీబీఐ కోర్టు కేసు నంబరు ఎస్‌సీ-01-2023 కేటాయిస్తూ వీరికి సమన్లు జారీ చేయగా, అధికారులు దశల వారీగా నిందితులకు అందజేశారు. శనివారం ఉదయం కడపకు వచ్చిన ఎర్ర గంగిరెడ్డి సీబీఐ అధికారులను కలిసి సమన్లు తీసుకున్నారు. దస్తగిరికి ఇప్పటికే సమాచారమివ్వగా, ఆదివారం సమన్లు అందుకున్నారు. ఇక, రిమాండు ఖైదీలుగా ఉన్న ముగ్గురికి ప్రొడక్షన్‌ వారెంట్‌ జారీ చేయడంతో పాటు వారిని సీబీఐ కోర్టులో హాజరుపరచాలని కడప జైలు అధికారులకు కూడా సమాచారమందింది. వీరిని భద్రత నడుమ హైదరాబాద్‌కు తరలించాలని జైలు అధికారులు ఏఆర్‌ పోలీసులను కోరారు. సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ తర్వాత.. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న నిందితులను తిరిగి కడప జైలుకు తరలిస్తారా, లేక హైదరాబాద్‌లోనే ఏదైనా జైలుకు పంపుతారా అనేది తేలనుంది. ఇటీవల సీబీఐ అధికారులు కీలక వ్యక్తులను విచారించిన దరిమిలా 10న అదనపు ఛార్జిషీట్‌ దాఖలు చేయవచ్చన్న చర్చ సాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని