రూ.3,333 కోట్ల అమృత్‌ నిధులతో 226 ప్రాజెక్టులు

అమృత్‌ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో రూ.3,333.76 కోట్లతో 226 ప్రాజెక్టులు చేపట్టినట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి కౌశల్‌ కిశోర్‌ తెలిపారు.

Updated : 07 Feb 2023 05:57 IST

ఈనాడు, దిల్లీ: అమృత్‌ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో రూ.3,333.76 కోట్లతో 226 ప్రాజెక్టులు చేపట్టినట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి కౌశల్‌ కిశోర్‌ తెలిపారు. అందులో రూ.801.10 కోట్ల విలువైన 105 ప్రాజెక్టులు పూర్తవగా, రూ.2,532.66 కోట్ల విలువైన 121 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నట్లు వెల్లడించారు. ఆయన సోమవారం రాజ్యసభలో తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు బదులిచ్చారు. అమృత్‌ పథకానికి కేంద్రం తన వాటాగా రూ.1,056.62 కోట్లు అందించడానికి కట్టుబడి ఉందని, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం, పట్టణ స్థానిక సంస్థలు సమకూర్చుకోవాల్సి ఉంటుందన్నారు.

2.93 లక్షల ఎంఎస్‌ఎంఈలకు రూ.13 వేల కోట్ల రుణం

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీ క్రెడిట్‌లైన్‌ గ్యారెంటీ స్కీం కింద ఆంధ్రప్రదేశ్‌లో 2,93,884 సంస్థలకు కలిపి రూ.13,073.17 కోట్ల రుణం అందించినట్లు కేంద్ర ఎంఎస్‌ఎంఈ శాఖ సహాయమంత్రి భానుప్రతాప్‌ సింగ్‌ వర్మ తెలిపారు. ఆయన సోమవారం రాజ్యసభలో వైకాపా సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.

ప్రైవేటు సంస్థలకు గనుల కేటాయింపు

కేంద్రం తాజాగా సవరించిన మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ (డెవలప్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌)-1957 చట్టం కింద ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు గనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించినట్లు కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. ఆయన సోమవారం రాజ్యసభలో భాజపా సభ్యుడు సీఎంరమేష్‌ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. రాష్ట్రంలోని గొర్లగుట్టలో లైమ్‌స్టోన్‌ మైన్‌ను శ్రీజయజ్యోతి సిమెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు, దేవద బ్లాక్‌ మాంగనీస్‌ను మహాలక్ష్మి మినరల్స్‌కి, గుట్టుపల్లి ఇనుప ఖనిజం గనులను తేజా ఇన్‌ఫ్రాటెక్‌కు, వెల్దుర్తి ఐరన్‌వోర్‌ బ్లాక్‌ను ఆమోదా ఐరన్‌ అండ్‌ స్టీల్‌ లిమిటెడ్‌కు వేలం ద్వారా అప్పగించినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని